మంగళగిరి
ఎయిమ్స్ను ప్రధాని మోదీ, రేపు(ఫిబ్రవరి 25న) జాతికి అంకితం ఇవ్వనున్నారు. మంగళగరి
ఎయిమ్స్తో పాటు రాజ్ కోట్, భటిండా, రాయ్బరేలి, కళ్యాణి లోని ఎయిమ్స్ సంస్థలను
కూడా ప్రధాని మోదీకి జాతికి అంకితం ఇస్తారు. అలాగే మరో 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు
వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు.
మంగళగిరిలో
ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రులు ప్రహ్లాద్
జోషి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, గవర్నర్ అబ్ధుల్ నజీర్, రాష్ట్ర మంత్రి విడదల
రజనీ పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్
సీఎస్ ఎంటీ కృష్ణబాబు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు అంతా
సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమీక్షలో ఏపీఎంఎస్ ఐడీసీ ఎం.డి.మురళీధర్రెడ్డి, కమిషనర్ జె.నివాస్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్
నిధి కేసర్వాని, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధబానంద
కర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేంద్రం ఎయిమ్స్ ను కేటాయించింది. రూ. 1618 కోట్లతో
నిర్మించి రోగులకు అధునాతన వైద్య సేవలు అందజేసేందుకు తోడ్పడింది. మెడికల్ కాలేజీ,
ల్యాబ్, నర్సింగ్ కాలేజీ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ సేవలు
అందజేస్తున్నారు. 2019 నుంచి రోగులకు సేవలు అందజేస్తుండగా, ఇప్పటికే 15 లక్షల
మందికి ఓపీ సేవలు అందాయి. వైద్యపరమైన సాయం కోసం రోజుకు రెండున్నర వేల మంది,
మంగళగిరి ఎయిమ్స్ ను సందర్శిస్తున్నారు.