పహల్గామ్లో ఏప్రిల్ 26న 26మంది అమాయక పౌరుల ప్రాణాలు తీసివేసిన ఉగ్రవాద దాడి తర్వాత భారత సైనిక బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించాయి. నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన సైనిక చర్య పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ మిషన్తో సంబంధం ఉన్న కొందరు అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా ఇండియా టుడే పత్రిక తాజాగా ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం భారత వైమానిక దళం విజయవంతంగా ఆరు పాకిస్తానీ ఫైటర్ జెట్స్ను, రెండు ముఖ్యమైన నిఘా విమానాలను, ఒక సి-130 రవాణా విమానాన్ని, 30కి పైగా క్షిపణులను, పెద్దసంఖ్యలో అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ను ధ్వంసం చేసింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఆపరేషనల్ డేటాను సాంకేతిక విశ్లేషణ చేసినప్పుడు తెలిసిన వివరాల ప్రకారం… పాకిస్తానీ వైమానిక స్థావరాల మీద భారత వైమాల్ సైనిక దళం ప్రెసిషన్ స్ట్రైక్స్ (కచ్చితమైన దాడులు) వల్ల పాకిస్తాన్కు చెందిన ఆరు ఫైటర్ జెట్ విమానాలు కుప్పకూలిపోయాయి. వాటిలో ఒకటి అత్యంత సంక్లిష్టమైన ప్లాట్ఫామ్ ఉందట. బహుశః అది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ లేదా ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అయి ఉండాలి. దాన్ని ‘సుదర్శన్’ క్షిపణి వ్యవస్థను ఉపయోగించి 300 కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేసారు.
మరో దాడిలో స్వీడన్ తయారీ ఎయిర్ టు గ్రౌండ్ క్రూయిజ్ మిసైల్తో భోలారీ ఎయిర్బేస్ మీద దాడి చేసారు. ఆ క్షిపణి కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ను కూల్చివేసిందని తెలుస్తోంది. నిఘా వర్గాల అంచనా ప్రకారం… దాడి చేసిన సమయంలో హ్యాంగర్స్ లోపల మరికొన్ని ఫైటర్ జెట్ విమానాలను దాచి ఉండి ఉండవచ్చు. ఏదేమైనా, పాకిస్తాన్ ఆ దాడి జరిగిన స్థలం నుంచి శిథిలాలను ఇంకా తొలగించలేదు కాబట్టి, జరిగిన ధ్వంసం వల్ల కలిగిన నష్టం ఎంత అన్నది స్పష్టంగా తెలియదు.
భారత వైమానిక దళపు రాడార్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లు క్యాప్చర్ చేసిన విజువల్ ఎవిడెన్స్ (వీడియో సాక్ష్యం) ఒక విషయాన్ని ధ్రువీకరించాయి. దాడుల తర్వాత రాడార్ తెరల నుంచి పాకిస్తానీ ఫైటర్ జెట్ విమానాలు మాయమైపోయాయి అని దాని సారాంశం. పాకిస్తానీ పంజాబ్ ప్రాంతంలో భారత వైమానిక దళం చేపట్టిన డ్రోన్ దాడిలో ఆ దేశానికి చెందిన సి-130 రవాణా విమానం కూడా ధ్వంసమైందని సమాచారం.
సమాచారం ప్రకారం… భారత వైమానిక దళం మౌలికంగా పాక్ వైమానిక స్థావరాల మీద దాడులు చేయడానికి క్రూయిజ్ మిసైల్స్ను ఎయిర్లాంచ్ చేసింది, అంతే తప్ప బ్రహ్మోస్ క్షిపణులను గ్రౌండ్లాంచ్ చేయలేదు.
ఒక కీలకమైన, సమన్వయంతో కూడిన దాడిలో భారత్కు చెందిన రఫేల్, ఎస్యూ-30 ఫైటర్ జెట్ విమానాలు ఒక పాకిస్తానీ హ్యాంగర్లో భారీ సంఖ్యలో దాచి ఉంచిన చైనా తయారీ వింగ్ లూంగ్ డ్రోన్లను ధ్వంసం చేసాయని తెలుస్తోంది. భారత్కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు ఘర్షణ సమయంలో పాకిస్తాన్కు చెందిన అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికిల్స్ను కనుగొని, వాటిని ధ్వంసం చేసాయి. దానికి తోడు పాకిస్తాన్ భూతలం నుంచి, గగనతలం నుంచీ ప్రయోగించిన క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు అన్నింటినీ భారత వైమానిక స్థావరాలు విజయవంతంగా గుర్తించి అడ్డగించి ధ్వంసం చేసాయి.
ఆపరేషన్ సిందూర్ అనేది జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో 2025 ఏప్రిల్ 26న ఉగ్రవాదులు చేపట్టిన దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో మొదలైంది. తర్వాత ఆ ఆపరేషన్ను భారత్ మరింత పొడిగించింది. దాంతో పాకిస్తాన్ భారత భూభాగంలో రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలోని నిర్దిష్టమైన పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దానికి స్పందనగా భారతదేశం, వ్యూహాత్మకంగా కీలకమైన పాకిస్తానీ వైమానిక స్థావరాల మీద ప్రతిదాడులకు పాల్పడేంది.
మే 10న ‘‘కాల్పులు, మిలటరీ చర్య నిలిపివేయాలి’’ అంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన అభ్యర్ధన తరువాత ఇరు దేశాల మధ్యా ఘర్షణలు నిలిచిపోయాయి. ఆ మిషన్ సమయంలో సేకరించిన సమాచారాన్ని ఐఏఎఫ్ విశ్లేషించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.