ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం సత్తా ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని పోలీసు డిప్యూటీ సూపరింటెడెంట్ శ్రీధర్ రెడ్డి అన్నారు. మన సైనికుల విజయ స్ఫూర్తిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఆయన అభిలషించారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు సోమవారం నాడు ఆపరేషన్ సిందూర్ విజయయాత్ర చేపట్టారు. వందల సంఖ్యలో విద్యార్థులు నగరంలోని అనేక వీధులలో ర్యాలీ నిర్వహించి, భారత సైన్యం సత్తాను నినాదాల రూపంలో వినిపించారు.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి స్వయంగా ర్యాలీలో పాల్గొని విద్యార్జులను చైతన్య పరిచారు. ఆయన ప్రసంగం విద్యార్థుల్లో దేశసేవ పట్ల గౌరవాన్ని, పౌరజ్ఞానాన్ని పెంపొందించింది. పాఠశాల ఆవరణలో జాతీయ గీతంతో ప్రారంభమైన ర్యాలీ.. నగరంలోని అనేక కాలనీల్లో శాంతియుతంగా సాగింది. ప్లకార్డులు చేతితో పుచ్చుకొని విద్యార్థులు శాంతియుతంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల నగరపౌరుల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగింది.
సామాజిక అంశాల పట్ల పిల్లల్లో చైతన్యం తీసుకొని రావటంలో స్విస్ విద్యాసంస్థ ముందు వరుసలో నిలుస్తుంది. ముఖ్యంగా జాతీయ భావాల విషయంలో సామాజిక స్పృహను పెంచే కార్యక్రమాలు విరివిగా చేపడుతూ ఉంటారు. ఇటువంటి ర్యాలీల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, సామాజిక చైతన్యం వంటి విలువలను పెంపొందించేందుకు దోహదపడుతుంది. పాఠశాల ప్రిన్సిపాల్ డా. కృష్ణమోహన్ భాస్కరభట్ల , కమిటీ సభ్యులు వెంకటస్వామి, ఉపాధ్యాయ బృందం సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.