ప్రపంచానికి యోగా అనే అద్భుత క్రియను భారత్ అందించింది. ప్రపంచ దేశాల్లో యోగాకు రోజు రోజుకు ఆదరణ పెరిగిపోతోంది. దీంతో ఐక్యరాజ్యసమితి కూడా యోగాను గుర్తించింది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిశ్చయించింది. పగలు రాత్రి సమానంగా ఉండే జూన్ 21ని ప్రపంచ యోగా దినంగా ప్రకటించారు. వేద కాలం నాటి నుంచి యోగా ఉంది. దీని మూలాలు భారత్లోనే ఉన్నాయి. స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి, వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాలను తెలుసుకుందాం.
పశ్చిమ దేశాలకు యోగా ఎలా పరిచయం అయిందంటే?
భారత్లో పుట్టిన యోగా చాలా కాలం విదేశాల్లో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. 1893లో స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో యోగాను పరిచయం చేశారు. యోగా గొప్పతనాన్ని పశ్చిమ దేశాల్లో వివరించారు. దీంతో యోగా ప్రాముఖ్యతను గుర్తించిన పశ్చిమ దేశాల ప్రజలు ప్రతి రోజూ జీవితంలో భాగం చేసుకున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. యోగాపై పరిశోధనలు జరిపారు. ఫలితాలు ఆశాజనకంగా రావడంతో యోగాను గుర్తించారు. 1896లో అమెరికాలోని మన్హటన్ నగరంలో స్వామి వివేకానంద రాజయోగా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీని ద్వారా యోగా పశ్చిమ దేశాలకు వ్యాప్తించింది. తరవాత కాలంలో భారత్ నుంచి వందలాది మంది యోగా టీచర్లు, గురువులు విదేశాలకు వెళ్లి పనిచేయడం ప్రారంభించారు.
యోగా చరిత్ర
యోగా చాలా పురాతనమైనది. ఎంత పురాతనం అనేదానిపై ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాడే యోగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. 2500 ఏళ్ల కిందటి ప్రజలు యోగాను అనుసరించారని యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకుడు, ప్రొఫెసర్ డాక్టర్ జిమ్ మల్లిన్ సన్ రాసుకొచ్చారు. మల్లిన్ సన్ యోగాపై పరిశోధనలు చేస్తున్నారు. పూర్వం ఒకే భంగిమలో ఉంటూ యోగాసనాలు వేసేవారని మల్లిసన్ పరిశోధనల్లో తేలింది. శారీరక యోగాసనాలు ఉండేవి కాదని ఆయన రచనల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన సూర్య నమస్కారం ఆసనం గతంలో లేదని, 1930 తరవాత సూర్యనమస్కారం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని మల్లిన్ సన్ తెలిపారు. గడచిన వందేళ్లలో యోగా పలు రూపాలను సంతరించుకుంది. గురువులు విభిన్న కొత్త ఆసనాలు పరిచయం చేశారు. దీంతో యోగా విదేశాల్లోనూ ప్రాచుర్యంలోకి వచ్చింది.
అయ్యంగార్ యోగా, విన్యాస యోగా, అష్టాంగ యోగా ఇటీవల కాలంలో రూపుదిద్దుకున్నాయి. పతంజలి మహర్షి అష్టాంగ యోగాను సిద్దం చేశారని చెబుతుంటారు. దీనిపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. శారీరక, మానసిన పరమైన సమన్వయం సాధించడం యోగా ప్రధాన లక్ష్యమని ముంబైలోని లోనావ్లా యోగా శిక్షణ కేంద్రం డైరెక్టర్ మన్మధ్ ఘోరొటే వెల్లడించారు.
యోగా అంటే చాలా కఠినమైన క్రియ అని చాలా మంది పొరబడుతుంటారు. ఎవరైనా చేసే ఆసనాలు యోగాలో చాలా ఉన్నాయి. చివరకు గర్భిణీలు కూడా చేయగలిగే యోగాసనాలు ఉన్నాయి. ఉదయాన్నే యోగా చేయాలనే నిబంధన ఏమీ లేదు. ఖాళీ సమయంలో, ప్రశాంతంగా యోగా ఎప్పుడైనా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పని చేసే ప్రాంతంలోనూ చిన్న చిన్న ఆసనాలు వేయడం ద్వారా ప్రశాంతత పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
యోగ ఎవరైనా చేయవచ్చా?
యోగాకు వయసుతో నిమిత్తం లేదు. పెద్ద వయసు వారు కూడా యోగాసనాలు వేయవచ్చు. యోగా ప్రారంభించిన వారు ఫలితాలు చూసిన తరవాత, ఇంకా ముందే ప్రారంభించి ఉంటే బాగుండేదని భావిస్తుంటారు. యోగా అనేది తేలికగా చేసుకునే వ్యాయామం. పిల్లలు, పెద్దలు ఎవరైనా ఎప్పుడైనా యోగా చేయవచ్చు. ఇందుకు శరీరం ధృడంగా ఉండాల్సిన పనిలేదు. ఫిట్ నెస్కు తగినట్టుగా ఆసనాలు వేయాల్సి ఉంటుంది. దివ్యాంగులు కూడా యోగాసనాలు వేయవచ్చు.
దీనిని చైర్ యోగా అంటారు.
యోగా ఫలితాలు ఎలా ఉంటాయి?
యోగాతో ముందుగా మానసిన ప్రశాంతత లభిస్తుంది. దీంతో మానసిన ఆరోగ్యం మెరుగవుతుంది. ఆసనాలు వేయడం వల్ల మనసుకు, శరీరానికి మధ్య సమన్వయం పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. శరీరంలో శాశ్వత నొప్పులు మాయం అవుతాయి. గర్భిణీలు సులువుగా డెలివరీకి యోగా ఉపకరిస్తుంది. ప్రసవం తరవాత యోగా చేయడం ద్వారా త్వరగా మామూలు స్థితికి చేరుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. శరీరం దృఢంగా తయారవుతుంది.
యోగా డే వేడులకు విశాఖపట్నంలో భారీ ఏర్పాట్లు
జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్ రోడ్డులో యోగా డే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 21వ తేదీన బీచ్ రోడ్డులోనే 5 లక్షల మంది యోగా పాల్గొంటారని అంచనా. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని వయసుల వారు ఆచరించ తగిన యోగాసనాలను ప్రజలకు మరోసారి పరిచయం చేయనున్నారు.
వేలాది ప్రముఖుల యోగాసనాలు
జూన్ 21న వైజాగ్ ఆర్కే బీచ్ లో యోగా డే వేడుకలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు… ఇలా రాజకీయ ప్రముఖలంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఒకేచోట దాదాపు 5 లక్షల మందికిపైగా యోగాసానాలు వేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
మోదీ పిలుపు మేరకు యోగాకు గుర్తింపు
2014లో ప్రధానిగా పదవి చేపట్టిన నరేంద్ర మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. యోగా డేను ఘనంగా నిర్వహిస్తూ, ప్రధాని స్వయంగా పొల్గొంటున్నారు. ప్రధాని పిలుపు మేరకు జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించారు. విశాఖలో నిర్వహించనున్న యోగా డేలో పలు రికార్డులు నమోదవుతాయని అంచనా. గిన్నిస్ బుక్ ప్రతినిధులు కూడా విశాఖ యోగా డే పరిశీలనకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మందితో యోగా చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని నగరాలు, గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ భద్రత
ఆపరేషన్ సింధూర్ తరవాత ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో భద్రతా దళాలు విశాఖ బీచ్ సమీప ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. విశాఖ బీచ్ సమీపంలోని ఐదు కి.మీ పరిధిలో అన్ని భవనాలను తనిఖీ చేశారు. ప్రధాని పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు పాల్గొనే ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పొల్గొంటారు.
నిత్య జీవితంలో యోగా
దేశంలో 3 కోట్ల మంది నిత్యం యోగాసనాలు వేస్తున్నారని అంచనా. వీరంతా యోగాను జీవితంలో భాగం చేసుకున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం సరిగా ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబం బాగుంటుంది. కుటుంబంలోని అందరి ఆరోగ్యం బాగుంటే, దేశం బాగుంటుంది. ఇలా యోగాతో ఆరోగ్యంతోపాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేసే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టిన పనిలో మంచి ఫలితాల సాధనకు యోగా ఉపకరిస్తుంది. అందుకే కార్పొరేట్ సంస్థలు సైతం ఉద్యోగులకు సాయంత్రం వేళలో ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నాయి.