India on terrorists and
their sponsors, at UN
ఉగ్రవాద సంస్థలు, వారి ప్రాయోజకుల పట్ల భారతదేశం ఎట్టిపరిస్థితుల్లోనూ
సహనం చూపదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ చెప్పారు. ఐరాస
భద్రతామండలి ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన రుచిర… చిన్న,తేలికపాటి ఆయుధాల అక్రమ
రవాణాయే సంక్షోభాలకు కారణమవుతోందని వ్యాఖ్యానించారు.
‘‘చిన్న, తేలికపాటి ఆయుధాలు, వాటికి అవసరమైన
మందుగుండు అక్రమ రవాణాయే సాయుధ ఉగ్రవాద సంస్థలు సంక్షోభాలు సృష్టించడానికి కారణం అవుతున్నాయి.
అటువంటి సంస్థలు ఆయుధాలను పొందకుండా ఆపడానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా
పనిచేయాల్సిన అవసరముంది. కాబట్టి ఉగ్రవాద సంస్థలు, వారి ప్రాయోజకులు తేలికపాటి, చిన్న
ఆయుధాలను సంపాదించి దుర్వినియోగం చేయకుండా వారిపట్ల కఠిన వైఖరిని అవలంబించేలా
భద్రతామండలి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం’’ అని రుచిర చెప్పారు.
చిన్న, తేలికపాటి ఆయుధాల గురించి భద్రతామండలి
చర్చాగోష్ఠి నిర్వహించింది. ఆ సందర్భంగా భారత్ వైఖరి గురించి ప్రసంగించిన రుచిర,
‘‘ఎన్నో దశాబ్దాల నుంచి ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్కు ఆయుధాల అక్రమ రవాణా వల్ల సమస్యలేమిటో
బాగా తెలుసు. సరిహద్దులకు ఆవలి నుంచి వచ్చే ఉగ్రవాదం వల్ల, వారు మా సరిహద్దుల వల్ల
స్మగుల్ చేసే అక్రమ ఆయుధాలను ఉపయోగించి చేసే దాడుల వల్ల మేమెన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు
కూడా డ్రోన్ల ద్వారా ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు సేకరించే
ఆయుధాల నాణ్యత, పరిమాణం నానాటికీ పెరుగుతున్నాయి. దాన్నిబట్టి, కొన్ని దేశాల
మద్దతు లేక ఆర్థిక సహాయం లేకుండా ఉగ్రవాద సంస్థలు మనలేవని స్పష్టంగా తెలుస్తోంది’’
అని వివరించారు.
ఆయుధాల అక్రమ రవాణా జరిగే మార్గాలను,
డైవర్షన్ పాయింట్లను గుర్తించడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రతినిధి
స్పష్టం చేసారు. అక్రమ రవాణా నియంత్రణకు అంతర్జాతీయ గుర్తింపు పద్ధతికీ, ఐరాస
కార్యాచరణ ప్రణాళికకూ భారత్ మద్దతు పలికింది.