Palasa Assembly Constituency Profile
జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరయిన పలాస 2008లో నియోజకవర్గంగా
ఏర్పడింది. అంతకుముందు సోంపేట నియోజకవర్గంగా ఉండేది. పలాస నియోజకవర్గంలో పలాస,
మందస, వజ్రపు కొత్తూరు అనే మూడు మండలాలు ఉన్నాయి.
సోంపేట నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పలాసగా మారిన
నియోజకవర్గంలో గౌతు కుటుంబమే రాజకీయంగా కొనసాగుతూ వస్తోంది. 1952లో సర్దార్ గౌతు
లచ్చన్నతో వారి పరంపర మొదలైంది. 1972లో ఒకసారి మజ్జి తులసీదాస్ కాంగ్రెస్ నుంచి
గెలిచారు. 1983లో కాంగ్రెస్ ఐ నుంచి ఎం నారాయణరావు గెలిచి రెండేళ్ళే పదవిలో
ఉన్నారు. 1985లో తెలుగుదేశం తరఫున గౌతు శ్యామసుందర శివాజీ రంగప్రవేశం చేసారు. 2004
వరకూ శివాజీయే ఎమ్మెల్యేగా ఏకచ్ఛత్రాధిపత్యం సాగించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి
జగన్నాయకులు, తెలుగుదేశం అభ్యర్ధి శివాజీని ఓడించారు. 2014లో మళ్ళీ శివాజీ
గెలిచేసారు. 2019లో తన వారసురాలిగా కుమార్తె శిరీషను ఎన్నికల బరిలో నిలిపారు.
అయితే వైఎస్ఆర్సిపి అభ్యర్ధి సీదిరి అప్పలరాజు విజయం సాధించారు.
2024
శాసనసభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి తరఫున మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రెండోసారి
పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా గౌతు శిరీష కూడా
రెండోసారి బరిలోకి దిగుతున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మజ్జి
త్రినాథ్ బాబు నిలబడుతున్నారు.