మహారాష్ట్రలోని రక్షిత పురావస్తు నిర్మాణం విశాల్గఢ్ కోటలో ఒక దర్గా ఉంది. అక్కడ ఈ యేడాది జూన్ 7న బక్రీద్, ఆ రోజు నుంచి 12వ తేదీ వరకూ ఉరుసు నిర్వహించారు. ప్రతీ యేడాదీ బక్రీద్, ఉరుసు సందర్భంగా పెద్ద సంఖ్యలో జంతువులను బలి ఇవ్వడం జరుగుతోంది. నిజానికి పురావస్తు శాఖ నిర్వహణలో ఉన్న రక్షిత ప్రదేశాల్లో జంతు బలులు ఇవ్వడం చట్ట ప్రకారం నిషిద్ధం. అందువల్ల ఈ యేడాది బక్రీద్, ఉర్సు సమయాల్లో జంతువులను బలి ఇవ్వకుండా ఆపాలంటూ ఒక పిటిషనర్ బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేసారు.
దానికి బొంబాయి హైకోర్టు ఒప్పుకోలేదు. గతేడాది జంతువులను బలులు ఇచ్చే కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ యేడాది కూడా జంతు బలులను అనుమతిస్తూ జూన్ 3న తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా విచారించవలసిందిగా కోరారు. కానీ సుప్రీంకోర్టు జూన్ 7న పిటిషనర్ అభ్యర్ధనను త్రోసిపుచ్చింది. ఆ పిటిషన్పై త్వరగా విచారణ జరపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తక్షణ జోక్యానికి నిరాకరించింది, హైకోర్టు ఉత్తర్వులు అమలు అయేందుకు వీలు కల్పించింది.
నిజానికి న్యాయ వ్యవస్థ హిందువుల పండుగలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో పలు మార్లు జోక్యం చేసుకుంది. రకరకాల సాకులు చెప్పి రకరకాల నిషేధాలు విధించింది. విగ్రహాల నిమజ్జనం, ఉట్టి కొట్టే ఎత్తు, దీపావళి బాణాసంచా, కావడ్ యాత్ర… ఇలా హిందువులకు సంబంధించిన పర్వదినాలు లేక ఉత్సవాలు లేక యాత్రల విషయంలో ఏమాత్రం మొహమాటం లేకుండా ఆంక్షలు విధించడం న్యాయస్థానాలకు సర్వసాధారణం అయిపోయింది. ఇతర మతాలకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోడానికి ఇష్టపడని కోర్టులు హిందూ పండుగల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎన్నో రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. అలాంటి పన్నెండు ప్రధాన సందర్భాలను ఒకసారి పరిశీలిద్దాం.
(1) దుర్గాపూజలో శబ్దకాలుష్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు:
తేదీ: 03-10-2024
ప్రదేశం: ఒడిషా
సందర్భం: దుర్గా పూజ
న్యాయస్థానం: ఒడిషా హైకోర్టు
న్యాయమూర్తులు: సంగమ్ కుమార్ సాహూ, జస్టిస్ వి నరసింగ్
తీర్పు: దుర్గా పూజ సమయంలో శబ్ద కాలుష్యం జరుగుతుందంటూ ఒడిషా హైకోర్టు ప్రత్యేక బెంచి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పండుగల సమయాల్లో పెద్దగా చేసే శబ్దాలు ప్రజల ఆరోగ్యం మీద, వారి నిద్ర మీద, మానసిక ప్రశాంతత మీద, ఆఖరికి వాతావరణం మీద సైతం తీవ్ర ప్రభావం చూపుతాయి అని వ్యాఖ్యానించింది. అంతే కాదు, పిల్లల చదువులను సైతం ప్రభావితం చేస్తాయంటూ వ్యాఖ్యలు చేసింది.
‘‘ప్రతీ ఒక్కరికీ పండుగను వేడుకగా జరుపుకునే హక్కు ఉంది. కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు’’ అని న్యాయస్థానం చెప్పుకొచ్చింది. దాంతో పాటు, శబ్ద నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పండాల్స్ దగ్గర పార్కింగ్ ఏర్పాట్లు ఎలా చేసారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కటక్ డిఎస్పిని ఆదేశించింది.
శబ్దం స్థాయి 65 డెసిబెల్స్ దాటకూడదని న్యాయస్థానం ఆదేశించింది. ఆ పరిమితిని ఏ వ్యక్తి లేదా సంస్థ ఉల్లంఘిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
(2) గణపతి నిమజ్జనం మీద నిర్ణయం వాయిదా:
తేదీ: 16-09-2023
ప్రదేశం: ఆరే, ముంబై, మహారాష్ట్ర
సందర్భం: వినాయక నిమజ్జనం
న్యాయస్థానం: బొంబాయి హైకోర్టు
న్యాయమూర్తులు: చీఫ్ జస్టిస్ డి.కె ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ (ఒరిజినల్ బెంచ్), జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ మంజూషా దేశ్పాండే (ఇంటెరిమ్ హియరింగ్)
తీర్పు: ముంబైలోని ఆరే సరస్సులో వినాయక నిమజ్జనం చేయడానికి అనుమతి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ నాయకుడు రాజీవ్ చౌబే బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అయితే దానికి తక్షణం స్పందించడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. వినాయక నిమజ్జనాల వల్ల వాతావరణ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక పిటిషన్ విచారణలో ఉన్న కారణంగా ఈ పిటిషన్ మీద తక్షణం నిర్ణయం తీసుకోలేమని తేల్చింది. పండుగ పూర్తి అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 25న అసలైన ధర్మాసనం అందుబాటులోకి వచ్చే వరకూ విచారణను వాయిదా వేసింది.
వివాదం: వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల పర్యావరణం పాడైపోతోందంటూ కోర్టు విమర్శలు గుప్పించింది. వాటిని కారణంగా చూపించి, ఆరే ప్రాంతంలోని చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకూడదంటూ మునిసిపాలిటీ అధికారులు నిషేధం విధించారు. ఆ ఒక్క యేడాదీ మినహాయింపు ఇవ్వాలనీ లేదా కృత్రిమ చెరువులు ఏర్పాటు చేయాలనీ విశ్వహిందూ పరిషత్ కోరింది. వినాయక నిమజ్జనం అనేది మతపరమైన విశ్వాసం కాబట్టి అటువంటి ఏర్పాటుకు వీలు కల్పించమని కోరింది. దాన్ని విచారించడానికి సైతం కోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు.
(3) దీపావళి రోజు గ్రీన్ క్రాకర్స్ విక్రయం, వినియోగానికి అనుమతి:
తేదీ: 01-11-2021
ప్రదేశం: ఒడిషా
సందర్భం: దీపావళి పండుగ
న్యాయస్థానం: ఒడిషా హైకోర్టు
న్యాయమూర్తులు: చీఫ్ జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ బి.పి రౌత్రాయ్
తీర్పు: దీపావళి పండుగ నాడు పర్యావరణ హిత బాణాసంచా (గ్రీన్ క్రాకర్స్) మాత్రమే విక్రయించడానికి, వినియోగించడానికి ఒడిషా హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. అది కూడా నవంబర్ 4 రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే బాణాసంచా కాల్చుకోవాలని నిర్దేశించింది. ఆ విషయంలో స్పెషల్ రిలీఫ్ కమిషనర్ మార్గదర్శకాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం… నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) ధ్రువీకరించి, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) సర్టిఫై చేసిన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలి. అంతే కాదు, గ్రీన్ అనే లేబుల్ ఉన్న బాణాసంచాను విక్రయిస్తే సరిపోదు, ప్రభుత్వం నిర్దేశించిన జోన్లలో మాత్రమే విక్రయాలు జరపాలి.
కారణం: హైకోర్టు నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వులపై ఆధారపడి ఉంది. సుప్రీంకోర్టు అన్నిరకాల బాణాసంచాలనూ నిషేధించలేదు, బేరియం సాల్ట్స్ ఉన్న మందుగుండును మాత్రమే నిషేధించింది. అయితే ఒడిషా హైకోర్టు అన్ని రకాల బాణాసంచా విక్రయాలపై పూర్తి నిషేధం విధించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆల్ ఒడిషా ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దానికి స్పందనగా హైకోర్టు ఈ నిర్ణయం వెలువరించింది.
(4) దీపావళి, కాళీ పూజ సమయంలో బాణాసంచాపై పూర్తి నిషేధం:
తేదీ: 29-10-2021
ప్రదేశం: పశ్చిమ బెంగాల్
సందర్భం: దీపావళి, కాళీ పూజ
న్యాయస్థానం: కలకత్తా హైకోర్టు
తీర్పు: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి, కాళీ పూజ పర్వదినాల సందర్భాల్లో గ్రీన్ క్రాకర్స్ సహా అన్ని రకాల బాణాసంచా విక్రయాలు, వినియోగం మీద కలకత్తా హైకోర్టు పూర్తిస్థాయి నిషేధం విధించింది. ఆ సంవత్సరంలో వచ్చే ప్రతీ పండుగ సమయంలోనూ ఆ నిషేధం అమల్లో ఉంటుందని హైకోర్టు ప్రకటించింది.
కారణం: పెరుగుతున్న వాయు కాలుష్యం, ప్రజారోగ్యం మీదా పర్యావరణం మీదా దాని ప్రమాదకర ప్రభావాల విషయంలో రేకెత్తుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని కలకత్తా హైకోర్టు ఆ నిర్ణయం తీసుకుంది.
(5) చెరువుల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం మీద నిషేధాన్ని తొలగించేందుకు నిరాకరణ:
తేదీ: 13-09-2021
ప్రదేశం: తెలంగాణ
సందర్భం: వినాయక చవితి నిమజ్జనాలు
న్యాయస్థానం: తెలంగాణ హైకోర్టు
న్యాయమూర్తులు: చీఫ్ జస్టిస్ ఎం రామచంద్రరావు, జస్టిస్ టి వినోద్ కుమార్
తీర్పు: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణేశుడి విగ్రహాలను హుసేన్ సాగర్, తదితర చెరువుల్లో నిమజ్జనం చేయడం కుదరదంటూ హైకోర్టు నిషేధం విధించింది. దాన్ని సవరించడానికి హైకోర్టు నిరాకరించింది. నీటి కాలుష్యానికి కారణమయ్యే ఉత్తర్వులను కోర్టు జారీ చేయలేదు, ఆఖరికి తాత్కాలికంగా అయినా సరే అనుమతి మంజూరు చేయలేదు. ఆ ఒక్క యేడాదికీ నిమజ్జనం కొనసాగనివ్వాలంటూ పిటిషనర్ చేసిన విజ్ఞప్తులను కోర్టు నిరాకరించింది. గత యేడాది నిమజ్జనాలు ముగిసినప్పటి నుంచీ ఈ యేడాది వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోడానికి తగినంత సమయం ఉందని, అయినా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే అని న్యాయస్థానం తేల్చింది.
కారణం: ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోడానికి ఏడాదికి సరిపడా సమయం ఉంది. కానీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. కాబట్టి జల కాలుష్య నివారణ కోసమే నిషేధాన్ని తొలగించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.
(6) కోవిడ్ వల్ల జీవించే హక్కుకు ప్రమాదమన్న సుప్రీం, కావడ్ యాత్ర రద్దు:
తేదీ: 18-07-2021
ప్రదేశం: ఉత్తర ప్రదేశ్
సందర్భం: వార్షిక కావడ్ యాత్ర
న్యాయస్థానం: సుప్రీం కోర్టు
న్యాయమూర్తులు: జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, బిఆర్ గవాయ్
తీర్పు: భారత రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం జీవించే హక్కు అన్నిటి కంటె ఉత్కృష్టమైన హక్కు. కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కావడ్ యాత్రను ‘సంకేత మాత్రంగా’నైనా నిర్వహించాలన్న నిర్ణయం గురించి పునరాలోచించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది.
ఆ నిర్ణయం తర్వాత యూపీ సర్కారు కావడ్ సంఘాలతో చర్చలు జరిపింది. వారు జులై 25 నుంచి మొదలు పెట్టవలసిన తమ యాత్రను రద్దు చేసుకున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
కారణం: కోవిడం మూడో వేవ్ వస్తుందన్న ఆందోళనలతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కావడ్ యాత్రను అప్పటికే రద్దు చేసేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా తీర్థయాత్రలకు వెళ్ళవద్దని సలహాలిస్తోంది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా సలహా ఇచ్చింది. మత పరమైన సెంటిమెంట్ల వల్ల ప్రజారోగ్యానికీ, భద్రతకూ ముప్పు వాటిల్లకూడదని చెప్పింది.
(7) ‘మాఘి గణపతి’ కోసం పీఓపీ విగ్రహాల తయారీ, విక్రయం, నిమజ్జనంపై నిషేధం:
తేదీ: 18-07-2021
ప్రదేశం: మహారాష్ట్ర
సందర్భం: మాఘి గణపతి పండుగ
న్యాయస్థానం: బొంబాయి హైకోర్టు
న్యాయమూర్తులు: చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాఢే, జస్టిస్ భారతీ డాంగ్రే
తీర్పు: కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ, విక్రయం, నిమజ్జనాలను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కళాకారుల జీవనోపాధి సమస్యను గుర్తిస్తూనే, పర్యావరణానికి హాని కలగనీయకూడదని స్పష్టం చేసింది.
వివాదం: మాఘి గణపతి ఉత్సవం ప్రారంభానికి ముందే నిషేధం విధించడం సంచలనం కలిగించింది. పర్యావరణ పరిరక్షణ అంశానికీ, కళాకారుల జీవనోపాధికీ మధ్య తేడా మరోసారి చర్చకు వచ్చింది. పిటిషనర్లు కాలుష్యం గురించి ఆందోళన చెందారు. విగ్రహాల తయారీదారులు మాత్రం ఆ మార్గదర్శకాలు తమకు వర్తించవు అని వాదించారు.
(8) పూరీ బైట రథయాత్రలపై నిషేధానికి సుప్రీం సమర్ధన:
తేదీ: 06-07-2021
ప్రదేశం: ఒడిషా
సందర్భం: రథయాత్ర పర్వదినం
న్యాయస్థానం: సుప్రీంకోర్టు
న్యాయమూర్తి: చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ
తీర్పు: కోవిడ్ మహమ్మారి కారణంగా రథయాత్ర వేడుకలను పూరీ జగన్నాథ స్వామి మందిరానికి పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా చోట్ల రథయాత్రలు జరపడానికి అనుమతించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అసలు అది న్యాయపరమైన జోక్యానికి అవకాశమే లేని విధాన నిర్ణయం అని కోర్టు స్పష్టం చేసింది. వేర్వేరు దేవాలయాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ను నిర్వహించడం అనేది ఆచరణ సాధ్యం కాదని గమనించింది.
వివాదం: పూరీ బైట ఉన్న ఇతర జగన్నాథ మందిరాలపై వివక్ష చూపడం ద్వారా రాజ్యాంగ అధికరణాలు 14, 25ను ఉల్లంఘించడమేనని పిటిషనర్ల వాదన. అయితే న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్ధించింది. ధార్మికమైన సమావేశాల కంటె ప్రజా ఆరోగ్యం పట్ల ఆందోళనకే మొగ్గుచూపుతున్నామని ప్రకటించింది.
(9) దీపావళి రోజు బాణాసంచా మూడు గంటలు మాత్రమే కాల్చుకోవాలి:
తేదీ: 13-10-2017
ప్రదేశం: పంజాబ్, హర్యానా, చండీగఢ్
సందర్భం: దీపావళి పర్వదినం
న్యాయస్థానం: పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు
న్యాయమూర్తులు: జస్టిస్ అజయ్ కుమార్ మిట్టల్, జస్టిస్ అమిత్ రావల్
తీర్పు: పంజాబ్, హర్యానా, చండీగఢ్లో దీపావళి రోజు బాణాసంచా సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకూ మాత్రమే కాల్చుకోవాలంటూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆంక్షలు విధించింది. తదుపరి విచారణ జరిపేవరకూ, దీపావళి రోజుకు ముందూ తర్వాతా బాణాసంచా వినియోగాన్ని నిషేధించింది. కోర్టు అనుమతి లేకుండా బాణాసంచా తయారీదారులు లేక అమ్మకందారులకు శాశ్వత లైసెన్సులు జారీ చేయకుండా అధికారులపై ఆంక్షలు విధించింది. అంతకుముందు యేడాది మంజూరు చేసిన లైసెన్సులలో 20శాతం మందికి మాత్రమే తాత్కాలిక లైసెన్సులు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. అప్పటికే మంజూరు చేసిన లైసెన్సులను పనికిరానివిగా ప్రకటించింది.
కారణం: వాయు కాలుష్యం స్థాయులు పెరగడాన్ని నియంత్రించడానికి, పండుగ సమయంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికే ఆ ఉత్తర్వులు జారీ చేసినట్లు కోర్టు చెప్పుకొచ్చింది. నిజానికి ఆ ప్రాంతంలో వాయు నాణ్యత మీద న్యాయస్థానం తనంత తానే పర్యవేక్షణ ప్రారంభించింది. (సు మోటో కాగ్నిజెన్స్) స్థానిక అధికారులు, స్వచ్ఛంద సంస్థలూ గాలి నాణ్యతను కచ్చితంగా నిర్వహించేలా పరిశీలిస్తూ ఉండాలని స్పష్టం చేసింది.
(10) ఉట్టి కొట్టే వేడుకలో మైనర్లు పాల్గొనకూడదు, ఉట్టి ఎత్తు తగ్గించాలి:
తేదీ: 17-08-2016
ప్రదేశం: మహారాష్ట్ర
సందర్భం: శ్రీకృష్ణ జన్మాష్టమి – ఉట్టి కొట్టే వేడుక (దహీ హండీ)
న్యాయస్థానం: సుప్రీంకోర్టు
తీర్పు: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉట్టి కొట్టే ‘దహీ హండీ’ వేడుకలో 18 ఏళ్ళ లోపు పిల్లలు పాల్గొనకూడదంటూ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఉట్టిని కొట్టడానికి మనుషులు ఒకరి మీద ఒకరు ఎక్కి ఏర్పరిచే మానవ కుడ్యం ఎత్తు 20 అడుగులు దాటకూడదంటూ 2014 ఆగస్టు 11న బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అర్ధించిన వివరణ ఇస్తూ, అటువంటి ప్రమాదకరమైన విన్యాసాల్లో మైనర్లను అనుమతించడం సురక్షితం కాదని, ప్రజాహితానికి వ్యతిరేకమనీ స్పష్టం చేసింది.
కారణం: ఉట్టి కొట్టే వేడుకల్లో తరచూ పలువురు గాయాల పాలవుతుండడంతో ప్రజల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇఛ్చింది. 2014లో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు అవడం లేదని ఆరోపిస్తూ స్వాతి పాటిల్ అనే యాక్టివిస్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణలో న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. భగవాన్ కృష్ణుడు వెన్న దొంగిలించాడే తప్ప దానికోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేయలేదంటూ చమత్కార వ్యాఖ్యలు కూడా చేసింది.
(11) పండుగల పేరిట శబ్దకాలుష్య కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి:
తేదీ: 09-10-2015
ప్రదేశం: మహారాష్ట్ర
సందర్భం: హిందూ పండుగలు
న్యాయస్థానం: బొంబాయి హైకోర్టు
న్యాయమూర్తులు: జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ విఎల్ అచిల్య
తీర్పు: దహీ హండీ, వినాయక చవితి, దేవీ నవరాత్రులు తదితర ఉత్సవాల సందర్భాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు విధించిన ఆంక్షలను ఉల్లంఘించే వ్యక్తులు లేక సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రప్రభుత్వం సహా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులను హైకోర్టు ఆదేశించింది. తమ ఉత్తర్వులను పాటించడంలో విఫలమయ్యే అధికారులపై కోర్టు ధిక్కార నేరం మోపుతామని హెచ్చరించింది. తమ తీర్పు తర్వాత రాబోయే అన్ని పండుగ సందర్భాల్లో శబ్ద కాలుష్య నియంత్రణ నియమాలను కచ్చితంగా, కఠినంగా అమలు చేసి తీరవలసిందేనని స్పష్టం చేసింది.
కారణం: వినాయక చవితి, దహీ హండీ వంటి వేడుకల సమయంలో శబ్ద కాలుష్య నియంత్రణకు సంబంధించిన నియమాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని కోర్టులో పలువురు ప్రజాహిత వ్యాజ్యాలు నమోదు చేసారు. అటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిమీద తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆ వ్యాజ్యాల్లో ఆరోపించారు. ప్రభుత్వాధికారుల వైఫల్యం వల్లనే ప్రజలకు అసౌకర్యం కలుగుతోందంటూ ఆరోపణలు చేసారు.
(12) గంగ, యమున నదుల్లో విగ్రహాల నిమజ్జనం నిషేధం:
తేదీ: 07-10-2013
ప్రదేశం: ఉత్తర ప్రదేశ్
సందర్భం: వినాయక చవితి, దేవీ నవరాత్రుల్లో నిమజ్జనాలు
న్యాయస్థానం: అలహాబాద్ హైకోర్టు
న్యాయమూర్తులు: జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అరుణ్ టాండన్
తీర్పు: ఉత్తరప్రదేశ్లో గంగా, యమునా నదుల్లో విగ్రహాల నిమజ్జనంపై పూర్తి స్థాయి నిషేధం విధించింది అలహాబాద్ హైకోర్టు. విగ్రహాలను నిమజ్జనం చేసి వెంటనే తీసివేస్తామని ప్రభుత్వం వేడుకున్నప్పటికీ ఆ అభ్యర్ధనను సైతం న్యాయస్థానం తిరస్కరించింది. అంతే కాదు, ఒక యేడాది లోపు, రాష్ట్రంలోని నదులు అన్నింటిలో నిమజ్జనాలు అనేవి జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది.
కారణం: నదుల స్థితిగతుల గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ విచారణలో భాగంగా అలహాబాద్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు, నదుల్లో కాలుష్యాన్ని పరిశీలించాలంటూ అదే కోర్టు సూచనలు చేసింది. దానికి సంబంధించిన నివేదికలో కాలుష్యాల గురించిన కొంత సమాచారాన్ని ప్రస్తావించారు.
ముక్తాయింపు:
పైన చెప్పిన ఉదాహరణలను విడివిడిగా పరిశీలించినప్పుడు… అవును, నిజమే కదా, మన పండుగల వల్ల ఇన్ని రకాల సమస్యలు తలెత్తుతున్నాయా అనిపిస్తుంది. న్యాయస్థానం విశాల హృదయంతో ఆ సమస్యల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది.
అయితే నిజానికి కేవలం హిందువుల పండుగలు, పర్వదినాలు, వేడుకల వంటి సందర్భాల్లో మాత్రమే ఇలాంటి పిటిషన్లు దాఖలు అవుతుంటాయి, వాటిపై న్యాయస్థానాల తీర్పులు వస్తూ ఉంటాయి. అదే అన్య మతస్తుల పండుగలు లేక మతపరమైన కార్యక్రమాల విషయంలో మాత్రం తీర్పులు అలా రావు. అలాంటి సందర్భాల్లో పర్యావరణం, ప్రజారోగ్యం, ప్రజా హితం వంటి విషయాలు గుర్తుకు రావు. ఈ వ్యాసం ప్రారంభంలో ఇచ్చిన తాజా తీర్పు దాన్నే స్పష్టీకరిస్తుంది.
అంటే, న్యాయస్థానాలకు సైతం న్యాయం అనేది కేవలం హిందువులు మాత్రమే అనుసరించాల్సిన విషయం అనిపిస్తుందన్న మాట. హిందువుల పండుగలు, పర్వదినాలు, వేడుక సమయాల్లో మాత్రమే పర్యావరణ పరిరక్షణ, ప్రజాహితం వంటి గంభీర విషయాలు గుర్తొస్తాయన్న మాట. పండుగలను అడ్డుకోకపోతే అధికారుల మీద కోర్టు ధిక్కార కేసులు సైతం పెట్టి శిక్షిస్తామని హెచ్చరిస్తుంటారన్న మాట. అయితే ముస్లిములు, క్రైస్తవుల పండుగలు, పర్వదినాలు లేక మతపరమైన సందర్భాల్లో మాత్రం అలాంటివేవీ గుర్తుకు రావు, రాకూడదు. అలాంటి సందర్భాల్లో చట్టాల గురించి మాట్లాడలేరు, మాట్లాడకూడదు.
ఇక్కడ కోర్టు తీర్పులను తప్పు పట్టడం లేదు. కానీ హిందూ మతస్తుల విషయాల్లో ఒకలా, ముస్లిం క్రైస్తవ మతస్తుల విషయాల్లో మరొకలా కోర్టులు వ్యవహరించే తీరును పరిశీలించడం మాత్రమే జరుగుతోంది. బక్రీద్ లేదా క్రిస్మస్ వంటి వాటిని పర్యావరణ హితంగా జరుపుకోవాలి అని ఆదేశించిన న్యాయస్థానం భారతదేశంలో ఇప్పటివరకూ ఒక్కటైనా కనిపించిందా? లేదనే చెప్పుకోవాలి.