ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలకు నెయ్యి సరఫరా గురించి డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతర అవసరాలకు ఉపయోగించే ఆవు నెయ్యి సేకరణ అంశంలో అనుసరించాల్సిన విధానాలపై నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్లు మంత్రి ఆనం తెలిపారు. 15 రోజుల్లో కమిటీ నివేదిక అందజేయనుందని తెలిపారు.
రాష్ట్రంలోని ఆలయాల్లో వివిధ అవసరాలకు గానూ ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరం అవుతుందని, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో నిర్దేశిత పరిమాణంలో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
గతంలో డెయిరీల నుంచి నేరుగా దేవాలయాలు నెయ్యిని సేకరించే విధానం అమలులో ఉండేదని, 2022లో ఆ విధానాన్ని మార్చి టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారని అధికారులు, డెయిరీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.