ఏలూరు జిల్లా మండవల్లిలో అరాచకం చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల లిస్ట్ తీసుకునేందుకు బడికి వచ్చిన బాలికపై, తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకడు అత్యాచారం చేస్తుండగా మరో నలుగురు వీడియో తీయడం సంచలనంగా మారింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మార్కుల జాబితా తీసుకునేందుకు మండవల్లి పాఠశాలకు ఓ బాలిక వచ్చింది. ఉపాధ్యాయులు లేకపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరింది.కాటు వేయడానికి అప్పటికే మాటు వేసిన సహ విద్యార్థి, బాలికను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. మరో నలుగురు విద్యార్థులు వీడియో చిత్రీకరించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ కోరిక కూడా తీర్చాలంటూ వీడియో తీసిన నలుగురు, బాలికను బెదిరించారు. తమకు డబ్బు ఇవ్వాలంటూ బాధితులనే బెదిరించారు. రూ.2 లక్షలు ఇవ్వడానికి బాధితులు అంగీకరించినా ఇంకా ఎక్కువ కావాలంటూ డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు.పెద్ద మొత్తం ఇవ్వలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాలసుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, తేజ, హరికృష్ణ అనే నలుగురిపై కేసు నమోదైంది. అత్యాచారం చేసిన వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో తీసిన నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.