కాంగ్రెస్
పార్టీ చొరబాటుదారులను స్వాగతించడంతో పాటు అల్లరిమూకలకు ఆశ్రయం కల్పించిందని ప్రధాని
నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్లోని బార్మర్లో నిర్వహించిన
ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ, చొరబాటుదార్లను కాంగ్రెస్ స్వాగతించిందని, రాజస్థాన్లో శ్రీరామనవమి
ఊరేగింపుపై రాళ్ళు రువ్విన అల్లరిమూకలకు ఆ పార్టీ ఆశ్రయం కల్పించిందని దుయ్యబట్టారు.
దేశ
విభజనకు కారణమైన ముస్లిం లీగ్ ముద్రతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళుతుందని
ఎద్దేవా చేశారు. ఇండీ కూటమిలోని ఓ పార్టీ భారత అణ్వాయుధాలను ధ్వంసం చేస్తామని పేర్కొనడాన్ని
తప్పుపట్టారు. మన పొరుగు దేశాలు అణ్వాయుధాలు సమీకరిస్తుంటే మనం మాత్రం ధ్వంసం
చేయాలా అని ప్రశ్నించారు.
భారత్ను శక్తిహీనంగా తయారుచేయాలని ఇండీ కూటమిలోని పార్టీలు
కోరుకుంటున్నాయా అని నిలదీశారు. ర్యాలీలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ
మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో మేనిఫెస్టోలోని హామీలను 45
శాతం నెరవేర్చామని చెప్పారు. రాజస్థాన్లో నీటి సమస్యకు పరిష్కారానికి చొరవ
చూపిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.