గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అవుతుండగానే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12మంది విమాన సిబ్బంది ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయల్దేరిన నిమిషాల్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
విమానం అహ్మదాబాద్లోని మేఘానీ నగర్ ప్రాంతంలో బి.జె మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద పడింది. దాంతో ఆ హాస్టల్లోని ఐదుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53మంది బ్రిటిష్ దేశస్తులు, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా వాసి ఉన్నారు.
ఎఐ 171 విమానం రన్వే నెంబర్ 23 నుంచి మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయిందని, కొన్ని క్షణాల్లోనే కుప్పకూలి పోయిందనీ ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్యను అధికారికంగా ధ్రువీకరించ లేదు.
ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణిస్తున్న వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. బీజేపీ నాయకుడైన 68ఏళ్ళ విజయ్ రూపానీ, లండన్లో ఉన్న తన కుమార్తె దగ్గరకు వెడుతున్నారని సమాచారం.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్కు పయనమయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీకి ప్రమాద దుర్ఘటన గురించి వివరించారు, ఆయన కూడా అహ్మదాబాద్ వెడుతున్నారు.
ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషాదం ‘మాటలకు అందని గుండెకోత’ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ‘‘అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విషాదం మనలను అందరినీ దిగ్భ్రాంతికీ, విషాదానికీ గురి చేసింది. ఇది మాటలకు అందని గుండెకోత. బాధితులకు సహాయం అందజేస్తున్న అధికారులు, మంత్రులతో నిరంతరం మాట్లాడుతున్నాను. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను’’ అని మోదీ వెల్లడించారు. బాధితులకు అవసరమైన సాయం అందజేస్తామన్నారు.
జరిగిన దుర్ఘటనపై యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పందించారు. ‘‘లండన్ రావలసి ఉన్న విమానం ప్రమాదానికి గురైన దృశ్యాలు గుండెలను ముక్కలు చేసేలా ఉన్నాయి. ఆ విమానంలో పలువురు బ్రిటిష్ జాతీయులు ఉన్నారు. బాధిత ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యుల గురించే ఆలోచిస్తున్నాను’’ అంటూ స్టార్మర్, ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసారు.
విమానం ప్రమాదానికి గురి అవుతున్నప్పటి దృశ్యాలను పరిశీలిస్తే విమానం చాలా తక్కువ ఎత్తులో పయనిస్తోందని, తగినంత ఎత్తుకు ఎగరలేకపోయిందనీ స్పష్టంగా తెలుస్తోంది. పైలట్ వెంటనే ఎయిర్పోర్ట్కు డిస్ట్రెస్ కాల్ చేసాడు. దానికి ఎటిసి సిబ్బంది స్పందించేలోగానే విమానం పేలిపోయింది. ఎటిసి సిబ్బంది తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ప్రతిస్పందన రానేలేదు.
ప్రమాద ఘటన తర్వాత అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసారు. సాయంత్రం 4.05 గంటలకు పునరుద్ధరించారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ నుంచి అదనపు రైళ్ళను నడుపుతామని పశ్చిమ రైల్వే ప్రకటించింది.