ఏపీ రాజధాని అమరావతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సాయంతో రాజధాని పనులకు ఊపు వచ్చింది. తాజాగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన కాంప్లెక్స్, ఉద్యోగుల నివాస భవనాలు నిర్మించేందుకు నిధులు విడుదల చేశారు. దీంతో రాజధానిలో కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట రానున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో రుణాలతో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతి రాజధాని పనులు, కేంద్ర సాయంపై ప్రత్యేక కథనం మీకోసం.
అమరావతి రాజధానికి కేంద్రం శుభవార్త అందించింది. ఆరేళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాల కాంప్లెక్స్, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి కేంద్రం రూ. 2787 కోట్లు మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. అమరావతి రాజధాని ప్రభుత్వ కాంప్లెక్స్ సమీపంలో 22 ఎకరాలను ఏపీ ప్రభుత్వం కేంద్ర కార్యాలయాలకు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, ఉద్యోగుల భవనాల నిర్మాణం చేపట్టేందుకు సీఆర్డీయే సిద్దమైంది.
టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఊపు వచ్చింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా పునఃప్రారంభోత్సవం జరిపి, పనులు మొదలుపెట్టారు. మరోవైపు, అమరావతి ముఖద్వారంగా ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని సీఆర్డీయే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కృష్ణా నదిపై విజయవాడ పశ్చిమ బైపాస్ ద్వారా ఆరు లైన్ల బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. మరో నాలుగు బ్రిడ్జిల ద్వారా అమరావతి రాజధానిని విజయవాడ హైదరాబాద్ 65వ నెంబరు జాతీయ రహదారికి కలిపే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం, సీఆర్డీయే 29 గ్రామాల రైతుల నుంచి 34 వేల ఎకరాలు సేకరించాయి. రైతులకు పరిహారంగా కొంత భూమిని ఇచ్చారు వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు అందిస్తున్నారు. అమరావతి రాజధాని విస్తరణకు మరో 44 వేల ఎకరాలు 12 గ్రామాల రైతుల నుంచి సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అమరావతి రాజధానిని మరింత విస్తరించి అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు, ఐటీ కారిడార్ నిర్మించాలని ప్రభుత్వ యోచనగా ఉంది. ఇందుకు అమరావతి మండలంలోని 10 గ్రామాలు, పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. రైతుల అభిప్రాయాలను సేకరించారు. 34 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇవ్వడానికి రైతులు అంగీకరించారు. అయితే రైతులు 14 షరతులు పెట్టారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
అమరావతి రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలు, సీఆర్డీయే కార్యాలయం, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకు 47 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం సీఆర్డీయే వెబ్ సైటులో అందుబాటులో ఉంచారు.
కొత్త అసెంబ్లీ భవనం 45 అంతస్తుల్లో రానుంది. హైకోర్టు నూతన భవనం, ఐకానిక్ టవర్స్ రాజధానిలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. పలు సంస్థలు పనులు దక్కించుకున్నాయి. వేగంగా పనులు కొనసాగుతున్నాయి.
అమరావతి రాజధానికి రైలు కనెక్టవిటీ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందుకు గుంటూరు జిల్లాలోని నంబూరు నుంచి అమరావతి రాజధాని గ్రామాల్లో నుంచి తెలంగాణలోని ఎర్రుబాలెం వరకు రైల్వే లైను రానుంది. అమరావతి రాజధానిని కలుపుకుంటూ తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం వరకు 57 కి.మీ రైల్వే లైన్ వేసేందుకు రైల్వే శాఖ భూ సేకరణ ప్రారంభించింది. పలు గ్రామాల రైతుల భూముల్లో పెగ్ మార్కింగ్ చేశారు. భూ సేకరణ పూర్తి కాగానే పనులు ప్రారంభించనున్నారు. నాలుగేళ్లలో పనులు పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠపురం సమీపంలో కృష్ణా నదిపై రైల్వే శాఖ ఓ బ్రిడ్జిని నిర్మించనుంది. ఇందుకు మూడు సంవత్సరాల సమయం పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. త్వరలో భూ సేకరణ పూర్తి చేసిన పనులు ప్రారంభించేందుకు రైల్వే ఇంజనీర్లు సర్వేలు నిర్వహించారు.
ప్రతిష్ఠాత్మకంగా అవుటర్ రింగు రోడ్
అమరావతి రాజధానికి అవుటర్ రింగ్ రోడ్డు తలమానికంగా మారనుంది. ఐదు జిల్లాలను, 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, 121 గ్రామాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన అమరావతి రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందించేందుకు అంగీకరించింది.
అమరావతి రాజధాని చుట్టూ 189 కి.మీ అవుటర్ రింగు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేంద్రం మొత్తం ఖర్చులు భరించేందుకు అంగీకరించింది. భూసేకరణలో సగం ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. 150 మీటర్ల వెడల్పుతో 8 లైన్ల రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 121 గ్రామాల్లో భూ సేకరణకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించారు. ఇప్పటికే 87 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. అలైన్మెంట్ ప్రకారం భూ సేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ద మవుతున్నారు. డిసెంబరు నాటికి భూ సేకరణ పూర్తి చేసి, జనవరి నుంచి పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
ముంపు నుంచి రక్షణ
అమరావతి రాజధానిలో ముంపు ప్రాంతాలకు రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి రాజధానిలో ప్రధానంగా ముంపునకు కారణమవుతున్న కొండవీటి వాగు, పాలవాగుల విస్తరణ చేపట్టారు. నీరుకొండ వద్ద భారీ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోంది. మరో మూడు మినీ రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఉండవల్లి వద్ద వరద ఎత్తిపోసేందుకు, ఎత్తి పోతల పథకం నిర్మించారు.
నాలుగు రిజర్వాయర్ల ద్వారా అరటీఎంసీ నీటిని నిల్వ చేస్తారు. ఇందుకు 250 ఎకరాల భూమి కేటాయించారు. నీరుకొండ ప్రాంతంలో కొండవీటి వాగుపై అతిపెద్ద రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేయనున్నారు. పనులు వేగంగా జరిపిస్తున్నారు. వర్షాల వరదను ఒడిసిపట్టేందుకు సిద్దం అవుతున్నారు. రాజధానిలో గ్రీనరీ పనులకు, నిర్మాణ పనులకు నీటిని ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయం
అమరావతి రాజధానిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూ సేకరణ చేస్తున్నారు. అమరావతి విస్తరణలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తారు. తాడికొండ సమీపంలో లచ్చన్న గుడిపూడిలో భూ సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే భూ సేకరణ ప్రారంభిస్తారు. పెట్టుబడులు ఆకర్షించాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం తప్పనిసరి అని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. గన్నవరంలో విమానాశ్రయం ఉన్నా, రాజధానికి దూరంగా ఉండటం ప్రతిబంధకంగా మారింది. అందుకే రాజధానికి పశ్చిమ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు
సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నట్లు అమరావతి రాజధానికి అవసరమైన నిధులు, స్వయంగా సంపాదించుకోనుంది. అమరావతి రాజధానిలో సీఆర్డీయేకు 4 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఈ భూమి అమ్మడం ద్వారా సీఆర్డీయేకు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఆ డబ్బుతో అప్పులు తీర్చేందుకు ప్రణాళిక రచించారు. ముందుగా తక్కువ వడ్డీకి ప్రపంచబ్యాంకు రుణం తీసుకుని, రాబోయే మూడు దశాబ్దాల్లో రుణాలను దశల వారీగా తీర్చనున్నారు. ఇందుకు కేంద్రం సహకారం అందించింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ, హడ్కో ముందస్తుగా రూ.7 వేల కోట్లు విడుదల చేశాయి. ఆ నిధులతో పనులు ప్రారంభించారు.
రైతులకు న్యాయం జరిగింది
అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. రైతులకు అందించిన ప్లాట్ల అభివృద్ధికి రూ.67 వేల కోట్ల కేటాయించింది. పలు విభాగాలుగా విభజించి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో గజం 40 వేల నుంచి 70 వేల ధర పలకడంతో రైతులు ఆనంతం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో భూములు అమ్మేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. రాజధానిని మరింత విస్తరించే ప్రణాళికలు అమలు చేయడంతో మరో 12 గ్రామాలు రాజధానిలో కలపనున్నారు. క్రీడా గ్రామం నిర్మించేందుకు ఐదు గ్రామాలను పరిశీలించారు. ఈ పనులన్నీ రాబోయే మూడేళ్లలో పూర్తి చేయనున్నారు.