ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ 2014 మే 26న దేశ పరిపాలనా పగ్గాలు అందుకుంది. 2025 మే 26 నాటికి అధికారంలో 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ వ్యవధిలో భారత ప్రభుత్వం వివిధ దేశాలతో స్నేహపూర్వకమైన, దౌత్యపరమైన సంబంధాలను పటిష్ఠ పరచుకోవడంపై అధిక శ్రద్ధ వహించింది.
ఆ నిబద్ధతను ప్రదర్శిస్తూనే భారత ప్రభుత్వం, భూకంపంతో విలవిలలాడిన మయన్మార్ దేశానికి తక్షణ మానవతా సహాయం అందించడం కోసం 2025 మార్చి 28న ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రారంభించింది. భారత వాయు సేనకు చెందిన సి-130జె విమానం ద్వారా యాంగూన్కు 15 టన్నుల సహాయక సామగ్రి పంపించింది. అందులో టెంట్లు, కంబళ్ళు, ఆహార పదార్ధాలు, వాటర్ ప్యూరిఫయర్లతో పాటు ప్రాణ రక్షణ ఔషధాలు ఉన్నాయి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి అవసరమైన ప్రతీసారీ ఉదారంగా స్పందించింది. అలాగే పలు సందర్భాల్లో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలోనూ వేగంగా చర్యలు తీసుకుంది. మోదీ ప్రభుత్వం 11 ఏళ్ళ పాలనలో అలాంటి 11 ప్రధానమైన సహాయక కార్యకలాపాల వివరాలు ఒకసారి చూద్దాం…
(1) యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న వారిని రక్షించిన ‘ఆపరేషన్ రాహత్’:
ఇరాన్ మద్దతు పుష్కలంగా ఉన్న హుతీ ఉగ్రవాదులు 2015 మార్చిలో యెమెన్ దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు దాడులు చేసారు. యెమెన్ రాష్ట్రపతి అబ్దుర్ రబ్బూ మన్సూర్ హాదీ తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోవలసి వచ్చింది. ఇరాన్ ప్రభావం అమితంగా పెరిగిపోతుండడం చూసి 2015 మార్చి 26న సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒక సైనిక కూటమి ‘ఆపరేషన్ డెసిసివ్ స్టార్మ్’ అనే సైనిక చర్య మొదలు పెట్టింది. అందులో భాగంగా గగనతల దాడులు చేపట్టింది, బాంబుల వర్షం కురిపించింది. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ అస్థిరత, విద్రోహ చర్యల కారణంగా యెమెన్లో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
ఆ సమయంలో యెమెన్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను రక్షించడానికి మన వైమానిక, నౌకా దళాలు కలిసి ‘ఆపరేషన్ రాహత్’ చేపట్టాయి. ఆ ఆపరేషన్ ద్వారా మొత్తం 5600 మందిని రక్షించారు. వారిలో 4640 మంది భారతీయులు. మిగిలిన 960 మంది అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఇరాక్ తదితర 41 దేశాలకు చెందిన వారు. ఆపరేషన్ రాహత్ 2015 ఏప్రిల్ 1 నుంచి 11 వరకూ మొత్తం 11 రోజుల పాటు సాగింది.
ఆపరేషన్ రాహత్లో ఎయిర్ ఇండియా – ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-17 గ్లోబ్మాస్టర్ విమానంతో పాటు భారత నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమిత్ర, ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ తారకాశ్ నౌకలు కూడా పాల్గొన్నాయి. యుద్ధక్షేత్రం నుంచి సామాన్య పౌరులను రక్షించడంలో కీలక భూమిక వహించాయి.
(2) భూకంప బాధిత నేపాల్కు సహాయం కోసం ‘ఆపరేషన్ మైత్రి’:
హిమాలయ దేశం నేపాల్ను 2015 ఏప్రిల్ 25న భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ మీద 7.8 తీవ్రత నమోదైన ఆ శక్తివంతమైన భూకంపం కారణంగా రాజధాని కాఠ్మాండూ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. తీవ్ర కష్టంలో కూరుకుపోయిన నేపాల్కు సహాయం చేయడం కోసం భారతదేశం ‘ఆపరేషన్ మైత్రి’ ప్రారంభించింది. భారత సైన్యం, భారత వైమానిక దళం కలిసి 40 రోజుల పాటు సేవలందించాయి. ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలతో పాటు భారత పౌర విమానాలు కలిసి 5వేల మందికి పైగా భారతీయులను నేపాల్ నుంచి స్వదేశానికి తరలించాయి. అంతే కాక అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ దేశాలకు చెందిన 170 మంది విదేశీయులను సైతం విజయవంతంగా రక్షించి తరలించాయి. నేపాల్ కు సహాయం కోసం భారతదేశం 1348.995 టన్నుల సహాయక సామగ్రి పంపించింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-17, సి-130, ఐఎల్-76 విమానాల ద్వారా వైద్య బృందాలు, మందులు, ఆహార పదార్ధాలు, టెంట్లు, ఇంజనీరింగ్ పరికరాలూ పంపించారు. భారత సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్కు చెందిన మాజీ సైనికులు సహాయక, రక్షణ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
(3) సూడాన్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకై ‘ఆపరేషన్ సంకట్ మోచన్’:
దక్షిణ సూడాన్ రాజధాని జూబాలో 2016 జులైలో రాష్ట్రపతి సల్వా కీర్, ఉపరాష్ట్రపతి రియెక్ మాచార్ వర్గీయుల మధ్య సాయుధ ఘర్షణ మొదలైంది. నిజానికి ఇది 2013లో ప్రారంభమైన అంతర్యుద్ధంలో ఒక భాగం మాత్రమే. అయితే 2016 జులైలో ఆ సాయుధ ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఇద్దరు నాయకుల సమర్ధకుల మధ్యా జరిగిన పోరులో 300 కంటె ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేలాది మంది సామాన్య ప్రజలు ఇళ్ళు కోల్పోయి నిర్వాసితులు అయ్యారు.
సూడాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి మన దేశం 2016 జులై 13న ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ ప్రారంభించింది. భారత వైమానిక దళానికి చెందిన రెండు సి-17 గ్లోబ్మాస్టర్ విమానాలను పంపించింది. వాటిలో 156 మంది భారతీయులు స్వదేశానికి చేరుకోగలిగారు.
భారత్ మన దేశానికి చెందిన పౌరులు అందరినీ ఉగాండా మార్గంలో తరలించింది. ఉగాండా ప్రధానమంత్రి రూహాకానా రుగుండా భారత ప్రభురిత్వానికి అన్ని రకాలుగానూ సహాయం చేస్తామని మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నారు.
‘ఆపరేషన్ సంకట్ మోచన్’ కార్యక్రమాన్ని నాటి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ జనరల్ వి.కె సింగ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
(4) మూడు దేశాల్లోని భారతీయులను వెనక్కు తెచ్చిన ‘ఆపరేషన్ సముద్ర సేతు’:
కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్నీ గడగడలాడించింది. ఆ సమయంలో ఇతర దేశాల్లో ఉన్న పౌరులను స్వదేశానికి తరలించే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ సర్కారు సమర్ధంగా నిర్వహించింది. అందులో భాగంగా మాల్దీవులు, ఇరాన్, శ్రీలంక… మూడు దేశాల్లో ఉన్న 3992 మంది భారతీయులను సముద్ర మార్గంలో స్వదేశానికి చేర్చారు. ఆ కార్యక్రమానికి ‘ఆపరేషన్ సముద్ర సేతు’ అని పేరు పెట్టారు. ఆ ఆపరేషన్ 2020 మే 5 నుంచి జూన్ 25 వరకూ అంటే 52 రోజుల పాటు సాగింది. భారత నౌకా దళానికి చెందిన జలాశ్వ ప్లాట్ఫాం డాక్తో పాటు ఐరావత్, శార్దూల్, మగర్ అనే ల్యాండింగ్ షిప్ ట్యాంక్లు ఆ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
(5) ‘వందే భారత్ మిషన్’ ద్వారా 67.5 లక్షల మంది తరలింపు:
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే దారీ తెన్నూ తెలీక అగ్రరాజ్యాలు సహా ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లిపోయాయి. భూమి మీద ప్రతీ దేశంలోనూ భారతీయులు ఉన్నారు. వారందరినీ స్వదేశానికి తరలించడం అనే బృహత్తర కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం తలకెత్తుకుంది. ‘వందే భారత్’ పేరుతో అతి పెద్ద తరలింపు కార్యక్రమం చేపట్టింది. ఏకంగా 67.5 లక్షల మందికి పైగా భారతీయులను స్వదేశానికి చేర్చింది.
ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ విమానాల ద్వారా 18,79,968 మంది భారతీయులు మాతృభూమికి చేరుకున్నారు. 36,92,216 మంది ఛార్టెర్డ్ విమానాల ద్వారా భారత్ వచ్చారు. భారత నౌకాదళానికి చెందిన ఓడలు 3,987 మందిని స్వదేశానికి తీసుకొచ్చాయి. 5,02,151 మంది రహదారి మార్గాల ద్వారా భారత భూభాగం లోపలికి వచ్చారు.
(6) అప్ఘాన్ నుంచి భారతీయులను తరలించిన ‘ఆపరేషన్ దేవీ శక్తి’:
తాలిబాన్లు ఇతర ఉగ్రవాద మూకలతో కలిసి 2021 మే 1న అప్ఘానిస్తాన్ మీద పెద్ద దాడి చేసారు. తర్వాత క్రమంగా తాలిబాన్ ఉగ్రవాదులు అప్ఘానిస్తాన్లోని వివిధ విభాగాలను మెల్లమెల్లగా ఆక్రమించసాగారు. తమ నియంత్రణలోకి తెచ్చుకొన్నారు. చివరిగా దేశ రాజధాని కాబూల్ను హస్తగతం చేసుకున్నారు. దానితో అప్ఘానిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా పతనమైంది.
అప్ఘానిస్తాన్ మీద తాలిబాన్ల దాడి, దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో అక్కడున్న భారతీయుల భద్రత కోసం మోదీ సర్కారు వారిని స్వదేశానికి తీసుకొచ్చేసింది. దాని కోసం 2021 ఆగస్టు 16న ‘ఆపరేషన్ దేవీ శక్తి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. 800 కంటె ఎక్కువ మంది భారతీయులను సురక్షితంగా తరలించింది.
ఆ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-17 గ్లోబ్మాస్టర్, ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం గణనీయమైన సేవలు అందించాయి.
(7) యుద్ధం మధ్యలో విద్యార్ధుల ఎయిర్లిఫ్ట్ కోసం ‘ఆపరేషన్ గంగ’:
రష్యా ఉక్రెయిన్ మధ్య సైనిక ఘర్షణ 2022లో మొదలై నేటికీ కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఆ ఘర్షణ పలువురు భారతీయ తల్లిదండ్రులకు అశనిపాతమైంది. ఉక్రెయిన్లో వైద్య విద్య అభ్యసించే వారిలో అత్యధికులు భారతీయులు కావడమే దానికి కారణం. వారిని రక్షించడానికి మోదీ సర్కారు కంకణం కట్టుకుంది. పాక్షికంగా యుద్ధమే చేస్తున్న ఇరు దేశాలనూ ఒప్పించి, వారి పరస్పర దాడులను తాత్కాలికంగా నిలువరించి, భారతీయ విద్యార్ధులను అక్కడినుంచి సురక్షితంగా తరలించింది. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలూ భారత్ మాటకు విలువనిచ్చి మన విమానాలు తిరిగే దారిలో గగనతల దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం మన దేశ దౌత్య నీతి విజయవంతానికి ఘనమైన నిదర్శనం.
రష్యా, ఉక్రెయిన్ దేశాల అధినేతలు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడారు. 2022 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 11 వరకూ ‘ఆపరేషన్ గంగ’ చేపట్టారు. యుద్ధం చేసుకుంటున్న రెండు దేశాల మధ్య నుంచి 22వేల మందికి పైగా భారతీయులను వెనక్కు తీసుకొచ్చారు. అంతే కాదు, ఆ ఆపరేషన్కు అయిన మొత్తం ఖర్చును భారత ప్రభుత్వమే భరించింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ గగనతలం మూసేసారు. దాంతో భారతీయ విద్యార్ధులను తిరిగి తీసుకురావడానికి పోలండ్, రొమేనియా, హంగేరీ, స్లొవాకియా దేశాలు ముందుకొచ్చాయి.
(8) సూడాన్లో భారతీయుల రక్షణకై ‘ఆపరేషన్ కావేరి’:
భారత సాయుధ బలగాలు ఆఫ్రికన్ దేశం సూడాన్లో అంతర్యుద్ధం సమయంలో భారతీయ విద్యార్థులను, మరికొందరు విదేశీ విద్యార్థులనూ సహాయపడడమే ‘ఆపరేషన్ కావేరి’ ప్రధాన ఉద్దేశం.
ఆ ఆపరేషన్లో భాగంగా 136మంది విదేశీయులు సహా మొత్తం 4097 మందిని రక్షించారు. ఆ మిగిలిన 3961 మందీ భారతీయులే.
ఆ ఆపరేషన్లో భారతీయ వాయు సేనకు చెందిన రెండు ప్రత్యేక విమానాలు సి-130జె సూపర్ హెర్క్యులెస్, సి-17 గ్లోబల్ మాస్టర్ పాల్గొన్నాయి. భారతీయ నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ తేగ్, ఐఎన్ఎస్ తరకశ్ ఓడలు కూడా తమ సేవలు అందించాయి.
(9) తుర్కియే, సిరియాలకు సాయం కోసం ‘ఆపరేషన్ దోస్త్’:
2023 ఫిబ్రవరిలో తుర్కియే, సిరియా దేశాల వద్ద భారీ భూకంపం చోటు చేసుకుంది. దానితో జరిగిన సర్వనాశనం తర్వాత మానవతా దృక్పథంతో భారతదేశం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అంటే భూకంపం కారణంగా తప్పిపోయిన వారిని వెతకడం, రక్షించే కార్యక్రమం. దాని పేరే ‘ఆపరేషన్ దోస్త్’.
2023 ఫిబ్రవరి 6న రిక్టర్ స్కేల్ మీద 7.8 తీవ్రతతో తుర్కియే, సిరియా దేశాల నడుమ భయంకరమైన భూకంపం చోటు చేసుకుంది. ఆ ప్రకృతి ఉత్పాతంలో 50వేల మందికి పైగా చనిపోయారు. ఆ రెండు దేశాలకూ వెంటనే సాయం చేయడం కోసం భారతదేశం ‘ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది. అందులో వేర్వేరు విభాగాలకు చెందిన బృందాలు ఉన్నాయి. భారత్ మొత్తం 140 టన్నులకు పైగా సహాయక సామగ్రి పంపింది. అవి కాకుండా మందులు విడిగా పంపించింది. తుర్కియేలో భారత్ ఏర్పాటు చేసిన సైనిక ఆస్పత్రిలో 3వేల మందికి పైగా రోగులకు చికిత్స చేసారు.
(10) ఇజ్రాయెల్ నుంచి 1200 మందిని రక్షించిన ‘ఆపరేషన్ తహత్’:
నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హమాస్ ఏకపక్ష దాడులతో పలువరు ఇజ్రాయెలీలను చంపివేసిన తర్వాత ఆ దేశం హమాస్ను శాశ్వతంగా తుడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ఇరు పక్షాల మధ్యా భయంకరమైన యుద్ధం మొదలైంది.
ఆ యుద్ధం మధ్యలో నుంచి భారతదేశం తమ పౌరులను రక్షించుకోడానికి 2023 అక్టోబర్ 11న ‘ఆపరేషన్ అజయ్’ చేపట్టింది. ఐదు ప్రత్యేక విమానాల్లో 18 మంది నేపాలీలు సహా సుమారు 1200 మంది భారత పౌరులను రక్షించారు.
ఇజ్రాయెల్లో దాదాపు 18వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో అత్యధికులు విద్యార్థులు కాగా మిగిలిన వారు ఐటీ నిపుణులు, వజ్రాల వ్యాపారులూ ఉన్నారు. ప్రమాద సమయంలో భారత్ తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి చేర్చుకోగలిగింది.
(11) భూకంప బాధిత మయన్మార్కు అండగా ‘ఆపరేషన్ బ్రహ్మ’:
మయన్మార్లో 2025 ఏప్రిల్లో భయంకరమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన దాని తీవ్రత 7.7గా నమోదు అయింది. వెంటనే బాధితులకు సహాయం కోసం భారతదేశం ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రకటించింది. అందులో భాగంగా మానవతా సహాయం, సైనికుల ఫీల్డ్ ఆస్పత్రి, ఎన్డిఆర్ఎఫ్ భద్రతా సిబ్బందితో కూడిన బృందాన్ని మయన్మార్ పంపించారు.
సి130-జె విమానంలో 15 టన్నుల సహాయక సామగ్రి పంపించారు. చికిత్సలకు అవసరమైన వైద్యానికి తోడు ఔషధాలు, యాంగూన్లో నిర్మించడానికి టెంట్లు, కంబళ్ళు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫయర్లు పంపించారు.
ఉపసంహారం:
ఇలా, విదేశాలు ముప్పులో ఉన్నప్పుడు అండగా ఉన్నామంటూ భరోసా కల్పించే దేశం భారత్ మాత్రమే. విదేశాల్లో భారతీయులు కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టింటికి తీసుకొచ్చి కన్నీళ్ళు తుడిచే దేశమూ భారత్ మాత్రమే. సహాయం అనే లక్షణం భారతీయులకు సహజ సిద్ధమే అయినప్పటికీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పాలనలో ఆ సహాయం సకారాత్మకంగా జరగడం గర్వించదగిన పరిణామం.