ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా
చెన్నైలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో న్యూజీలాండ్ జట్టు బంగ్లాదేశ్పై ఘనవిజయం
సాధించింది. ఈ టోర్నమెంట్లో ఆడిన మూడు మ్యాచ్లలోనూ గెలిచి, హ్యాట్రిక్
సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్
నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. మ్యాచ్ మొత్తం
బంగ్లాదేశ్ తడబడుతూనే ఉంది. ఓపెనింగే వికెట్ కోల్పోవడం బంగ్లా నైతిక స్థైర్యాన్ని
దెబ్బతీసింది. మ్యాచ్ మొదటి బాల్కే లిటన్ దాస్ డకౌట్ అయ్యాడు. తర్వాత తాంజిద్
(16), మిరాజ్ (30) పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నారు అని భావించేలోగానే ఔటయ్యారు.
కేవలం 16 పరుగుల తేడాలోనే బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ 56
పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ముష్ఫికర్ రహీం (66), షకీబ్ అల్ హసన్ (40)
నిలకడగా ఆడి, ఐదో వికెట్కు 96 పరుగులు జోడించడంతో బంగ్లా జట్టు కొంచెం ఊపిరి
పీల్చుకుంది. 30 ఓవర్లు పూర్తయేసరికి 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు
సాధించగలిగింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు పడిపోయాయి. ముష్ఫికర్, షకీబ్లతో
పాటు తౌహీద్ (13) కూడా ఔట్ అయ్యారు. దాంతో 180 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి,
స్కోరు కనీసం 200 దాటించలేని దుస్థితిలో బంగ్లాదేశ్ పడుతుందేమోనన్న అనుమానాలు
తలెత్తాయి. అయితే మహ్మదుల్లా (41*) లోయర్ ఆర్డర్తో కలిసి బంగ్లాదేశ్కు
గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
246 పరుగుల విజయలక్ష్యాన్ని న్యూజీలాండ్
సునాయాసంగా ఛేదించింది. 42.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 248
పరుగులు సాధించింది. డరిల్ మిషెల్ (89*) విలియంసన్ (78) అద్భుతంగా రాణించారు. ఈ
టోర్నమెంట్లో మంచి ఫాంలో ఉన్న రచిల్ రవీంద్ర ఈ మ్యాచ్లో 9 పరుగులకే
వెనుదిరిగాడు. దాంతో కివీస్ ఆచితూచి ఆడారు. 7 నెలల తర్వాత బరిలో అడుగుపెట్టిన
విలియంసన్, కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదట కాన్వే (45)తో కలిసి బ్యాటింగ్
మొదలుపెట్టాడు. ఆ తర్వాత విలియంసన్, మిషెల్ జోడీ ఎక్కడా తగ్గలేదు. విలియంసన్ హాఫ్
సెంచరీ పూర్తయాక వేలికి బాల్ గట్టిగా తగలడంతో రిటైర్డ్ హర్ట్ అయాడు. ఐనా మిషెల్ దూకుడు
కొనసాగించాడు. ఇన్నింగ్స్కు ఇంకా 43 బాల్స్ ఉండగానే కివీస్ విజయలక్ష్యాన్ని
చేరుకుంది.
బంగ్లాదేశ్ను తన బౌలింగ్తో
ముప్పుతిప్పలు పెట్టిన ఫెర్గూసన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అతను
10 ఓవర్లలో కేవలం 49 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీసి బంగ్లాదేశ్
వెన్ను విరిచాడు.