మైనారిటీల దేశంగా మిగులుతుందేమోనని ఆవేదన
మత మార్పిళ్ళకు కారణమవుతున్న మతపరమైన సమావేశాలు నిర్వహించడం సరికాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. మత మార్పిళ్ళకు కారణమయ్యే సమావేశాలకు అనుమతిస్తే దేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలు ఏదో ఒక రోజు మైనారిటీలుగా మారతారని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది.
యూపీలోని హమీర్ పూర్ నుంచి దిల్లీలోని ఓ మత సమావేశానికి ప్రజలను తీసుకెళ్లి మతం మార్పిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కైలాష్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ వాదనలు సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.
మానసిక వ్యాధిగ్రస్తుడైన రాంఫాల్ అనే యువకుడికి దిల్లీలో చికిత్స చేయిస్తానంటూ కైలా తీసుకెళ్లాడు. వారంలో తిరిగి తీసుకొస్తానని చెప్పి అతడి సోదరుడు రాంకాళీ ప్రజాపతికి హామీ ఇచ్చాడు. కానీ రోజులు గడిచినా రాంఫాల్ ను ఇంటికి పంపలేదు. దీంతో రాంకాళీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, కైలాష్ ను కిడ్నాప్, యూపీ మత మార్పిళ్ల నిషేధ చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. హమీర్ పూర్ గ్రామం నుంచి కైలాష్ గతంలోనూ చాలా మందిని దిల్లీలో జరిగే ఓ మత సమావేశానికి తీసుకెళ్లినట్లు విచారణలో తేలడంతో అదే విషయాన్ని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
కోర్టులో కేసు విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పీకే గిరి వాదించారు. హమీర్ పూర్ గ్రామం నుంచి కైలాష్ చాలా మందిని దిల్లీ తీసుకెళ్ళి మతం మార్పించాడని అందుకు ప్రతిఫలంగా డబ్బు పొందాడని సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రస్తావించారు.
రాంఫాల్ ను క్రైస్తవంలోకి ఎవరూ మార్చలేదని కైలాష్ తరఫు న్యాయవాది సాకెత్ జైస్వాల్ వాదించారు. సోను అనే పాస్టర్ ఈ తరహా సమావేశాలు నిర్వహిస్తున్నారని.. అతడు ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నాడని చెప్పారు.
కైలాష్ కు బెయిల్ ను నిరాకరిస్తూ జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రజలు స్వేచ్ఛగా ఒక మతాన్ని పాటించేందుకు , ఆ మతం గురించి ప్రచారం చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తోందని తీర్పులో పేర్కొన్నారు. కానీ ఒక మతం నుంచి మరో మతానికి ప్రజలను మార్చే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. మత మార్పిళ్లను ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు దేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలు మైనారిటీలుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.