అమరావతి రాజధాని మహిళలపై సాక్షి టీవీలో లైవ్ షో నిర్వహించి, అతిథితో అస్యభ్యంగా మాట్లాడించిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సోమవారం హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తరవాత మంగళగిరి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని, అమరావతి దేవతల రాజధాని అనడంకంటే వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తుళ్లూరుకు చెందిన రాయపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఐటీ చట్టం కింద కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కేసు నమోదు చేశారు. కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. అతని కోసం 2 బృందాలు గాలిస్తున్నాయి.