నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. భార్యతో విభేదాలతో అప్పటికే వేరుగా ఉంటోన్న భర్త, తాను మారానని గుడికి వెళదాంరా..అంటూ నటించాడు. నిజమేనని నమ్మిన భార్య అతనితో వెళ్లింది. అంతే దారిలో భార్య తలపై బండరాయితో కొట్టి లోయలో పడేశాడు. ఈ దారుణ హత్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భార్యభర్తలు అదృశ్యం అయ్యారంటూ బంధువులు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారిస్తున్న పోలీసులకు త్రివేణి భర్త పద్మాల సురేష్ కనిపించారు. పోలీసులు వారి శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సురేష్, త్రివేణికి తొమ్మిదేళ్ల కిందట వివాహం అయింది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. సురేష్ తాపీ పని, త్రివేణి వ్యవసాయ పనులకు వెళుతోంది. ఇటీవల వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. వత్సవాయి మండలం, శింగవరంలో వేరుగా కాపురం పెట్టుకున్నారు. గొడవలు తగ్గడంతో మరలా సొంతూరు పెనుగంచిప్రోలు వచ్చారు.భార్యపై కసిపెంచుకున్న సురేష్ ఎలాగైనా వదిలించుకోవాలని ప్రణాళిక వేశాడు. పెనుగంచిప్రోలు మల్లిఖార్జున కొండపై దేవాలయానికి వెళదాం అంటూ తీసుకెళ్లి తలపై రాయితో కొట్టి (crime report) చంపాడు. త్రివేణి మృతదేహాన్ని లోయలో పడేశాడు. ఇద్దరూ కనిపించకపోవడంతో, సురేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారిస్తున్న పోలీసులకు సురేష్ కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.