పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పార్లమెంటు
ముట్టడికి బయలుదేరిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సంభూ సరిహద్దులో ఆందోళనకారులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ వదలడంతో
చెల్లాచెదురైన ఆందోళనకారులు, అంబాల రహదారిపైకి చేరుకున్నారు. రైతుల నిరసన పిలుపు
నేపథ్యంలో దిల్లీలో కూడా భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వేలాది వాహనాలు
రోడ్లపై నిలిచిపోయాయి.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతు
సమస్యలు పరిష్కారం కోరుతూ చేపట్టిన ‘చల్లో
దిల్లీ’ కార్యక్రమంలో భాగంగా వేలాది ట్రాక్టర్లు పంజాబ్, హర్యానా నుంచి దేశ రాజధాని
వైపు కదులుతున్నాయి.
గతంలో సాగు చట్టాల రద్దు కోరుతూ నెలల తరబడి
ఆందోళనకు దిగిన రైతు సంఘాలు, ఇప్పుడు పంటకు కనీస మద్దతు ధర కోరుతూ ‘ఛలో దిల్లీ’కి
పిలుపునిచ్చాయి.
రైతులంతా పక్కా ఏర్పాట్లతో ఆందోళనకు సిద్ధమయ్యారు.
ఆరు నెలలకు సరిపడా సరుకులు, ట్రాక్టర్లకు డిజీల్ నింపుకుని హస్తినకు
చేరుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓర్పుతో తమ డిమాండ్లు నెరవేరే వరకు
ఆందోళన కొనసాగిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.
‘‘ సూది నుంచి సుత్తి వరకు, అవసరమైన అన్ని
పరికరాలు, సరుకులతో మా సంచులను నింపేశాం. దారిలో అడ్డుగా ఉండే సిమెంట్ బ్యారికేడ్లు
పగలగొట్టేందుకు అసరమైన పనిముట్లు కూడా తీసుకెళుతాన్నాం. దాదాపు ఆరు నెలలు
గ్రామాలను విడిచిపెడుతున్నాం అందుకు అవసరమైన రేషన్ కూడా తీసుకెళుతున్నాం.’’ అని
దిల్లీ ఆందోళనలో పాల్గొనేందుకు వెళుతున్న పంజాబ్ కు చెందిన హరిభజన్ సింగ్ అనే రైతు జాతీయ మీడియాకు
చెప్పాడు. 2020లో జరిగిన ఆందోళనలో కూడా పాల్గొన్నట్లు చెబుతున్న సింగ్, ఈ సారి
డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు.
దిల్లీ వెళుతున్న ట్రాక్టర్లకు డిజీల్ ను
నింపడం లేదని మరికొందరు రైతులు ఆరోపిస్తున్నారు. పంజాబ్లోని
ఫతేగర్ సాహిబ్ నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు హస్తిన వైపు పయనమయ్యాయి. సంభూ
బోర్డర్ మార్గం నుంచి కూడా ప్రయాణం మొదలు
పెట్టారు. మరో గ్రూపు మేహల్ కలన్ దారిలో కన్నౌరి సరిహద్దు దిశగా ప్రయాణం
మొదలుపెట్టింది.
పంజాబీ రైతులను అడ్డుకునేందుకు హర్యానాలోని
సరిహద్దుల వద్ద భద్రత పెంచారు. అంబాలా, జింద్, ఫతేహ్బాద్, కురుక్షేత్ర, సిర్సా రహదారులను మూసివేశారు. సిమెంట్ దిమ్మెలు, ఇనుపమేకులు,
ముళ్ళ కంచెలు వేసి రోడ్లును దిగ్భందించారు. హర్యానాలోని 15 జిల్లాల్లో 144 సెక్షన
కింద ఆంక్షలు అమలు చేస్తున్నారు.