Hands Transplantation operation, with
organs of a dying donor
ఒక మహిళ తను మరణిస్తున్నానని తెలిసి శరీర భాగాలను
దానం చేసింది. దాంతో ఒక పెయింటర్కు ఆమె రెండు చేతులూ అమర్చారు. ఒక దాత ఇఛ్చిన చేతులను
వేరొక వ్యక్తికి అమర్చే శస్త్రచికిత్స ఉత్తరభారతదేశంలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన
ఆపరేషన్ ఢిల్లీలోని శ్రీగంగారాం ఆస్పత్రిలో జరిగింది. ఆ వ్యక్తి ఇప్పుడు
కోలుకున్నాడు. రేపు అతన్ని డిస్చార్జ్ చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో
తెలియజేసాయి.
ఢిల్లీకి చెందిన 61ఏళ్ళ ఒక మహిళ కొద్ది వారాల
క్రితం బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మరణించింది. అనారోగ్యం నిర్ధారణ అయినప్పుడే ఆమె
తన శరీర భాగాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా దానికి
అంగీకరించారు. దాంతో ఆమె శరీరం నుంచి మూత్రపిండాలు, కాలేయం, కార్నియాలు, చేతులను
సేకరించారు.
ఒక కిడ్నీని గుర్గావ్లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో
ఒక రోగికి అమర్చారు, మిగతా అవయువాలను శ్రీగంగారాం ఆస్పత్రిలోని పేషెంట్లకు
అమర్చారు. కిడ్నీలు, లివర్, కార్నియాలను ఇతర రోగులకు అమర్చడం సర్వసాధారణమే. అయితే,
ఒక వ్యక్తి చేతులను మరోవ్యక్తికి అమర్చడం అరుదైన సంఘటన. అందునా ఉత్తరభారతదేశంలో
ఇప్పటివరకూ అలాంటి శస్త్రచికిత్స జరగనే లేదని శ్రీగంగారాం ఆస్పత్రి వర్గాలు
చెబుతున్నాయి.
ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ళ పెయింటర్
ఒకతను 2020లో రైలు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతను రెండు చేతులూ
కోల్పోయాడు. ట్రాక్ దాటుతుండగా రైలు కింద పడడంతో ఆ వ్యక్తి రెండు చేతులూ తెగిపోయాయి.
ఒక చెయ్యి మోచేతి దగ్గర, మరోచెయ్యి మోచేతికి కొంచెం కింద తెగిపోయాయి. అప్పటినుంచీ
వికలాంగుడిగా జీవిస్తున్న ఆ వ్యక్తికి సుమారు మూడేళ్ళ తర్వాత కొత్త చేతులు
వచ్చాయి.
శ్రీగంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్
స్వరూప్ ఇలా చెప్పారు, ‘‘మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బృందం 12గంటల పాటు
కష్టపడింది. కాలేయం, మూత్రపిండం, కార్నియాలతో పాటు రెండు చేతులను వేర్వేరు
వ్యక్తులకు అమర్చాము. బైలేటరల్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స చేయడం
ఉత్తరభారతదేశంలో ఇదే మొదటిసారి.’’
డాక్టర్ అజయ్ స్వరూప్ ఆ ఆపరేషన్ గురించిన వివరాలు
వెల్లడించారు. ‘‘ఈ శస్త్రచికిత్సావిధానం చాలా సంక్లిష్టమైనది. మా ఆస్పత్రిలో
ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మహేష్ మంగళ్… డాక్టర్ ఎస్ఎస్ గంభీర్,
డాక్టర్ అనుభవ్ గుప్తా, డాక్టర్ భీమ్ నందా, డాక్టర్ నిఖిల్ ఝున్ఝున్వాలాలతో
కూడిన బృందంతో ఆ ఆపరేషన్ చేసారు. చేతులు అమర్చడం ఎంతో సున్నితంగా చేయవలసిన చాలా
సంక్లిష్టమైన ప్రక్రియ. ఎముకలు, రక్తనాళాలు, కండరాలు, నరాలు, చర్మం వంటి
శరీరభాగాలను జాగ్రత్తగా అతకాలి. దానికి ఎంతో నైపుణ్యం, చాకచక్యం, కచ్చితత్వం
కావాలి. అదే సమయంలో రోగి శరీరంలోని
భాగాలతో ఈ భాగాలు కలిసిపోయేలా జాగ్రత్త వహించాలి’’ అని వివరించారు.
45ఏళ్ళ ఆ వ్యక్తికి చేసిన శస్త్రచికిత్స
విజయవంతమైంది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు.
చేతులను, చేతివేళ్ళను కదపగలుగుతున్నాడని వెల్లడించారు. అతన్ని రేపు ఆస్పత్రి నుంచి
డిస్చార్జ్ చేస్తామని శ్రీగంగారాం ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటన ద్వారా తెలియజేసాయి.