కేంద్రంలో
ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభలో
బీజేపీ వరుసగా రెండు సార్లు సాధించిన
మెజార్టీని ఈ దేశాభివృద్ధి కోసమే ఉపయోగించామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు
మాత్రం ఓ కుటుంబాన్ని మాత్రమే బలోపేతం చేశారని ప్రతిపక్షాన్ని దుయ్యబట్టారు.
వచ్చే
ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని విపక్షాలకూ తెలుసు అన్నారు.
అందుకే చాలా మంది ప్రతిపక్ష నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారంటూ చురకలు అంటించారు.
ఓ
మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని మోదీ కీలక విషయాలపై స్పందించారు. దర్యాప్తు
సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందనే విపక్షాల విమర్శలపై స్పందించారు.
అవినీతిపరులపై
కఠిన చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. బీజేపీ అధికారంలో
ఉన్న రాష్ట్రాల్లోనూ అవినీతి వ్యతిరేక చర్యలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తు
చేశారు.
కేవలం
రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయనేది తప్పుడు కథనమన్నారు.
ఈడీ దర్యాప్తు చేసే అవినీతి
కేసుల్లో కేవలం 3శాతమే రాజకీయాలతో సంబంధముందన్నారు. మిగతా 97శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవే అని
వివరించారు. 2014 ముందు ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు విలువ
రూ.25వేల కోట్లుగా ఉంటే, గత పదేళ్ళలో ఆ
మొత్తం రూ.లక్ష కోట్లకు పెరిగిందన్నారు.
అవినీతి
నిర్మూలనలో భాగంగా గ్రూప్ సి, గ్రూప్
డి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేశామన్న మోదీ, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు
అందించేందుకు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ తీసుకువచ్చామన్నారు.