ప్రయాగరాజ్ త్రివేణీ సంగమం దగ్గర మహాకుంభమేళాలో ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించే రెండో విశేషమైన రోజుగా పరిగణిస్తారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే త్రివేణీ సంగమానికి భక్తజన సముద్రం పోటెత్తింది. ఆ సందర్భంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. కనీసం పదిమంది భక్తులు గాయపడ్డారని తెలుస్తోంది. మరికొంతమంది మరణించారని వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకూ నిర్ధారణ కాలేదు. ఈ ఒక్కరోజే సుమారు పదికోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారని అంచనా.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని నిరంతరాయంగా సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం మూడుసార్లు యోగితో మాట్లాడారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు తగిన సూచనలు ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు. ఎలాంటి సాయమైనా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
భక్తుల తాకిడి తీవ్రస్థాయిలో ఉండడం, తొక్కిసలాటలూ మరణాల పుకార్ల నేపథ్యంలో అఖాడాలు ఇవాళ పవిత్ర స్నానాలను వాయిదా వేసుకున్నాయి. ప్రతీరోజూలా మొట్టమొదటే కాకుండా ఇవాళ వీలు దొరికినప్పుడే పవిత్ర స్నానం ఆచరిస్తామని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు రవీంద్ర పురి వెల్లడించారు. ఈ ఉదయం 9గంటల తర్వాత రద్దీ తగ్గడంతో కొద్దికొద్దిమంది చొప్పున స్నానాలు పూర్తి చేస్తామన్నారు. తమకు ఉద్దేశించిన ఘాట్లు ఖాళీ అయ్యాయనీ, అందువల్ల మహామండలేశ్వరులు, మండలేశ్వరులు, నాగా సాధువులు, ఇతర భక్తులు అందరూ పవిత్ర స్నానం ఆచరిస్తారనీ వివరించారు. అవసరమైతే తమ పవిత్ర స్నానాలను రాత్రి చేస్తామన్నారు. ఇవాళ్టి తమ ఊరేగింపులను పరిమితం చేసుకుంటామన్నారు.
ఇవాళ చోటు చేసుకున్న తొక్కిసలాట లాంటి పరిస్థితి గురించి రవీంద్రపురి స్పందిస్తూ, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్లనే అలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. ‘‘జనాలను భయపెట్టడానికి కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసారు. వాళ్ళు తమ ప్రయత్నంలో విజయవంతమయ్యారు. ఈ ఉదయం మేం అందరితో మాట్లాడాం. నిజమైన పరిస్థితి వేరేలా ఉంది, కానీ పలు రకాల పుకార్లు వ్యాపించాయి. భక్తులు త్రివేణీ సంగమం దగ్గరనే స్నానం చేయనక్కరలేదు. గంగమ్మ తల్లి ఎక్కడ కనిపిస్తే అక్కడ స్నానం చేయండి’’ అని చెప్పారు.