Monday, December 11, 2023

Odisha-365
google-add

దీపావళి – బాణాసంచా – కాలుష్యం: వాస్తవాలు 2

P Phaneendra | 18:08 PM, Sat Nov 11, 2023

బాణాసంచా వల్లనే కాలుష్యం కలుగుతుందా?

 

టపాసుల వల్ల కాలుష్యం కలుగుతుందా, కలిగితే దాని తీవ్రత ఎంత? బాణాసంచాకు వ్యతిరేకంగా వేసిన కేసు ప్రధాన చర్చనీయాంశం అదే. ప్రజల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది ఈ అంశంపైనే.

 

ఈ విషయంపై సుప్రీంకోర్టు ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుంది.

-     ఢిల్లీలో వాయుకాలుష్యానికి కారణాలపై 10-11-2016న జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులు

-     ‘ఢిల్లీలో వాయుకాలుష్యం, గ్రీన్‌హౌస్ గ్యాసెస్‌పై సమగ్ర అధ్యయనం’ పేరిట ఢిల్లీ ప్రభుత్వానికి ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన నివేదిక

-     కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దాఖలు చేసిన అఫిడవిట్లు

-     సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక

-     మరికొన్ని ఇతర అఫిడవిట్లు, నివేదికలు

 

జాతీయ హరిత ట్రిబ్యునల్ నివేదికలో ఢిల్లీలో వాయుకాలుష్యానికి కారణాలుగా ఈ క్రిందివాటిని పేర్కొంది. వాటిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందన్న సంగతి గుర్తుంచుకోవాలి...

-     ఢిల్లీలో నిర్మాణ కార్యక్రమాలు, నిర్మాణ సామగ్రిరవాణా

-     ఘనవ్యర్ధాలు, ఇతర వ్యర్ధాలను కాల్చడం

-     వ్యవసాయ వ్యర్ధాలను తగలబెట్టడం

-     వాహనాల వల్ల కలుగుతున్న కాలుష్యం

-     రహదారుల మీద దుమ్ము, ధూళి

-     పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఫ్లై-యాష్ వంటి కాలుష్యాలు

-     హాట్ మిక్స్ ప్లాంట్లు, స్టోన్ క్రషర్ల నుంచి వెలువడే కాలుష్యాలు

 

వీటిలో బాణాసంచా లేనే లేదన్న సంగతి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన నివేదికలో సైతం ఢిల్లీ వాయుకాలుష్యకారకాల జాబితాలో టపాసుల ప్రస్తావన అయినా లేదు.

 

ఐఐటీ కాన్పూర్ నివేదికలో గుర్తించాల్సిన మరికొన్ని అంశాలున్నాయి. అవేంటంటే... ఈ అధ్యయనం ఢిల్లీలో వేసవిలోనూ, చలికాలంలోనూ... రెండు పూర్తి సీజన్లలో చేపట్టారు. ఈ అధ్యయనం కేవలం కాలుష్య తీవ్రతనే కాక, శాస్త్రీయ పరిశోధనల ద్వారా కాలుష్యానికి ప్రధాన కారకాలను గుర్తించింది. పరిశోధనా పరికరాల్లో జమ అయిన కాలుష్యాలను రసాయనిక విశ్లేషణ చేయడం ద్వారా కాలుష్యకారకాలను గుర్తించింది. అలా, ఢిల్లీ వాయుకాలుష్యానికి సంబంధించినంతవరకూ ఈ నివేదికను శాస్త్రీయమైన, సమగ్రమైన, విశ్వసనీయమైన నివేదికగా పరిగణించడం జరిగింది.

 

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా తన నివేదికలో మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. అవేంటంటే...

-     దీపావళి సమయంలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు నిర్దేశిత పరిమితుల లోపలే ఉన్నాయి.

-     దీపావళి సమయంలో పీఎం 10 (పది మైక్రాన్ల కంటె తక్కువ ఉండే పర్టిక్యులేట్ మేటర్), పీఎం 2.5 స్థాయులు ఎక్కువ పెరిగాయి, వాయుకాలుష్యానికి అవే ప్రధాన కారణాలు.

-     ఈ పీఎం స్థాయులు కూడా ఒకట్రెండు రోజుల్లో తగ్గిపోతున్నాయి. వాటివల్ల దీర్ఘకాలిక ప్రభావం లేదు.

 

ఇక సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా పౌరుల ఆరోగ్యంపై ప్రభావాన్ని అధ్యయనం చేసింది. ఆ కమిటీ కనుగొన్న విషయాల సారాంశాన్ని సుప్రీంకోర్టు తన 2018 నాటి తీర్పులో పేరా నెంబర్ 21గా ఇలా ప్రస్తావించింది:

 

‘‘దీపావళి సమయంలో వాయు నాణ్యత తగ్గిన మాట వాస్తవమే. కంటి సమస్యలు, దగ్గు వంటి సమస్యలతో ఆస్పత్రులకు వెళ్ళిన వారి సంఖ్య కూడా పెరిగింది. ధ్వనుల తీవ్రత కూడా పెరిగింది. అలాగే యూరిన్‌లో మెటల్ స్థాయులు కూడా ఎక్కువయ్యాయి. ఇవన్నీ బాణాసంచా కాల్చడం వల్ల కలిగిన దుష్ఫలితాలే. అయితే, సంఖ్యాపరంగా (స్టాటిస్టికల్) అవేమీ అంత ఎక్కువ స్థాయిలో లేవు. బాణాసంచా కాల్చడం వల్ల ప్రజారోగ్యంపై పడే ప్రభావాన్ని దీర్ఘకాలికంగా అధ్యయనం చేయాల్సి ఉంది.’’

 

ఈ విధంగా చెప్పడం ద్వారా దీపావళి కాలుష్యానికీ, ప్రజారోగ్యంపై ప్రభావానికీ సంఖ్యాపరంగా పెద్దసంబంధం లేదని సుప్రీంకోర్టు కమిటీ నిర్ధారించింది. అంటే, దీపావళి బాణాసంచా కాల్చడానికీ, ప్రజల ఆరోగ్యంపై కాలుష్యం ప్రభావానికీ సంబంధం లేదని సుప్రీం కమిటీ నివేదిక స్పష్టం చేసింది.

 

కొందరు వ్యక్తులు వ్యక్తిగత స్థాయిలో సమర్పించిన అఫిడవిట్లలో కాలుష్యం పెరుగుదల, తమ ఆస్పత్రులకు రోగులు ఎక్కువగా రావడం, ఊపిరి సమస్యలు, జంతువులు ఒత్తిడి ఫీలవడం వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే అవన్నీ ఆయా వ్యక్తులు తాము వివరించిన వ్యక్తిగత అనుభవాలు మాత్రమే తప్ప శాస్త్రీయమైన అధ్యయనం కాదని సుప్రీంకోర్టు గమనించింది.  

 

ఈ నేపథ్యంలో... ఒక్క సంవత్సరంలో ఒక్క దీపావళి పండుగ నాటి కాలుష్యం స్థాయులను మాత్రమే కాక, ఐదేళ్ళ వ్యవధిలోని కాలుష్యం సమాచారాన్ని అధ్యయనం చేసారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారిక వెబ్‌సైట్‌లో బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించారు. 2015 నుంచి 2020 వరకూ ఐదేళ్ళ వ్యవధిలోని ఆ సమాచారాన్ని అధ్యయనం చేసినప్పుడు, ఆ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

 

దీపావళి సమయంలో వాయుకాలుష్యం స్థాయులు ఎక్కువగానే ఉన్నాయన్న మాట వాస్తవమే. కానీ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కోర్టు ముందు ప్రస్తావించని విషయం ఏంటంటే మిగతా రోజుల్లో కాలుష్యం మరింత ఎక్కువగా నమోదయింది. కొన్ని సందర్భాల్లో రెట్టింపుగా కూడా నమోదయింది. దురదృష్టవశాత్తూ ఆ అంశాలపై చర్చే జరగలేదు.

 

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వదిలేసిన మరో విషయం ఏంటంటే ప్రతీఒక్కరూ ఏడాదిలో 2 రోజుల మీదనే దృష్టి సారిస్తున్నారు తప్ప మిగతా 362 రోజుల సంగతీ వదిలేస్తున్నారు. 2015 నుంచి 2020 ఐదేళ్ళ వ్యవధిలో పీఎం 2.5 స్థాయులను పరిశీలిస్తే ఢిల్లీలో మొత్తం 1255 రోజులు అనారోగ్యకర స్థాయి నుంచి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. (అన్‌హెల్దీ టు హజార్డస్ డేస్). అలాగే పీఎం 10 స్థాయులను పరిశీలిస్తే అలాంటి 854 రోజులున్నాయి.

ప్రజలు, మీడియా, ప్రభుత్వం, కోర్టులు, కాలుష్య నియంత్రణ సంస్థలు అన్నీ ఆ  1255 రోజుల్లో కేవలం పది రోజుల మీదనే దృష్టి కేంద్రీకరిస్తుండడం, అది కూడా దేశపు అతిపెద్ద పండుగల్లో ఒకటైన దీపావళి సందర్భంలో ప్రజల ఆనందోత్సాహాలకు గండికొట్టేలా నిర్ణయాలు తీసుకోవడం, విషాదకరం.

ఈ చర్చ అంతటి తర్వాత ఒక ప్రధానమైన ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఐదేళ్ళలో 1255 కలుషిత రోజుల్లోని పదే పది రోజుల మీద ‘పరిశుద్ధమైన గాలి పొందే హక్కు’ పేరిట ఒక అజెండాతో ఎందుకు పోరాడుతున్నారు? ఆ పది రోజులు మినహా, అంతకంటె కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో సైతం వారు ఎందుకు మాట్లాడడం లేదు, కనీసం మాట్లాడుతున్నట్లయినా నటించడం లేదు?

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023