యాంటీబయోటిక్స్(antibiotics) వినియోగంపై
వైద్యులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇక నుంచి రోగులకు యాంటిబయోటిక్స్ మందులు సూచించినప్పుడు అందుకు తగిన కారణాలు, సమర్థింపును మందుల
చీటీపై రాయాలని ఆదేశించింది.
బ్యాక్టీరియా
ఇన్ఫెక్షన్లు, సూపర్బగ్ల చికిత్స లో ఉపయోగిస్తున్న సాధారణ ఔషధాల సామర్థ్యాన్ని
యాంటీబయోటిక్స్ దెబ్బతీస్తున్నాయనే ఆధారాలు పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక
ప్రకటన చేసింది. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్టులు కూడా యాంటీ బయోటిక్స్
విక్రయించవద్దు అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు మెడికల్ కాలేజీలు, ఫార్మసిస్ట్
అసోసియేషన్, మెడికల్ అసోషియన్లకు కేంద్ర వైద్య సేవల డైరెక్టర్ జనరల్(DGHS) అతుల్ గోయెల్ లేఖలు రాసారు.
డ్రగ్స్
అండ్ కాస్మెటిక్స్ నియమాల షెడ్యూల్ లోని హెచ్, హెచ్1 నిబంధనలను ఫార్మసిస్టులు
పాటించాలని గుర్తు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ, చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లను
మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుచేసింది.
ప్రజారోగ్యానికి పొంచిఉన్న ముప్పులో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఒకటని
పేర్కొంది.
యాంటీబయోటిక్స్ వాడకం విచ్చలవిడిగా పెరగడంతో రోగకారక
క్రిములు వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి. మొండి బ్యాక్టిరీయా వాటిని
ప్రతిఘటించడంతో యాంటిబయాటిక్స్
పనికిరాకుండా పోవడంతో పాటు దీర్ఘకాలంలో పలు దుష్ప్రభావాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో
అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ, వైద్యులకు కీలక సూచనలు చేసింది. అత్యవసరంగా తమ
సూచనలు అమలు చేయాలని కోరింది.