2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ జరిపిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 26మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తయ్యబా అనుబంధ సంస్థ. మతోన్మాదుల బుద్ధిహీన ఉగ్రవాద దుర్మార్గ చర్యతో యావత్ ప్రపంచం ఆవేదన చెందుతూ భారతదేశానికి సహానుభూతి ప్రకటించింది. టిఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించాలంటూ భారతదేశం దౌత్యపరంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ ప్రయత్నాలకు ఒకే ఒక దేశం గండి కొడుతోంది. అదే చైనా. దాన్ని బట్టే చైనా గురించి ఉన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం పట్ల మౌనంగా ఉన్నట్లు ఉంటూనే, చైనా ఉగ్రవాదానికి ఊతమిస్తోందా?
అడ్డుకోవడం, కాపు కాచడంలో ఒక క్రమం:
ఐరాస భద్రతా మండలిలో భారతదేశాన్ని చైనా అడ్డుకోవడం కొత్తేమీ కాదు. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ రూపశిల్పి మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేయడానికి 2009 నుంచి 2019 వరకూ భారతదేశం ఎన్నోసార్లు భద్రతా మండలిలో ప్రయత్నించింది. ఆ అన్ని ప్రయత్నాలనూ చైనాయే అడ్డుకుంది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు 2019 మే నెలలో చైనా ఎట్టకేలకు ఒప్పుకుంది. అన్నాళ్ళూ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాది అని ప్రకటించడానికి అడ్డం పడడానికి చైనా చెప్పిన కారణం… ‘ఆ మేరకు తగిన సాక్ష్యాలు లేవు’ అట. నిజానికి అది చట్టబద్ధమైన తర్కం కానే కాదు. దౌత్యపరంగానూ చైనా తన వలువలు విప్పేసుకుని మరీ ఆ ఉగ్రవాదిని సమర్ధించింది. ఆ చరిత్ర ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతున్న పరిస్థితి కానవస్తోంది. ఈసారి చైనా కాపాడుతున్న ఉగ్రవాద సంస్థ పహల్గామ్ దాడికి బాధ్యురాలైన టిఆర్ఎఫ్. ఆ సంస్థకు నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాతో ఉన్న సంబంధాలకు సాక్ష్యాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఆ సంస్థ ఇటీవల పాల్పడిన సామూహిక దాడుల ఘటనలూ కళ్ళముందు ఉన్నాయి. ఆ సంస్థ మీద అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా వాటిని వేటినీ చైనా పట్టించుకోవడం లేదు.
ఉగ్ర సంస్థలు, వ్యక్తులను చైనా వెనకేసుకుని వచ్చే విషయంలో ఒక క్రమసూత్రత కనిపించడం కేవలం యాదృచ్ఛికం కాదు. చైనా తీసుకున్న ఆ నిర్ణయం వెనుక, దక్షిణాసియా ప్రాంతంలో పాకిస్తాన్ భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఉండడం కాకతాళీయమూ కాదు. చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను సాకారం చేసుకోడానికి, తమ దేశానికి చెందని హింసాత్మక గ్రూపులను ఉపయోగించుకోడానికి చైనా అమితమైన ఆసక్తి చూపుతోందని దాని తాజా చర్యల ద్వారా తెలుస్తోంది.
ఆసియా వ్యాప్తంగా సాయుధ తిరుగుబాట్లు:
చైనా వ్యాప్తి కేవలం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి వరకే పరిమితం కాలేదు. ఈశాన్య భారతదేశంలో సాయుధ తిరుగుబాటుదారుల విద్రోహ చర్యలు భారతదేశ జాతీయ భద్రతకు కొన్ని దశాబ్దాలుగా ముప్పుగా ఉన్నాయి. వాళ్ళు ఉపయోగించే ఆయుధాలన్నీ చైనా నుంచే సమకూరుతున్నాయి అన్నది భారత్కు ఇబ్బంది కలిగిస్తున్న వాస్తవం. నక్సలైట్లు-మావోయిస్టులతో పాటు మణిపూర్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లోని మిలిటెంటు సంస్థలకు ఆయుధాలు సమకూరుస్తున్నది చైనాయేనని భారత నిఘా విభాగాలు ఏనాటినుంచో నెత్తీ నోరూ మొత్తుకుంటూనే ఉన్నాయి. కాలక్రమంలో మయన్మార్ – థాయ్లాండ్ సరిహద్దుల దగ్గర అక్రమ చైనీస్ ఆయుధాలు పట్టుబడడంతో ఆ ప్రాంతంలో హింసాత్మక కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు ఉద్దేశపూర్వకంగా చైనా కుట్రలు పన్నుతోంది అనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఏసియన్ స్టడీస్ (ఇఎఫ్ఎస్ఎఎస్) అధ్యయనం చేసిన నివేదికలను తరచి చూస్తే మయన్మార్ థాయ్లాండ్ సరిహద్దుల దగ్గర పట్టుబడిన ఆయుధాలు మొదట చైనా నుంచి వచ్చాయి, అవి స్థానికంగా చైనాలోనే తయారయ్యాయి. అంతే తప్ప మయన్మార్కు చెందిన గిరిజన తిరుగుబాటుదారుల సంస్థ కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీనో లేక అటువంటి మరే ఇతర సంస్థో తయారు చేసినవి కావు. ఆ ఆయుధాలను కొనుగోలు చేసిన వారి ఉద్దేశం, ఇండో మయన్మార్ కారిడార్ను బలహీన పరచడం ద్వారా భారతదేశపు ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి నష్టం చేకూర్చాలి అన్నదే, అని భావిస్తున్నారు. ఇండో మయన్మార్ కారిడార్ అనేది ఆ ప్రాంతంలోని పలు చిన్నచిన్న దేశాల కనెక్టివిటీ, వాణిజ్య అవసరాల కోసం అతి ముఖ్యమైనది. అలా చైనా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జోక్యం చేసుకోవడం అనేది వ్యూహాత్మకంగా ఘర్షణలను రేపడం, అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడమూనూ. అలాంటి చర్యల వల్ల భారతదేశానికి గడ్డు పరిస్థితే.
మయన్మార్లో దౌత్య ఉగ్రవాదం:
మయన్మార్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసిన అరాకన్ ఆర్మీతో (ఎఎ) చైనాకు ఉన్న సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019 – 2021 మధ్య కాలంలో మయన్మార్ చాలాసార్లు చైనా మీద తీవ్ర ఆరోపణలు చేసింది. అరాకన్ ఆర్మీకి అసాల్ట్ రైఫిల్స్, మెషీన్ గన్స్, ఆఖరుకు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ సరఫరా చేస్తోందంటూ చైనా దేశం మీద వారు ఆరోపణలు చేసారు. అంటే మనం అత్యంత ప్రాథమిక స్థాయి అవసరాలు లేక పరిమితమైన సామర్థ్యం కలిగిన ఆయుధాల గురించి కాదు మాట్లాడుకుంటున్నది, చైనీస్ మిలటరీ దగ్గర ఉన్న అత్యంత అధునాతనమైన మిలటరీ టెక్నాలజీని ఇచ్చింది. ఉదాహరణకు చైనా నిర్మించిన ఎఫ్ఎన్-6 మాన్పాడ్స్ సిస్టం ద్వారా ఎక్కడో గగనతలంలో ఉన్న విమానాలను సైతం కూల్చివేయవచ్చు. ఆ వ్యవస్థ అరాకన్ ఆర్మీ దగ్గర ఉందంటే అది వారికి ఎలా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడానికి కారణమేంటి? అంతర్జాతీయ వ్యవహారాల ప్రముఖ విశ్లేషకుడు ఆండర్స్ కార్ చెప్పిన ప్రకారం ఇది దౌత్య ఉగ్రవాదం. స్థానిక తెగలను రెచ్చగొట్టి వారిని హింసాత్మక మిలిటెంట్లుగా వాడుకోవడం, వారి ద్వారా ఆయా ప్రాంతాల్లో పరపతిని పెంచుకోవడం, అలాగే తమ దేశపు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ ద్వారా పెడుతున్న పెట్టుబడులకు సాయుధ రక్షణ కల్పించుకోవడం అనేవి చైనా ప్రధాన వ్యూహాలు. భారతదేశపు ఈశాన్య భాగం నుంచి మయన్మార్లోని రఖైన్, చిన్ రాష్ట్రాల మీదుగా హిందూ మహా సముద్ర కారిడార్ అంతటా సాయుధ తిరుగుబాటుదారులను మోహరించడం అనేది చైనా కోణం నుంచి చూస్తే గొప్పది… ఆచరణ పరంగా కీలకమైనది… చైనా జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక అవసరాల కోణంలో అత్యంత ప్రధానమైనది… అయిన వ్యూహం అనే చెప్పుకోవాలి. ఆ నడవా (కారిడార్) పొడుగునా సాయుధ తిరుగుబాటుదారులను మోహరించడం ద్వారా మయన్మార్ మిలటరీ నియంతృత్వ పాలకులపై ఆధిపత్యం సంపాదించడం, దానితో పాటు భారత ప్రాదేశిక సంబంధాలకు అవాంతరాలు కల్పించడం అనే ప్రయోజనాలను సాధించగలుగుతుంది.
జింజియాంగ్ వైరుధ్యం:
నిజానికి చాలా కాలంగా చైనా తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటోంది, ప్రత్యేకించి జింజియాంగ్ ప్రాంతంలో దేశీయ ఊగర్ వేర్పాటువాద సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని చైనా చెబుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ (ఇటిఐఎం) పేరు కూడా చెబుతూ ఉంటుంది. జింజియాంగ్లో తాము ఉగ్రవాద బాధిత దేశం అన్నట్లుగా చైనా ప్రపంచానికి కథలు చెబుతోంది, కానీ నిజానికి చైనా ఎంపిక చేసిన కొన్ని విషయాలను మాత్రమే వెల్లడిస్తోంది. తమ దేశంలో అంతర్గత అసంతృప్తులను ఉక్కుపాదంతో అణచివేస్తూ నియంతృత్వ వైఖరిని కనబరుస్తున్న చైనా, ఇతర దేశాలను అస్థిర పరిచే సామర్థ్యం కలిగిన ఉగ్రవాద శక్తులను ప్రచ్ఛన్నంగా మోహరించే విషయంలో అత్యంత ఆత్రత చూపిస్తోంది.
జింజియాంగ్లో చైనా ఉగ్రవాద వ్యతిరేక ప్రచారం పేరిట చేపడుతున్న కార్యకలాపాలను జాతి హననం, సామూహిక నిర్బంధం, బలవంతపు వెట్టిచాకిరీ నుంచి వేరు చేసి చూపలేము. అదే సమయంలో చైనా, దక్షిణాసియా నుంచి ఆఫ్రికా వరకూ విదేశాల్లో అస్థిరతను ప్రోత్సహిస్తోంది. ఇతర దేశాల్లో మిలిటెంట్లు, తిరుగుబాటుదార్లను ప్రోత్సహిస్తూ ఆయా దేశాల్లో అశాంతి కలిగేలా చేయడాన్ని ప్రోత్సహిస్తోంది. దాన్నే దౌత్యపరమైన బుద్ధి కుశలతను పాటించడంగా చెప్పుకుంటోంది.
ఉగ్రవాదం, వాణిజ్యం – ఆఫ్రికా కనెక్షన్:
ఈ ప్రహేళికను మరింత సంక్లిష్టం చేయడానికే అన్నట్లుగా చైనా కొంతకాలంగా ఆఫ్రికాలో తన మిలటరీ, ఆర్థిక ఉనికిని విస్తరిస్తోంది. ఆఫ్రికన్ దేశాలకు చైనా ఆయుధ ఎగుమతులు 2022లో 103 మిలియన్ డాలర్ల నుంచి 2024లో 306 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఆ అమ్మకాలు కాగితాల మీద పూర్తిగా చట్టబద్ధంగా ఉంటాయి. కానీ అవి సాధారణంగా తిరుగుబాటుదారుల చేతుల్లోకి చేరతాయి. అది కూడా, సహజ వనరులు ఎక్కువగా ఉండే డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లాంటి ప్రాంతాల్లోని విద్రోహ శక్తులకే అందుతాయి.
ఈ లెక్క చాలా సూటిగానూ, అదే సమయంలో చాలా భయంకరంగానూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహజ వనరులపై ఆధిపత్యం సంపాదించాలి. దానికోసం తిరుగుబాటుదారులకు వసతులు కల్పించినా పర్వాలేదు. కోబాల్ట్, కోల్టాన్ వంటి అరుదైన సహజ వనరుల మీద ఆధిపత్యం సాధించాలి. దాని కోసం, వ్యవస్థకు వెలుపల ఉండే ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు, విద్రోహుల వంటి ప్రతీప శక్తుల సహాయం తీసుకోడానికి బీజింగ్ ఏమాత్రం సిగ్గు పడడం లేదు. అలాంటి ఎన్నో గ్రూపులతో చైనా పొత్తులు కుదుర్చుకుంది. వాటిద్వారా చైనా అంతర్జాతీయ దౌత్య సంప్రదాయాలను తలకిందులు చేస్తోంది. అదే సమయంలో పైకి మాత్రం న్యాయంగా వ్యవహరిస్తున్నట్లు నటిస్తూ తమకు అలాంటి సంస్థలతో ఎలాంటి సంబంధాలూ లేవని నిరాకరిస్తోంది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ప్రచ్ఛన్న క్రీడ:
‘సౌత్ చైనా సీ’ సాగర జలాల్లో చైనా, రాజ్య వ్యవస్థకు వెలుపల ఉండే శక్తులను సాగర జలాల్లో పరిరక్షకుల వేషంలో మోహరించింది. ఆ మారిటైమ్ మిలిటెంట్లు మారువేషాల్లో తమ ఆట ఆడతారు. సముద్రంలో చేపలు పట్టుకునే సామాన్య జాలరుల వేషంలో ఉంటారు. ఆ ప్రాంతంలో నిజంగా హక్కు ఉన్న వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నౌకలను వేధిస్తూ ఉంటారు. వాళ్ళు చైనా గ్రే-జోన్ వారియర్స్. వాళ్ళు ఆ ప్రాంతం తమదే అని అరుస్తూ ఉంటారు. కానీ వారు అధికారికంగా చైనా సైనిక విభాగం కాదు. కాబట్టి వాళ్ళతో ఇతర దేశీయులు గొడవ పడలేదు. అలాంటి ప్రచ్ఛన్న శక్తులకే భవిష్యత్తులో తీరప్రాంతాల్లో అధికారం కట్టబెట్టే అవకాశమూ లేకపోలేదు. ఆగ్నేయాసియాలో తనకు పోటీ రాగల దేశాలలోని పాలక వ్యవస్థలను అస్థిర పరిచేందుకు చైనా తిరుగుబాటుదారులు, విద్రోహ శక్తులను నిలబెడుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పలువురు హెచ్చరిస్తున్నారు. దౌత్యపరంగా తనకుండే రక్షణ వలయాన్ని యథాతథంగా ఉంచుకుంటూనే తన లక్ష్యాలను పరోక్షంగా నెరవేర్చుకోడానికి చైనా ఎంతకైనా తెగిస్తుందని విశ్లేషిస్తున్నారు.
వ్యూహాత్మక ద్వంద్వ ప్రమాణాలు:
ఉగ్రవాదం విషయంలో చైనా ప్రవర్తిస్తున్న తీరులోని పరస్పర విరుద్ధభరితమైన వైఖరి, ఎవరి కంటా పడకుండా ఉండలేనంత ప్రస్ఫుటంగా నానాటికీ పెరిగిపోతోంది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్న తీరున… ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం జరపాలంటూ భారీ నినాదాలు ఇస్తూ ఉంటుంది, కానీ చైనా ప్రవర్తన మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇరాన్, సిరియా లాంటి విదేశాలకు మిలటరీ అమ్మకాలను కొనసాగిస్తూనే ఉంది. అదే సమయంలో ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిని అధికారికంగా అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించే ప్రయత్నాలను ఐక్యరాజ్య సమితిలో అడ్డుకోడానికి తన వీటో అధికారాన్నినిస్సిగ్గుగా వాడుకుంటుంది. అత్యంత కచ్చితత్వంతో లెక్క కట్టి మరీ ప్రదర్శించే నటన చైనాది.
2001 ఎపిఇసి సదస్సులో ఉగ్రవాద సంబంధాలు ఉన్న దేశాలకు మిలటరీ ఎగుమతులు నిలిపివేయాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పిలుపునిచ్చారు. దానికి అప్పటి చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా చైనా నిశ్శబ్దంగా అలాంటి చర్యలకే పాల్పడుతూ ఉంది. తైవాన్కు అమెరికా ఆయుధాయేల అమ్మకం వంటి బైటి ఒత్తిళ్ళను బట్టి చైనా తన కార్యాచరణను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. అంటే, ఉగ్రవాదంపై చైనా వైఖరి నీతిసూత్రాలను బట్టి స్థిరంగా ఉండేది కాదు, పరిస్థితులను బట్టి మారిపోయేది అని అర్ధమవుతుంది.
ప్రపంచం చైనా లెక్క తేల్చాలి:
చైనా ప్రవర్తన మీద ప్రపంచం చూపుతున్న చనువు, ఐక్యరాజ్య సమితి ప్రక్రియల పట్ల చైనా నిరాదరణ వైఖరి, దాని ఆయుధ దౌత్యం, విదేశాల్లో తిరుగుబాటు ఉద్యమాలకు చైనా వెన్నుదన్నుగా నిలవడం వంటి చర్యలు తక్షణమే ఆగిపోవాలి. పాకిస్తాన్ లేక సౌదీ అరేబియా దేశాల కంటె నాజూకుగా, సుతారంగా ప్రవర్తిస్తూ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోంది చైనా. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ లోలోతులకు తరచి చూస్తే చైనా వైఖరి కపటమైనది, కృత్రిమమైనది. దాని ప్రభావం అత్యంత విధ్వంసకరంగా ఉంటుంది. చైనా విదేశాంగ విధానాన్ని పరిశీలిస్తే అది అనిశ్చితంగా ఉంటుంది, పైనుంచి చూడడానికి న్యాయబద్ధమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిశితంగా నిగూఢంగా చూస్తే మరో అర్ధం గోచరిస్తుంది.
రక్తంతో తడిసిన పహల్గామ్ పచ్చిక బయళ్ళు, మయన్మార్లో తిరుగుబాటుదారులు ఆక్రమించిన అడవులు, ఆఫ్రికాలో అనంతమైన ప్రాకృతిక సహజ వనరుల లూటీ… ఇలా అన్నింటి మీదా చైనా వేలిముద్రలు ఉన్నాయి. ప్రతీ పనిలోనూ చైనా జోక్యాన్ని విస్మరించడం సాధ్యం కాదు. ఇది కేవలం భౌగోళిక రాజకీయం మాత్రమే కాదు, ఇది ప్రపంచ భద్రతకే పెనుముప్పు.
ప్రపంచం ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. అదేంటంటే చైనా కేవలం ఉగ్రవాదానికి సహాయం మాత్రమే చేయదు. వారికి నేరుగా ఆయుధాలను పంపిస్తుంది. ఆ క్రమంలో చైనా ప్రాదేశిక సుస్థిరతకు ప్రమాదంగా కేవలం పోజులు ఇవ్వదు, కానీ అది ‘రక్షించాలి’ అని చెప్పే అంతర్జాతీయ క్రమాన్ని సైతం తొక్కి పడేస్తుంది. తర్వాత తగినంత కాలం మౌనంగా ఉండిపోతుంది. చైనా ఆడుతున్న ఈ ద్వంద్వ వైఖరిని ప్రపంచం ఖండించాలి.