ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సోలార్ రూప్టాప్ పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చి దిద్దాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు లక్ష్యాలు నిర్దేశించుకుని పనులు పరుగులు తీయిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం సూర్య ఘర్ పథకానికి అధనంగా మరికొంత రాష్ట్ర ప్రభుత్వం రాయితీ అందించి, పేద దళిత కుటుంబాలకు నూరు శాతం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీని ద్వారా ఏపీలో 25 లక్షల పేదల కుటుంబాలకు నెలకు రూ.3 వేల ఆదాయం సమకూరనుంది.
సోలార్ రూప్టాప్ విలేజ్
ప్రతి జిల్లాలో ఒక సోలార్ రూప్ టాప్ నమూనా గ్రామాన్ని సోలార్ గ్రామంగా తీర్చి దిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ నాటికి డిస్కంలు, నెడ్క్యాప్ ద్వారా 3 లక్షల సోలార్ రూప్ టాప్ కనెక్షన్లు ఏర్పాటు చేయలన్నారు డిస్కం ల సీఎండీలు,అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
రాష్ర వ్యాప్తంగా ఈ ఏడాది 20 లక్షల రూప్టాప్ సోలార్ కనెక్షన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం పనిచేసోంది. జూన్ నాటికి ఒక్కో డిస్కం పరిధిలో 75 వేల కనెక్షన్లు, నెడ్ క్యాప్ మరో 75 వేల కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా, బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుంది. మొత్తం రూ.80 వేలు రాయితీ లభిస్తుంది.
ఇప్పటికే మూడు డిస్కంలకు 12.12 లకషల దరఖాస్తులు అందాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 5.87 లక్షలు ఉన్నాయి. లక్ష్యం పూర్తి అయితే సోలార్ ద్వారా 1172 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.ఆరు మాసాల్లో లబ్దిదారులకు సోలార్ రూప్ టాప్ అందిస్తారు. ఐదేళ్లపాటు నిర్వహిణ కూడా సంబంధిత కంపెనీ చూస్తుంది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన సోలార్ రూప్టాప్ ప్రాజెక్టు క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 29కి మూలస్తంభంగా నిలవనుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ బిజిలీ పథకానికి మరింత రాయితీలు జోడించి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచచింది.జీరో కాలుష్యంతో విద్యుత్ ఉత్పత్తితోపాటు, పేదల ఆదాయం పెంచడంలో ఈ పథకం సహయపడుతుంది.
2025 నాటికి 20 లక్షల రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం గృహాలకు ఇంధన ఖర్చులను తగ్గించడం, పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగ సృష్టి ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం అనే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితం
ఎస్సీ, ఎస్టీలు 2 కిలోవాట్ రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లకు అర్హులు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.60,000 రాయితీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.55,000 అందిస్తుంది. బీసీలకు 2 కిలోవాట్ వరకు ఇన్స్టాలేషన్లకు రూ. 80,000 రాయితీ అందుతుంది. ఇందులో కేంద్రం నుండి రూ.60,000, రాష్ట్రం నుండి రూ.20,000 కలిపి సబ్సిడీని పొందండి. అదనంగా, లబ్ధిదారులు ఐదు సంవత్సరాలలో తిరిగి చెల్లించదగిన రూ.35,000 బ్యాంకు రుణాన్ని పొందవచ్చు. ఓసీ కుటుంబాల వారు ఈ పథకం కింది సామర్థ్యాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు రాయితీలు పొందవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితం. 2కిలోవాట్ల పథకం కింద ప్రతి నెలా 300 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వం ఒక్కో యూనిట్ విద్యుత్కు రూ.2.90 పైసలు చెల్లిస్తుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది.
డ్వాక్రా గ్రూప మహిళలకు సోలార్ స్కీం ప్రయోజనాలు
ఏపీలో కోటి మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో చేరారు. వీరిలో ముందుగా లక్ష మంది డ్వాక్రా గ్రూపు మహిళల ఇళ్లకు సోలార్ రూప్ టాప్ పథకం ప్రయోజనాలు కల్పించనున్నారు. ఇప్పటికే 80 వేల మంది డ్వాక్రా మహిళలు సోలార్ ప్రయోజనాలు పొందేందుకు ముందుకు వచ్చారు. వీరికి కేంద్ర ప్రభుత్వం కల్పించే రాయితీలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీ కూడా వర్తిస్తుంది. ప్రతి నెలా కనీసం వెయ్యి రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించే వారు ఒక కిలోవాట్ పథకం ద్వారా నెలకు రూ.700 పొదుపు చేయవచ్చు. 2 కిలోవాట్ పథకం తీసుకుంటే…వారి అవసరాలు తీర్చుకున్నాక మిగిలిన విద్యుత్ నగదు వారి ఖాతాలో జమచేస్తారు. ఇలా నెలకు రూ.1000 నుంచి రూ.3వేల వరకు ఆదాయం పొందవచ్చు. డ్వాక్రా గ్రూపు మహిళలు ఈ పథకం కోసం ముందుగా పది శాతం చెల్లించాల్సి ఉంటుంది.ఆ మొత్తం కూడా కట్టలేని పక్షంలో స్త్రీనిధి, బ్యాంకు రుణాల ద్వారా సమకూరుస్తారు. నెల రోజుల్లో కేంద్రం రాయితీ విడుదల చేస్తుంది. ఆ డబ్బుతో కొంత రుణం చెల్లించుకోవచ్చు.
ఆర్థిక ప్రయోజనం
సోలార్ రూప్టాప్ పథకం ద్వారా లబ్దిదారుల గృహాలు తమ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చు, వినియోగాన్ని బట్టి నెలకు కనీసం రూ.1,000 వరకు ఆదా చేసే అవకాశం ఉంది. నెలకు వంద యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి ఒక కిలోవాట్ కెపాసిటీ సోలార్ పథకం సరిపోతుంది. దీని ద్వారా రోజుకు 4 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 200 యూనిట్ల వినయోగం ఉన్నవారు 2కిలోవాట్లు, 300 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న వారు 3 కిలోవాట్ పథకం తీసుకుంటే గరిష్ఠంగా ప్రయోజనం పొందడానికి వీలవుతుంది.
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రధాన మంత్రి సూర్య ఘర్ పేరుతో ప్రతిష్టాత్మకంగ ప్రారంభించింది. పలురాష్ట్రాలు మరికొంత అదనంగా రాయితీలు అందించి పథకాన్ని ముందుకు తీసుకెళుతున్నాయి. ముఖ్యంగా ఈ పథకం అమల్లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇప్పటికే ఐదు లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.
కేంద్ర ప్రభుత్వం కోటి కుటుంబాలను సూర్య ఘర్ పథకం కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు మూడు రకాల రాయితీ పథకాలను అమలు చేస్తోంది. 2 కిలోవాట్ వరకు 60 శాతం రాయితీ లభిస్తుంది. 2 నుంచి 3 కిలో వాట్ వరకు 40 శాతం, 3 కన్నా ఎక్కువ కిలో వాట్ ప్యానెళ్లు పెట్టుునే వారికి గరిష్ఠంగా 78 వేలురాయితీ లభిస్తుంది.
రాయితీలు నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు.
ఈ పథకానికి ఎవరు అర్హులు
ఈ పథకంలో ఎవరైనా లబ్దిదారుగా చేరవచ్చు. ఈ పథకం కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. భారత పౌరులై ఉండాలి. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్కు స్లాబుతో కూడిక 500 చదరపు అడుగుక పైకప్పు ఉండాలి. విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండాలి.ప్రభుత్వం నుండి గతంలో ఏ సోలార్ ప్యానెల్ సబ్సిడీలను పొందని వారు అర్హులు. ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, బ్యాంక్ ఖాతా సమాచారంతో అందించాల్సి ఉంది. సోలార్ ప్యానెళ్లు బిగించిన తరవాత పథకం రాయితీ మొత్తం 30 రోజుల్లోపు దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు.
అనేక ప్రయోజనాలు
సోలార్ విద్యుత్ జీరో కాలుష్యం. ఇంధన వినియోగంలో సహజంగా వచ్చే కాలుష్యం సోలార్లో ఉండదు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ లాంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. స్థిరమైన, స్వచ్ఛమైన ఇంధన వనరులను ప్రోత్సహించడానికి సోలార్ విద్యుద్ దోహద పడుతుంది.
నెట్ మీటరింగ్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఏటా ఒక్కో గృహ వినియోగదారుడికి రూ.75 వేల వరకు పొదుపు అవుతుంది.
ఈ పథకం అమల్లో పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. గుజరాత్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటికే 5 లక్షల రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లతో అగ్రగామిగా ఉంది, 1,232 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేస్తోంది. మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. 3 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం దక్కింది. తరవాత స్థానాల్లో కేరళ,రాజస్థాన్ రాష్ట్రాు నిలిచాయి. కేరళలో లక్ష మంది, రాజస్థాన్ రాష్ట్రంల 63 వేల మంది ప్రయోజనం పొందారు. 2026 డిసెంబరు నాటికి దేశ వ్యాప్తంగా కనీసం కోటి ఇళ్లలో పీఎం సూర్య ఘర్ బిజిలీ ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
రాష్ట్రానికి ఇంధనం..పేదలకు ఆదాయం
25 లక్షల ఇళ్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఏపీలో 1100 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇళ్లపై ఉండే ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకోవడంతోపాటు, గృహ యజమానికి కొంత ప్రయోజనం దక్కుతుంది. మరోవైపు రాష్ట్ర ఇంధన అవసరాలు కూడా తీరుతాయి. 1100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కనీసం 5500 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. అందుకు కనీసం రూ.550 కోట్లు ఖర్చవుతుంది. ఈ మొత్తం ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఇటు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరడంతోపాటు, కేంద్ర అందించే రాయితీల ద్వారా రాష్ట్రానికి రూ.1250 కోట్లు అందుతాయి. ఇలా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రజలకు మేలు చేస్తూనే రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం అవుతుంది