ప్రాచీన కాలం నుంచీ ఈ భరత భూమిలో నివసిస్తున్న మనమంతా ఎంతో ముందుచూపు కలిగిన నాగరిక సమాజంగా వ్యవహరిస్తున్నాం. నాగరికత, సంస్కృతి కలిగిన సమాజ జీవనం మొట్టమొదట అభివృద్ధి చెందినది భరత భూమిలోనే. దానికి భౌగోళిక పరిస్థితులు కూడా కారణమే. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రమూ మనను కాపాడుతూ ఉన్నాయి. మన దేశంలో వైవిధ్యభరితమైన వేలాది మొక్కలున్నాయి. పుష్కలంగా నదులు ఉన్నాయి. వ్యవసాయానికి భూమి సమృద్ధంగా అందుబాటులో ఉంది. మన సామాజిక జీవితం చాలా సరళంగా, సురక్షితంగా, శాంతియుతంగా ఉండేది. అందువల్ల మన దేశంలో అధ్యయనానికి, ఆలోచనకు, పరిశోధనకు, ప్రయోగానికీ అనుకూలమైన వాతావరణం ఉండేది. సనాతన జ్ఞాన ప్రవాహం చాలా క్రియాశీలంగా ఉండి ఉండాలి, అందుకే జ్ఞానానికి సంబంధించిన ఎన్నో శాఖలు ఈ గడ్డ మీద పుట్టాయి. నేను ఎవరిని? ఈ ఉనికితో నాకు ఏమైనా సంబంధం ఉందా? నా జన్మకు ప్రయోజనం ఏమిటి? జీవనం, మరణం అంటే ఏమిటి? ఇటువంటి ప్రశ్నల్లో మునిగిపోవడం ప్రతీ ఒక్కరికీ సహజమే. అలాంటి ప్రశ్నలకు మన పూర్వీకులు వేల యేళ్ళ క్రితం కనుగొన్న జవాబులు కాల పరీక్షకూ, శాస్త్ర పరీక్షకూ తట్టుకుని నేటికీ నిలిచాయి.
1. సమస్త అస్తిత్వమూ ఒక నిరంతరాయమైన ఉచ్చు (అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం)
2. మాన(వి)వుడు అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ
3. ఉనికి అనేది ఏకైక చైతన్యాన్ని ఆవిష్కరించడమే (సర్వం ఖలు ఇదం బ్రహ్మా)
4. ఆ మహా అస్తిత్వంలో అతి ముఖ్యమైన భాగం మానవుడు (తత్ త్వం అసి)
మానవ బుద్ధి, మేధస్సుల శక్తి ఎంత మహత్తరమైనదంటే మానవుడు ఈ నియమాలను దర్శించగలడు. మానవ జీవితపు నిజమైన ప్రయోజనం అదే.
మన రాజ్యాంగం అసలు ప్రతిలో ఇరవైనాలుగు చిత్రాలను చేర్చారు. వాటిలో మొట్టమొదటి చిత్రం మొహెంజొ-దడో తవ్వకాల్లో కనుగొన్న అతిపెద్ద నందీశ్వరుడిది. ఇక రెండో చిత్రం ప్రాచీనమైన గురుకులానిది. మన దేశం వ్యవసాయ దేశం, సాధుసంతులపై ఆధారపడిన దేశం. వ్యవసాయం అంటే పంటలు పండించడం, సాధువు అంటే సత్యం గురించిన జ్ఞానం కలిగిన వాడు.
మానవుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. నేను అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యం. మనకు ఆకలి వేసినట్లే ఇతరులకు కూడా ఆకలి వేయడం సహజం, ఇంటర్లో ఉన్నప్పుడు (12వ తరగతి) నేను ఉపనిషత్తుల నుంచి ఒక కథ చదివాను. శ్రీ గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇద్దరు సోదరులు ఇంటికి వెడుతున్నారు. వారికి దారిలో తినడానికి భాక్రీలు (తృణధాన్యాలతో చేసే రొట్టెలు), కూర ఇచ్చారు. మార్గమధ్యంలో ఆ సోదరులు ఒకచోట భోజనం చేయడానికి కూర్చున్నారు. అదే సమయానికి ఆకలిగా ఉన్న భిక్షగాడు ఒకడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఇద్దరిలో చిన్నవాడు అతనికి ఆహారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ‘‘ఇది మాకు సరిపోదు’’ అన్నాడు. దానికి అన్నగారు తమ్ముడి వీపు మీద చిన్నగా కొట్టి ఇలా చెప్పాడు ‘‘పన్నెండేళ్ళు చదువుకున్న తర్వాత నువ్వు ‘అందరిలోనే ఒకటే చైతన్యం ఉంటుంది’ అన్న సత్యాన్ని మరచిపోయావా? నీలోని చైతన్యమూ, అతనిలోని చైతన్యమూ ఒకటే. నీవు అతనికి తిండి పెట్టడానికి నిరాకరిస్తే, దాన్ని తాకే హక్కు నీకు ఏమాత్రం ఉండదు’’ అని వివరించారు. ఆ కథే తత్వమసి (తత్ త్వమ్ అసి) అనే వేదవాక్యానికి సారాంశం.
సర్వం ఖల్విదం బ్రహ్మా, తత్వమసి – ఈ సర్వకాలీన శాశ్వత సత్యం ఆధారంగానే ఈ దేశపు జీవన విధానం అభివృద్ధి చెందింది. అదే ఆధ్యాత్మిక జీవన విధానం.
ఆధ్యాత్మిక జీవన విధానం అనేది అందరికీ ప్రయోజనకరమైనది, పర్యావరణ హితమైనది, దీర్ఘకాలికంగా ఉపయోగ పడేది, మానవత్వం కలిగి ఉన్నది. ఈ ఆధ్యాత్మిక ఆలోచనా విధానం ‘తత్వమసి’ అనే సత్యం మీద ఆధార పడి ఉన్నది. అందువల్లే అది అన్ని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలకూ వర్తిస్తుంది. అసమానతలు, ఉచ్చనీచాలు, వివక్ష అనే వాటికి సహజంగానే చోటు లేదు. జీవితం అనేది సంతోషాన్ని, సమృద్ధిని, జ్ఞానాన్ని, ఆనందాన్నీ ఇవ్వాలి. అలాంటి ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన, సాఫీగా సాగిపోయే, అహింసాయుతమైన సామాజిక జీవనం భారతదేశంలో కొన్ని వేల యేళ్ళ పాటు కొనసాగి ఉండాలి.
మన దేశంలో సమాజపు ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఇక్కడ ఒకప్పుడు సంక్షేమ దృష్టి కలిగిన, వివక్ష లేని సామరస్య పూర్వకమైన సామాజిక జీవనం ఉండేది అని మనకు అర్ధమవుతుంది. సామరస్యమనే ఆ సరస్వతీ నది ఎప్పుడు ఎలా అంతర్ధానమైపోయింది అన్నది అస్సలు నమ్మశక్యం కాదు. అహంభావం లేని ‘నాకు కాదు, నీకు’ అనగలిగే ఆ జీవిత విధానం కనుమరుగైపోయింది అన్న సంగతి మనకు అసలు తెలీదు. మనిషిలో అహంభావాన్ని పెంచే జీవన విధానం ఇప్పుడు ప్రబలంగా ఉంది. విద్య, సంపద, కుటుంబం, ఒక సమూహం, వృత్తి, భాష, దుస్తులు ఇలా రకరకాల అహంభావాలు మనుషుల స్వభావాలు అయిపోయాయి. ‘నేను, నాది’ అనే ధోరణి పెచ్చరిల్లి పోయింది. ప్రజల మధ్య దూరం పెరిగిపోయింది. దేశంలోని కొన్ని భాగాలు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు బానిసత్వంలో మగ్గిపోయాయి. దేశపు ఐకమత్యం, చిత్తశుద్ధి తీవ్రంగా దెబ్బతిన్నాయి. హిందూ సమాజంలోకి అగ్ర కుల ఆధిక్యత, ఎక్కువ-తక్కువ అనే వివక్ష, అంటరానితనం, అనైతికత వంటి రోగాలు వ్యాపించాయి. అలాంటి రోగాల నుంచి మన సమాజాన్ని విముక్తం చేయడానికి స్వామి వివేకానంద, మహర్షి దయానంద సరస్వతి, స్వతంత్ర వీర సావర్కర్, ఛత్రపతి సాహు మహరాజ్, మహాత్మా ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పండిత మదనమోహన్ మాలవీయ, పూజ్య నారాయణ గురు వంటి ఎందరో మహానుభావులు గొప్ప కృషి చేసారు. ఫలితంగా సమాజపు మనస్తత్వం మీద ఆ రోగాల పట్టు కొద్దిగా సడలింది. అయితే ఆ రోగాలు చాలా పాతవీ, మన సమాజంలోకి ఎంతో లోతుగా వేళ్ళూనిపోయినవీ కావడంతో కొద్దిమంది గొప్ప వ్యక్తుల నిస్వార్థ కృషి యావత్ సమాజాన్నీ ఆ రోగాల బారి నుంచి బైట పడవేయ లేకపోయాయి. ఆ మానసిక జాడ్యంతో బాధపడే ప్రతీ వ్యక్తికీ వాటి నుంచి బైటపడాలన్న బలమైన కోరిక ఉండాలి. ‘‘కులాన్ని మరచిపొండి, అహంకారాన్ని విడిచిపెట్టండి’’ లాంటి నినాదాలు, ఉద్యమాలతో ఆ రోగం మొత్తం సమాజాన్ని విడిచిపెట్టి పోదు. ఆ రోగం చాలా పాతబడిపోయింది కాబట్టి, దానికి చికిత్స కర్కశంగా ఉండాల్సిందే. సమాజాన్ని ఆ రోగం నుంచి విముక్తం చేయడానికి, సోదరభావంతో కూడిన సమైక్య సమాజాన్ని సృష్టించడానికి సుదీర్ఘకాలం పాటు సహనంతో ఔషధం సేవించాల్సిందే. అయితే ఏదో చికిత్స లేని జబ్బుకి మందు తీసుకుంటున్నామా అని ఎవరూ అనుకోకూడదు. ఆ చికిత్స హోమియోపతీ వైద్యంలా ఉండాలి. ఆ తీపి మాత్రలు మింగుతుంటే మనకు మందు వేసుకుంటున్న భావనే కలగదు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్ భారతీయ సమాజపు అనైక్య స్థితి, పరాజిత భావనల గురించి నిశితంగా ఆలోచించారు. సమాజంలోని ఉచ్చనీచ భావనలు, అంటరానితనం అనే చిక్కుముళ్ళ కారణంగా ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. ఒక కులం మీద మరో కులం ఎక్కువ అన్న భావన మాత్రమే కాదు, కులాలు, ఉపకులాలు అన్న విభజన సమాజంలో బలంగా పాతుకుపోయింది. ముంబైలోని ధారవి మురికివాడ అందరికీ తెలిసిందే. మరణించిన జీవాల చర్మాలు తీసే కుటుంబం, ఆ చర్మాలతో చెప్పులు కుట్టే కుటుంబం ఒకరి ఇంటికి మరొకరు వెళ్ళరు. ఒకరి ఇంటి నీళ్ళు మరొకరు తాగరు, ఒకరి ఇంటి తిండి మరొకరు తినరు. ఇంక ఆ రెండు ఇళ్ళ మధ్యా పెళ్ళి సంబంధాలు అనేవి ఊహించడం కూడా అసాధ్యమే. అలాంటి తేడాలను కనుగొనాలనుకునే వారి కాళ్ళు మట్టిలో అడుగుకంటా లోతుగా దిగిపోవడమే.
డాక్టర్జీ పరిశీలనలు, విశ్లేషణలు, నిర్ణయాలూ చాలా విభిన్నంగా ఉండేవి, అదే సమయంలో అందరినీ ఒప్పించేలా ఉండేవి. ‘ప్రజలు ఒకరి నుంచి మరొకరు దూరం జరగడం ప్రారంభించారు. ఇలాంటి చిన్నచిన్న భేదాభిప్రాయాలను దాటి ఆలోచించి అందరూ కలిసి వచ్చేలా మనకు స్ఫూర్తి కలిగించగలిగినది ఏది? భారతదేశం మన మాత. మనమందరం ఆ తల్లి సంతానమే. భారతమాతను అద్భుతమైన ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం మనందరి బాధ్యత. ఆ ఆలోచన తరతరాలకూ ప్రేరణ కలిగిస్తూ ఉండగలదు’ అని డాక్టర్జీ ఆలోచించారు. దాన్ని సాధించే ప్రయోగంగా డాక్టర్జీ సంఘ శాఖ ప్రారంభించారు.
శాఖకు ప్రేరణ కల్పించే మరొక సూత్రాన్ని కూడా డాక్టర్జీ జోడించారు. ‘నువ్వూ నేనూ హిందువులం. మనిద్దరం సోదరులం’ అన్నదే ఆ సూత్రం. అందులో కులం లేదా వర్ణం గురించిన ఆలోచనే లేదు. గంట పాటు జరిగే శాఖ కార్యక్రమంలో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత. ఆ ఆటల ఆకర్షణ కారణంగా పిల్లలు, తరుణ వయస్కులు, యువకులూ శాఖలో పెద్దసంఖ్యలో చేరేవారు. ఆటల్లో కబడ్డీ తప్పనిసరిగా ఉండేది. ఒకసారి ఔట్ అయిపోయిన ఆటగాడు మళ్ళీ ఆటలోకి రావచ్చు. ఆ ఆట శాశ్వతత్వం అనే సందేశాన్ని ఇచ్చేది. ఆ ఆటలో అంటరానితనం ఎక్కడ ఉంది? అసలు దాని గురించిన ఆలోచనే కలిగేది కాదు. కబడ్డీ అనేది సామరస్యాన్ని పెంపొందించే జీవనదిగా ఉండేది. సంఘ శాఖ అనేది హోమియోపతీ అనే తీపి మందుబిళ్ళలా పనిచేసేది.
‘తత్వమసి’ అనే శాశ్వత సత్యపు వెలుగులో సంఘ శాఖ నడిచేది. ‘తోటివారి కోసం ఆలోచన కలిగి ఉండడం’ అనే విషయమే శాఖ విజయవంతం అవడానికి ప్రధాన సూత్రం. అందరూ సోదరులే కాబట్టి ఒకరి దగ్గరకు మరొకరు సునాయాసంగా వెళ్ళాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేసుకోవాలి, ఎవరికైనా అనారోగ్యం చేస్తే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్వయంసేవకులకు కుటుంబాలతో సంబంధాలు ఎంతలా ఉండాలంటే వారి ఇళ్ళలోని వంటగదుల్లోకి సైతం వెళ్ళగలగాలి. సంఘ శాఖ అనేది సమరసతను అభ్యసించడమే. ‘నేను కాదు నీవు’ అనేదే శాఖ.
శరీరానికి రక్త ప్రసరణ ఎంత ముఖ్యమో సమాజానికి కలిసిమెలిసి ఉండే లక్షణం, సామరస్యం అంతే ముఖ్యం. రక్త నాళాల్లో ఏదైనా అడ్డు ఉంటే దాన్ని ఆంజియోప్లాస్టీ లేదా బైపాస్ చేసి తొలగించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధానికి మార్గం వేయడం అనే బైపాస్ సర్జరీ చేసారు. సామరస్యం అనే సరస్వతిని మళ్ళీ ప్రవహించేలా చేయాలి. ఆ సరస్వతీ మహా ప్రవాహంలో అన్ని అడ్డంకులూ కొట్టుకుపోవాలి.
ఈ సౌభ్రాతృత్వానికి ధార్మిక ప్రాతిపదిక అయిన వేదవాక్యం ‘తత్ త్వమ్ అసి’ అనే భావనను సమాజంలో మళ్ళీ జాగృతం చేయాలి. శాశ్వతమూ, సార్వజనీనమూ, ఆధ్యాత్మికమూ అయిన సత్యం ఆధారంగా సామాజిక జీవితాన్ని పునర్నిర్మించాలి.
ఎలాంటి వివక్షా లేని, ఐకమత్యమూ సామరస్యాలతో కూడిన హిందూ సామాజిక జీవన విధానాన్ని సృష్టించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లక్ష్యం. ఆ స్థితిని సంఘం ‘హిందూ సంఘటన’ అని పిలుస్తుంది.
డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గురూజీ, శ్రీ బాలాసాహెబ్ దేవరస్ ప్రారంభం నుంచీ స్వయంసేవకులు, సహచరులు. సంఘం ప్రారంభమైన 1925 నుంచి 1994 వరకూ అంటే ఏడు దశాబ్దాల పాటు వారే వరుసగా సర్సంఘచాలక్లుగా ఉన్నారు. వారు స్వయంసేవకులకు ఎలా పథ నిర్దేశం చేసారో వారి మాటల్లోనే సోదాహరణంగా చూద్దాం.
సంఘ వ్యవస్థాపకులు మాననీయ డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్:
‘‘మన పని మొత్తం హిందూ సమాజం కోసం కాబట్టి అందులో ఏ ఒక్క భాగాన్నీ మనం విస్మరించలేము. హిందూ సోదరులు అందరితోనూ మన ప్రవర్తన స్నేహపూర్వకంగా ఉండాలి. ఏ హిందువును అయినా తక్కువవాడిగా భావించి పక్కకు నెట్టేయడం మహాపాపం. సంఘ స్వయంసేవకుల మనసుల్లో అలాంటి సంకుచిత బుద్ధి ఎప్పుడూ కలగకూడదు. ఈ దేశాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరితోనూ మన సంబంధం మనందరం ఒకటే అనేవిధంగానే ఉండాలి. మన గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటారు అన్నది ప్రధానం కాదు. మన ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉంటే హిందువులు అందరూ సహజంగానే మన వద్దకు వస్తారు.’’
‘‘సంఘ కార్యం అంటరానితనాన్ని గుర్తించదు. బీద – గొప్ప, బ్రాహ్మణుడు – మాదిగ, పండితుడు – పామరుడు, నాగపూర్ వాసి – గంగోత్రి నివాసి లాంటి తేడాలు సంఘ కార్యానికి తెలియవు. ప్రతీ హిందువుకూ సంఘంలో ఆహ్వానం ఉంది.’’
శాఖ పద్ధతి ద్వారా స్వయంసేవకులు ‘కులం లేదా జాతి, పేదవారు లేక ధనికులు, విద్యావంతులు లేక చదువు లేనివారు, గ్రామీణులు లేక నాగరికులు అనే తేడాలు ఏమీ లేకుండా హిందూ సోదరులు అందరూ కలవగలరు’ అని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. సంఘంలోని కులరహిత వ్యవస్థను చూసి గాంధీజీ కూడా ముగ్ధులయ్యారు. 1934లో వార్ధాలో జరిగిన సంఘ శిబిరాన్ని సందర్శించిన గాంధీ ఆ శిబిరంలో అన్ని కులాలు, తెగలకు చెందిన స్వయంసేవకులు కలిసిమెలిసి ఒకేచోట బస, ఆహారం, తాగునీరు వ్యవస్థలకు ఏర్పాట్లు చేసుకోవడాన్ని చూసి సంతోషించారు. 1940లో నాగపూర్లో నిర్వహించిన సంఘ శిక్షా వర్గలో దేశం నలుమూలల నుంచీ వచ్చిన సుమారు 1500 మంది స్వయంసేవకులు 40 రోజుల పాటు అన్నాదమ్ముల్లా కలిసిమెలిసి ఉండడం చూసి డాక్టర్జీ, గురూజీ, బాలాసాహెబ్ దేవరస్జీ తదితరులు ఎంతగానో ఆనందించారు. ఎలాంటి వివక్షలూ లేని, సామరస్యంతో కూడుకుని ఉన్న హిందూ సమాజాన్ని వారు తమ కళ్ళ దృశ్యరూపంలో చూసారు.
డాక్టర్ హెడ్గేవార్ యజ్ఞ ఆహుతి కారణంగా మనం కోల్పోయిన సామరస్య సరస్వతి మళ్ళీ ప్రవహించడం మొదలైంది. శ్రీ గురూజీ ఆ ప్రవాహం ఉధృతిని, వడిని పెంచడమే కాదు, ఆ ప్రవాహం దేశమంతటా వ్యాపించేలా చేసారు. 700 శాఖలు గురూజీ నేతృత్వంలో 11వేలకు పెరిగాయి. సంఘకార్యం అదేవిధంగా కొనసాగి ఉంటే మనం సామరస్యత కలిగిన ఏకరీతి సమాజాన్ని చాలాకాలం క్రితమే పొందగలిగి ఉండేవాళ్ళం.
సమాజంలో సమరసతను సృష్టించే దిశగా సంఘ శాఖల పనితీరును పరీక్షించాలని విధి ఎందుకు భావించిందో మనకు తెలియదు. స్వతంత్ర భారత ప్రభుత్వమే సంఘంపై ‘గాంధీజీ హత్య’ అనే భయంకరమైన తప్పుడు ఆరోపణ చేసింది. సంఘం మీద నిషేధం విధించింది. దాంతో శాఖలు ఆగిపోయాయి. సమరసతా ప్రవాహం ఎండిపోయింది.
గాంధీ హత్య విషయంలో సంఘం దోషి కాదు అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయినప్పటికీ సంఘం మీద నిషేధం కొనసాగింది. ఆ నిషేధాన్ని తొలగింపజేసుకోడానికి ఆర్ఎస్ఎస్ మరో సత్యాగ్రహమే చేయవలసి వచ్చింది. ఎట్టకేలకు నిషేధం ఎత్తివేసాక సంఘ శాఖలు పనిచేయడం మళ్ళీ మొదలైంది. ఏకరూపత కలిగిన, సామరస్యత కలిగిన సమాజాన్ని సృష్టించడమే లక్ష్యంగా శాఖలు పని చేయసాగాయి. కానీ నిషేధం వల్ల భారీ నష్టమే వాటిల్లింది. దురభిప్రాయాలు, తప్పుడు అవగాహనల కారణంగా సంఘానికి సమాజం మరింత దూరమైంది. దాంతో సమాజంలో సమరసతా ప్రవాహానికి బదులు, దేశంలో చాలా చోట్ల నీరు నిలవ చేరి మురుగులా మారినట్లయింది.
శ్రీ మాధవ సదాశివ గోళ్వాల్కర్ (శ్రీ గురూజీ):
అలాంటి కష్టకాలంలో డాక్టర్ హెడ్గేవార్ సంఘానికి తన తరువాత సర్సంఘచాలక్గా మాధవ సదాశివ గోళ్వాల్కర్ (గురూజీ)ని ఎన్నుకున్నారు. ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త. ‘అన్నిచోట్లా ఒకే చైతన్యమే ఉంటుంది’ అన్న ఎరుక పొందినవారు. జైలు నుంచి బైటకు వచ్చిన వెంటనే ఆయన స్వయంసేవకులకు చేసిన మార్గదర్శనం చాలా గొప్పది.
— ‘‘గత ఏడాదిన్నరగా నిలిచిపోయిన మన పనిని అమితోత్సాహంతో మళ్ళీ మొదలుపెడదాం. ఏది ఏమైనా మనం ఎవరిపట్లా ఎలాంటి చెడు అభిప్రాయాలనూ కలిగి ఉండకూడదు. సంఘంపై నిషేధం కాలంలో ఏర్పడిన ఖాళీని మనం పవిత్రమైన, పరిశుద్ధమైన హృదయంతో పూడ్చాలి. ఎంతో వేగంగా, అదే సమయంలో ఎంతో సహనంగా పని చేయాలి. మన సొంత వర్గానికి చెందిన వారి పట్ల ఎలాంటి ద్వేష భావనలూ, ధిక్కార భావనలూ పెట్టుకోకూడదు. ‘పళ్ళూ మనవే నాలుకా మనదే’ అనే సామెతను గుర్తు పెట్టుకోవాలి. నాలుకను కరిచినందుకు ఎవరూ తమ సొంత పళ్ళు రాలగొట్టుకోరు కదా. జరిగినదంతా మరచిపోండి.’’
— ‘‘సామరస్యపూర్వకమైన, సమైక్యత కలిగిన, వ్యవస్థీకృతమైన సమాజాన్ని నిర్మించడం కోసం ప్రతీ ఒక్కరినీ దగ్గరకు తీసుకుని రావాలని భావిస్తాం. వారిని కులం, జాతి వంటి వర్గీకరణల ఆధారంగా కాదు… సమాజం, దేశం అనే శాశ్వత ప్రాతిపదికన ఒకచోట చేర్చాలని అనుకుంటాం. ఎలాంటి భేదాభిప్రాయాలూ ఉండకూడు. అదే సంఘం ఆలోచన’’
— సమాజంలో ఏ రెండు వర్గాల మధ్యా ఎలాంటి భేదాభిప్రాయాలూ ఉండకూడదు అన్నది సంఘం ఆలోచనా ధోరణి
— అంటరానితనం అనేది అగ్రకులాల వారి సంకుచిత మనస్తత్వం అనే ఒక వ్యాధి. అస్పృశ్యతను నిర్మూలించడం అంటే అగ్రకులాల వారి సంకుచిత మనస్తత్వాన్ని మార్చడమే. సామాన్య ప్రజల్లో అత్యధికశాతం మంది సాధారణంగా ‘అంటరానితనం అనేది ధర్మంలో ఒక భాగం, ధర్మాన్ని అతిక్రమించడం ఘోర పాపం’ అనుకుంటారు. తమను తాము అగ్రకులాల వారిగా భావించే ప్రజలు సోకాల్డ్ అంటరానివారిని తమతో సమానులుగా పరిగణించడానికి సిద్ధంగా ఉండరు. ఈమధ్యనే రాజస్థాన్లోని ఒక గ్రామంలో ఒక హరిజన యువకుణ్ణి చచ్చేలా కొట్టారనే వార్త చదివాను. వాళ్ళు అతన్ని కొట్టడానికి కారణం అతను పెంచుకున్న మీసమే అట. హరిజనుడికి మీసం ఉంటే ఏమవుతుంది? ఆ ఊరివాళ్ళ ప్రకారం మీసం ధరించడం అనేది క్షత్రియుల హక్కు మాత్రమే. ఆ సంఘటనను ఏ ఒక్క మత గురువూ ‘నిషేధించలేదు’ అంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవాలి.
— సనాతన ధర్మంలో ‘అంటరానితనాన్ని ఆమోదించలేదు’ అని మత గురువులతో ప్రకటన చేయించడానికి గురూజీ ఎంతో ప్రయత్నించారు. 1969లో ఉడుపిలో విశ్వహిందూ పరిషత్ సమావేశంలో ధార్మిక గురువులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక తీర్మానం చేసారు. ‘ధార్మికమైన ఏ ఆచారంలోనూ అంటరానితనానికి చోటు లేదు’ అన్నదే ఆ తీర్మానం. ఆ సమావేశంలోనే స్వామీజీలు అందరూ కలిసి సమాజానికి ‘హైందవాః సోదరా స్సర్వే’ (హిందువులు అందరూ పరస్పరం సోదరులే) అనే మంత్రాన్ని ఇచ్చారు.
— సుమారు 40ఏళ్ళ క్రితం నేను బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాను. అక్కడ కూడా తనకు ఆహారం సంపాదించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి అని ఒక హరిజన విద్యార్థి చెప్పారు. నేను నా స్నేహితులతో మాట్లాడాను. ఆ విద్యార్ధులకు ఉచితంగా ఆహారం అందించడానికి వారు ఒప్పుకున్నారు. ఆ ఏర్పాటు రెండేళ్ళకు పైగా కొనసాగింది.
— శిథిలమైపోయిన కుల వ్యవస్థను ధ్వంసం చేసి, ఒక తరగతిని సృష్టించాల్సి ఉంది. అక్కడినుంచీ ఓ కొత్త సామాజిక నిర్మాణాన్ని ఏర్పరచాలి.
— పాతకాలపు పద్ధతి ఒకటి అదృశ్యమై, మరో కొత్త పద్ధతి వస్తూంటే కన్నీళ్ళు కార్చాల్సిన అవసరం లేదు. దాన్ని సాదరంగా ఆహ్వానించాలి. సమాజపు ఐకమత్యం మారకుండా ఉండడం ప్రధానం.
శ్రీ బాలాసాహెబ్ దేవరస్:
ఆర్ఎస్ఎస్ మూడవ సర్సంఘచాలక్గా బాలాసాహెబ్ దేవరస్ వ్యవహరించారు. డాక్టర్జీ, గురూజీలతో కలసి పని చేసి, వారి తర్వాత సంఘాన్ని నడిపించిన వారు దేవరస్. ఆయన సంఘం గురించి ఈ విధంగా చెప్పారు.
‘‘సంఘం కార్యం యావత్ హిందూ సమాజం ప్రయోజనం కోసం జరుగుతోంది. ఈ సమాజాన్ని ఐకమత్యంగా చేయడం కోసం, దాని స్వభావాన్ని మరింత గుణవంతం చేయడం కోసం, హిందూ సమాజాన్ని ఆత్మగౌరవం, శక్తి, ధైర్యం కలిగినదిగా తీర్చిదిద్దడం కోసం సంఘం పని చేస్తోంది. దాన్ని ఏ ఒక్క కులానికో పరిమితం చేయడం సాధ్యం కాదు. కుల తత్వం, అంటరానితనం అనే వాటిని మనం విశ్వసించము అన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ స్వయంగా అనుభవించి తెలుసుకోవచ్చు. మనం నాలుగు వర్ణాల వ్యవస్థని ఆమోదించము. యావత్ హిందూ సమాజం అంతా ఒకటే, అందులో అందరూ సమానులే. మొదటినుంచీ మన విశ్వాసం అదే. మన ప్రత్యేకమైన పనితీరుతో కుల ఆధారిత దురభిప్రాయాలకు ముగింపు పలుకుతూనే వచ్చాం. విభిన్న కులాలు, తెగలు, భాషల మధ్య సామరస్యం, సమన్వయం అనేవి సంఘంలో కనిపించినంత చక్కగా మరెక్కడా ఉండబోవని నేను గర్వంగా చెప్పగలను.’’
‘‘అంటరానితనం అనేది సామాజిక అసమానతను ప్రదర్శించడమే. అది మన సమాజంలో ఒక దురదృష్టకరమైన విషయం. అది తప్పు. అంటరానితనం పాపం కాకపోతే ఈ ప్రపంచంలో పాపం అనేది ఏదీ లేదు.’’
‘‘ఈ దేశాన్ని ఉద్ధరించడం కోసం హిందూ సంస్థ అవసరం. ఒక సంస్థ హిందూ సంస్థగా మనడానికి సామాజిక సమానత్వం అవసరం.’’
‘‘సమాజాన్ని పరివర్తన చేయాలని భావించే వారు మహిళల జీవితాలను విస్మరించలేరు. మహిళలు ఈ సమాజంలో అర్ధభాగం. సమాజంలోని ఆ అర్ధభాగం బలహీనంగా కొనసాగడం సరికాదు.’’
‘‘ఉత్పాదన ఫలాలు దేశంలోని అన్ని ప్రాంతాలకూ అందాలి. దాని ద్వారా ఈ దేశపు సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు పెరగాలి.’’
ఇవాళ మనం చూస్తున్న ఆర్ఎస్ఎస్ నిర్మాణం మొదటి ముగ్గురు సర్సంఘచాలక్ల మార్గదర్శనంలో తీర్చిదిద్ద బడింది. స్వయంసేవకులు సమాజంలోని వివిధ విభాగాల్లో వ్యవస్థాగత కార్యాల్లో పాల్గొంటున్నారు. అలాంటి పనుల్లో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోంది. ఏ రకమైన పనిలో ఐనా సామరస్యాన్ని, ఏకరూపతనూ సాధించడం ప్రధానం. సంఘం కులాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు. చాలామంది స్వయంసేవకులు కులాంతర వివాహాలు చేసుకున్నారు. అయితే దాన్ని ప్రచారం చేసుకోవడం అనేది కులాన్ని మరచిపోకపోవడంతో సమానమైనది. శ్రీ గురూజీ, బాలాసాహెబ్ దేవరస్ అలాంటి పెళ్ళిళ్ళకు స్వయంగా హాజరయ్యారు.
సంఘ కార్యం – సమాజం:
1948లో గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించడం సంఘ కార్యానికి మళ్ళీ అడ్డు తగిలింది. అత్యవసర పరిస్థితి సమయంలో సంఘాన్ని మరోసారి నిషేధించారు. అది సంఘం తలరాతనే మార్చేసింది. 1975-76 నాటి నిషేధం సంఘం పని మీద సమాజపు దృక్కోణాన్ని మార్చివేసింది. సంఘ కార్యం రెట్టింపు వేగంతో ఊపందుకుంది. ప్రస్తుతం దేశంలో 80వేల శాఖలు ఉన్నాయి. సామరస్యమనే సరస్వతీ నదిని దేశంలోని ప్రతీ గ్రామానికీ చేరేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వామి వివేకానంద ఇలా చెప్పారు. ‘పవిత్రత పట్ల భక్తి, భగవంతుడి మీద అచంచలమైన శాశ్వతమైన విశ్వాసం, సింహానికుండే ధైర్యం, పేదలూ అణగారిన వర్గాల పట్ల సానుభూతి గుండెల్లో నిండుగా కలిగిన లక్ష మంది భారతీయులను ఈ దేశం అంతటా పంపించాలి. వారు విముక్తి గురించి, సహాయం గురించి, సామాజిక అభివృద్ధి గురించి, సమానత్వం గురించి ప్రచారం చేయాలి’. ఆ ఆకాంక్ష త్వరలోనే నెరవేరడం ఖాయం.
తత్ త్వమ్ అసి అనే సార్వజనీన సత్యమే సామాజిక సమరసతకు, సహోదర భావానికీ, సమానత్వ ప్రకటనకూ మూలం. వ్యక్తి నడవడికకు దారి ‘నేను కాదు నువ్వే ప్రధానం’ అయినప్పుడు సమాజంలో ఎలాంటి వివక్షా ఉండనే ఉండదు.
బహిష్కృత్ భారత్ పత్రికలో ఒక సంచికలో ప్రచురించిన వ్యాసంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ‘‘హిందూత్వం అనేది సమానత్వ సిద్ధాంతానికి ఇస్లాం, క్రైస్తవం కంటె చాలా సహాయకరమైనది. మానవులు భగవంతుని పిల్లలు, అంతే కాదు, వారు స్వయంగా భగవంతుని ప్రతిరూపాలు. ఆ విషయాన్ని హిందూ మతం గొప్పగా చెప్పుకుంటుంది. అన్నీ భగవంతుడి ప్రతిరూపాలే అయినప్పుడు ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అనే వివక్షను చూడడం, వాటి మధ్య వివక్ష ప్రదర్శించడం సాధ్యం కాదు. అదే హిందూమతపు గొప్పదైన, మహత్తరమైన నియమం. సమానత్వం అనే సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ఇంతకు మించి మరే గొప్ప ప్రాతిపదికనూ కనుగొనడం చాలా కష్టం.’’
‘తత్ త్వమ్ అసి – అది నీవే అయి ఉన్నావు’ అనే వేదవాక్యం గురించి యావత్ సమాజమూ తెలుసుకోవాలి. సమరసతా గతివిధి పేరిట ఒక ప్రత్యేక విభాగాన్నే సంఘం ప్రారంభించింది. దాని లక్ష్యం శాఖలో ప్రతీ రోజూ పొద్దున్న జరిగే దాన్ని సమాజంలోకి తీసుకురావడమే. సాధుసంతులు, ధార్మిక గురువులూ ఆధ్యాత్మిక చైతన్యం కల్పించడం కోసం వచ్చారు. అంటరానితనం పరిపూర్ణ నిర్మూలన ఈ జాతి ఆకాంక్షగా నిలిచింది.