మాతృభాష అంటే మమకారం ఉండడం మంచిదే. అది ఇతర దేశీయ భాషలకు వ్యతిరేకం కాకూడదు. అదే సమయంలో మన దేశీయ అస్తిత్వాన్ని, మన సంస్కృతీ సంప్రదాయాలను సర్వనాశనం చేయడానికి ఉపకరణాలుగా మారిన భాషల మీద ప్రేమ ఉండాల్సిన అవసరమూ లేదు. కానీ మన దేశంలో దానికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది.
ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు కచ్చితంగా తెలుగు వాళ్ళే అయి ఉంటారని ఒక చమత్కారం. నిజానికి అది బాధ పడవలసిన విషయం. తెల్లదొరలు, అంతకుముందు ముస్లిం రాజుల పాలనలో బానిసత్వానికి అలవాటు పడిపోయి ఇంగ్లీషు, ఉర్దూ భాషలను నెత్తికెక్కించుకున్నాం. మన తెలుగు భాషను మాత్రం వదిలేసాం. ఒకరకంగా చూస్తే దేశంలో మాతృభాష మీద అభిమానం లేని ఏకైక జాతి తెలుగు జాతి ఒక్కటేనేమో. మరే ఇతర ప్రధాన భారతీయ భాషా సమూహమూ తెలుగు వారి స్థాయిలో తమ భాషను నిర్లక్ష్యం చేయడం లేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ మధ్య భాషా అస్తిత్వ వాదాలు పెరుగుతున్నాయి. తమిళులకు తమ భాష మీద అభిమానం, దురభిమానం స్థాయిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా కన్నడిగులు కూడా అదే విధంగా తయారవుతున్నారు.
కర్ణాటకలో హిందీ వ్యతిరేకత:
ఇతర భాషల కంటె మాతృభాష మీద ఒకింత ఎక్కువ అభిమానం ఉండడాన్ని సమర్ధించకపోయినా, అర్ధం చేసుకోవచ్చు. కన్నడ భాష కంటె హిందీ భాషకు ప్రాధాన్యం పెరిగిపోతోందంటూ ఆ రాష్ట్రంలో ఇటీవల కొన్నేళ్ళుగా ఆందోళనలకు వ్యక్తమవుతున్నాయి. తమిళం తప్ప మరే ఇతర భాషనూ ఒప్పుకోని తమిళుల అంత దారుణం కాకపోయినా, హిందీ మాట్లాడితే చిరాకు పడే స్థాయికి కన్నడిగులూ వచ్చేసారు.
అంతటి విపరీత మాతృభాషా దురభిమానులు సైతం ఉర్దూ అంటే కిక్కురుమనడం లేదు. అక్కడ ప్రాంతీయ ప్రాదేశిక భావాలు వెల్లివిరియవు. ఎందుకంటే అది ఒక ప్రాంతానికి సంబంధించిన భాషగా కాక, ఒక మతానికి చెందిన భాషగా ఉనికి చాటుకుంటుండడమే. ముస్లిములు మాట్లాడే ఉర్దూ గురించి చిన్న వ్యాఖ్య చేయాలన్నా భయమే. సగటు హిందువును తమ ప్రాంతీయ భాషలో మాట్లాడాలని ఒత్తిడి చేసేవాళ్ళు సైతం, ముస్లిములను అలా అడగలేరు, పైపెచ్చు వచ్చీరాని ఉర్దూలాంటి హిందీలో మాట్లాడి వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. అలాంటి సంఘటనలు కర్ణాటకలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి.
ఇతర భాషలపై అసహనంగా కన్నడిగుల మాతృభాష ప్రేమ:
ఇటీవల కర్ణాటకలో ఇతర ప్రాంతాల భారతీయుల భాషల మీద అసహనం పెరిగిపోతోంది. కన్నడ నేర్చుకోని వారు తమ రాష్ట్రంలో ఉండవద్దంటూ గొడవలు చేస్తున్నారు. ప్రత్యేకించి, ఉద్యోగార్థమై ఉత్తరాది నుంచి బెంగళూరుకు తరలి వెళ్ళిన వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆ సమస్య లేనిది ఇద్దరికే.. ఒకటి విదేశీయులు, రెండు ముస్లిములు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా వారితో ఇంగ్లిష్లో మాట్లాడడానికి వెనుకాడరు. ముస్లిములతో ఉర్దూ లేదా హిందీలో మాట్లాడతారు. వారిని మాత్రం కన్నడిగులు ఏమాత్రం ముట్టుకోవడం లేదు. ఉర్దూలో కాదు, కన్నడలోనే మాట్లాడాలి అని ఘర్షణలకు దిగడం లేదు. ఒకవేళ అడిగినా, తమలపాకుతో సుతారంగా కొట్టినట్టే తప్ప దానికి ప్రతిస్పందన లేకపోయినా కిక్కురుమనడం లేదు. దాన్ని బట్టే ఒక విషయం అర్ధమవుతుంది. ఏ భాషకు చెందిన వారయినా హిందువులో లేక ముస్లిమేతరులో అయితే మాత్రమే కన్నడ భాషా పరిరక్షణ గుర్తొస్తుంది. ఆ సాకుతో ఎంత పెద్ద గొడవలకైనా దిగుతారు. ముస్లిములను మాత్రం ముట్టుకోడానికి భయం.
భాష పేరిట జరిగే రాజకీయాలకు మతం కోణమూ ఉంటుండడం గమనార్హం. తమ ప్రాంతంలో తమ మీద ఆధిపత్యం చూపిస్తున్న ఇతర భాషీయులపై అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ వారు మాట్లాడేది ఉర్దూ అయితే మాత్రం ఇవతలి వారి నోళ్ళు మూసుకుపోయాయి. అలాంటి సంఘటనలు కర్ణాటకలో కోకొల్లలు. వాటిని ఉదాహరణలతో సహా పరిశీలిద్దాం….
(1) ముస్లిం వ్యక్తితో మంత్రి ఉర్దూలో సంభాషణ:
2025 మే 22న కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడిన వీడియో ఒకటి విస్తృతంగా వైరల్ అయింది. అందులో ఆయన ఒక ముస్లిం వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఆయన కన్నడ భాషలో మాట్లాడలేదు. ఉర్దూ హిందీ భాషల్లో మాత్రమే సంభాషించారు. దాన్ని బట్టి మాతృభాష పట్ల కన్నడిగుల అభిమానం ముస్లిముల సమక్షంలో వర్తించదు అని స్పష్టమైంది.
కర్ణాటకలో ప్రస్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిముల బుజ్జగింపు ధోరణిని, హిందువుల పట్ల అణచివేత వైఖరినీ అనుసరిస్తోంది. దానికి భాష కూడా అతీతం కాదు అని సై సంఘటనతో మరోసారి నిరూపణ అయింది.
(2) కర్ణాటక బడ్జెట్ 2025 – ముస్లిం, ఉర్దూ ప్రత్యేకం:
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2025 మార్చి 7న రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ముస్లిములకు ప్రత్యేకంగా ఎన్నో సదుపాయాలు ప్రకటించారు. రాష్ట్రంలో మదరసాల ఏర్పాటు, కబరిస్తాన్ల నిర్మాణం, మక్కా యాత్రికుల కోసం ప్రత్యేకంగా హజ్ భవన్, మౌల్వీలకు వేతనాలు వంటి ప్రకటనలు చేసారు. అంతే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించిన టెండర్లలో 4 శాతం ముస్లిములకు రిజర్వేషన్ కేటాయిస్తామని కూడా ప్రకటించారు. దానితో పాటు ఉర్దూ మీడియంలో నడిచే పాఠశాలలకు సహాయం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్’ ద్వారా మదరసాల్లో నియత విద్య, ఎస్ ఎస్ సి పరీక్షలకు శిక్షణ ఇవ్వడం వంటి ఏర్పాట్లు కూడా చేస్తామని ప్రకటించారు. అందుకే ఆ బడ్జెట్ను కర్ణాటక బీజేపీ నేతలు ‘ముస్లిం లీగ్ బడ్జెట్’ అంటూ విమర్శలు గుప్పించారు.
(3) అంగన్వాడీల్లో ఉద్యోగ అర్హతకు ఉర్దూ తప్పనిసరి:
2024 మే 20న కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని రెండు జిల్లాలకు సంబంధించి ఒక ప్రకటన వెలువరించింది. మడికెరి, చిక్కమగళూరు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ భాష తెలిసి ఉండడం తప్పనిసరి అని నియమం విధించింది. కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వుల్లో ముస్లిం జనాభా 25శాతం కంటె ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉర్దూ తెలిసిన టీచర్లనే నియమిస్తామని స్పష్టం చేసారు. ఆ జిల్లాల అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ విభిన్న సామాజిక వర్గాల ప్రజలు నివసిస్తున్నారు, వారిలో ముస్లిములు 31.94శాతం మంది ఉన్నారు. అంటే పావు వంతు జనాభా ముస్లిములే కాబట్టి అక్కడ వారికి అర్ధమయ్యే భాషలు తెలిసిన అంగన్వాడీ టీచర్లు అవసరమని అధికారులు తమ ప్రకటనలో వెల్లడించారు.
ఈ వ్యవహారంపై కర్ణాటక బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిములను బుజ్జగించేందుకే అలాంటి నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా కన్నడ భాష మాట్లాడేవారి హక్కులను విస్మరించారని దుయ్యబట్టారు. బీజేపీ మాజీ ఎంపీ నళిన్ కుమార్ కాటీల్ దాని గురించి మాట్లాడుతూ ‘‘అంగన్వాడీ ఉపాధ్యాయుల ఉద్యోగాలు పొందాలంటే ఉర్దూ భాష తప్పనిసరి చేయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లిముల సంతుష్టీకరణ ప్రయత్నాల్లో ఇది ఒక ఎత్తుగడ. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మిగతా అభ్యర్ధుల అర్హతలు పరిమితం అయిపోతున్నాయి. ఇది ప్రమాదకరమైన రాజకీయ క్రీడ’’ అని విమర్శించారు.
(4) పోలీసులు ఉర్దూ నేర్చుకోవాలన్న సిఎం సిద్దరామయ్య:
2013 డిసెంబర్ 31న బెంగళూరు పోలీసు విభాగం 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ప్రసంగం చేసిన సిద్దరామయ్య, పోలీసు విభాగంలో పనిచేసే వారు ఉర్దూ భాష నేర్చుకోవాలని సలహా ఇచ్చారు.
పోలీసులు ముస్లిములతో ఉర్దూ భాషలో మాట్లాడాలి. వారు ప్రజలతో ఎక్కువ వినమ్రతతోనూ, సహనంతోనూ సంభాషణ జరపాలి. దాని వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, పోలీసులను సమర్ధించే ధోరణి అలవడుతుంది అని సిద్దరామయ్య ఆ సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు అందరూ ఒకే భాష మాట్లాడరు. కాబట్టి అందరితోనూ ఒకే భాషలో మాట్లాడడం కుదరదు. అందుకే వేర్వేరు భాషల జ్ఞానం కలిగి ఉండడం చాలా అవసరం అంటూ పోలీసు విభాగానికి సలహా ఇచ్చారు.
(5) ప్రభుత్వ కార్యాలయం మీద ఉర్దూలో సైన్బోర్డు :–
ఉత్తర కన్నడ జిల్లా భట్కల్ ప్రాంతంలో 2022 జూన్ 29న మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం బైట గోడ మీద సైన్ బోర్డు (సూచిక) ఏర్పాటు చేసారు. దాని మీద కన్నడ, ఆంగ్ల భాషలతో పాటు ఉర్దూలో కార్యాలయం పేరు రాసారు. భట్కల్ ప్రాంతంలో ముస్లిముల జనాభా ఎక్కువ. వారు ముస్లిమేతరుల మీద ఆధిపత్యం చెలాయించడం కూడా ఎక్కువే. వారిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ విభాగం సైతం ప్రవర్తించింది.
నిజానికి అంతకుముందు కూడా ఒకసారి ఉర్దూలో సైన్ బోర్డు ఏర్పాటు చేసారు, అయితే అప్పుడు ఆ నిర్ణయం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఆ బోర్డును తీసేసారు. అయితే ఎవరు ప్రభావితం చేసారో కానీ మరోసారి మళ్ళీ ఉర్దూలో సూచికను ఏర్పాటు చేసారు.
భట్కల్ను మతపరంగా ఉద్రిక్త ప్రదేశంగా పరిగణిస్తారు. ఆ ప్రాంతంలో భద్రతా ఏజెన్సీల నిఘా సైతం ఎక్కువే. 2022లో ఉర్దూ బోర్డు మీద వ్యతిరేకత వచ్చినప్పటికీ దాన్ని తొలగించలేదు. అయితే భద్రతా ఏర్పాట్లను మాత్రం పటిష్ఠం చేసారు.
(6) ఉర్దూ వార్తల ప్రసారంపై వివాదం:
1994 సంవత్సరంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం. ఆ యేడాది అక్టోబరు నెలలో బెంగళూరు దూరదర్శన్ కేంద్రం నుంచి ఉర్దూ భాషలో వార్తల బులెటిన్ ప్రసారం చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీద కొన్ని కన్నడ భాషా సమర్థక సంఘాలు, స్థానిక ప్రజా సంఘాలూ అసంతృప్తి వ్యక్తం చేసాయి. ఉర్దూలో వార్తలు ప్రసారం చేయడం అనేది కన్నడ భాష మీద దాడి చేయడంగా వారు పరిగణించారు. అప్పటికే రాష్ట్రంలో ఉర్దూ హిందీ ప్రభావం పెరిగిపోతోందనీ, ఉర్దూ వార్తా సంచిక వల్ల కన్నడ భాషకు మరింత దెబ్బ తగులుతుందనీ ఆందోళన చెందారు.
ఉర్దూ వార్తలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు క్రమంగా హింసాత్మక రూపం దాల్చాయి. ఆ గొడవలు మత ఘర్షణలుగా మారిపోయాయి. ఆనాటి ఘర్షణల్లో పలువురు చనిపోయారు. బెంగళూరు నగరంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా నాశనమైపోయింది. ఆ మొత్తం వ్యవహారం కర్ణాటకలోని సామాజిక సాంస్కృతిక సంక్లిష్టతలను, భాష కోసం చెలరేగిన ఘర్షణలనూ చాటి చెప్పింది.
(7) కన్నడ వదిలి ఉర్దూలో మాట్లాడిన మంత్రి:
ఈ యేడాది మే 22న కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఒక వ్యక్తితో కన్నడలో మాట్లాడుతూ ఉన్నాడు. అంతలో ఆ వ్యక్తి తన పేరు సలీమ్ అని చెప్పాడు. ఆ వెంటనే మంత్రి సంతోష్ లాడ్ కన్నడ వదిలేసి ఉర్దూ/హిందీలోకి భాష మార్చుకుని మాటలు కొనసాగించాడు.
ఆ సంఘటన మీద ప్రజలు సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా స్పందించారు. కొద్దిమంది, ఆ మంత్రిగారి బహు భాషా ప్రావీణ్యాన్ని, భాషా వైవిధ్యం కలిగిన సమాజంలో అందరినీ కలుపుకుని పోయే మంత్రిగారి తత్వాన్నీ మెచ్చుకున్నారు. చాలామంది మాత్రం సదరు మంత్రిగారు ముస్లిములను బుజ్జగించే రాజకీయాలు చేస్తున్నారని, ముస్లిములను సంతుష్టిపరిచే విధానాలను అవలంబిస్తున్నారనీ మండిపడ్డారు. అయితే మంత్రి సంతోష్ లాడ్ ఈ విషయమై ఎలాంటి అధికారిక వివరణా లేక ప్రకటనా చేయలేదు.
(8) హిందీ వ్యతిరేక వివాదాల వేళ ఉర్దూలో మాట్లాడిన సీఎం:
అదే రోజు, అంటే 2025 మే 22న మరో వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య. అందులో ఆయన ఒక ముస్లిం యువకుడితో ఉర్దూలో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున వివాదాలు జరుగుతున్న సమయం అది.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య చాలా అనాయాసంగా, సహజంగా, అనర్గళంగా ఉర్దూలో మాట్లాడుతుండడం మీద ప్రశ్నలు తలెత్తాయి. అదేమైనా సాధారణ సాంస్కృతిక సమావేశమా లేక రాజకీయ బుజ్జగింపు చర్యా అని నెటిజన్లు మండిపడ్డారు. కొంతమంది, మైనారిటీలతో మాట్లాడేందుకు సీఎం చేసిన ప్రయత్నంగా వ్యాఖ్యానించారు. అయితే చాలామంది నెటిజన్లు మాత్రం సిద్దరామయ్య కుహనా లౌకికవాదాన్ని ప్రదర్శించారని దుయ్యబట్టారు.
(9) వ్యతిరేక వివాదాల సమయంలోనూ హిందీ/ఉర్దూలో ఖర్గే ప్రసంగం:
అంతకు ముందురోజు, అంటే 2025 మే 21న ఇంకొక వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఆ సభలో ఆయన కన్నడంలో కాకుండా హిందీ ఉర్దూ కలగలిపిన భాషలో మాట్లాడడం గమనార్హం. ఒకపక్క కర్ణాటక అంతటా హిందీ వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలూ జరుగుతుంటే, అదే సమయంలో ప్రియాంక్ ఖర్గే హిందీ ఉర్దూ భాషల్లో ప్రసంగం వెలువరించడాన్ని మాత్రం ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఆ సంఘటన కర్ణాటకలోని రాజకీయ, సాంస్కృతిక సంక్లిష్టతలకు నిదర్శనంగా నిలుస్తోంది. కన్నడ భాషా పరిరక్షణ పేరిట హిందీని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు ఒకపక్కన జరుగుతుంటే రాజకీయ నాయకులు మాత్రం కొన్ని వర్గాలను సంతుష్టి పరచడానికి హిందీ ఉర్దూలను ఉపయోగించడం విశేషం. ప్రజలను కలుపుకుని పోతున్నాం అని వారు చెప్పుకుంటున్నారు. అయితే నిజానికి హిందీ వ్యతిరేకత మాటున ఉన్నది హిందూ సంస్థలు, బీజేపీ వంటి రాజకీయ పార్టీల భావజాలాన్ని వ్యతిరేకించాలన్న కుట్ర. అదే సమయంలో, రాష్ట్రంలోని ముస్లిం జనాభాను కాచుకోడానికి, అంతకంటె ఎక్కువగా, దేశంలో ఇతర భాషలను వాడకుండా చేయడానికీ అనే దురుద్దేశంతో ఉర్దూ లేదా హిందీ భాషలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుండడం గమనార్హం.
(10) వక్ఫ్ వ్యతిరేక ప్రదర్శనల్లోనూ కనబడని కన్నడ భాష:
ఈ యేడాది ఏప్రిల్ 31న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో ముస్లిములు, వారికి అనుకూలంగా వ్యవహరించే కొన్ని సంస్థలూ ఒక ప్రదర్శన చేపట్టాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం అన్నది ఒక్కటే ఆ ప్రదర్శన అజెండా. ఆ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లు, లేదా బిల్బోర్డులూ ప్రధానంగా ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉన్నాయి. వాటిలో పొరపాటున కూడా స్థానిక భాష కన్నడం వినియోగమే ఎక్కడా లేదు.
ఆ ప్రదర్శన గురించి స్థానికులైన కన్నడ భాషీయులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కర్ణాటక సాంస్కృతిక అస్మితకు అవమానం జరిగిందంటూ వారు వివాదాన్ని రేకెత్తించారు.
ఇలా… కర్ణాటకలోని కాంగ్రెస్ రాజకీయ నాయకులు తమ మాతృభాష కన్నడాన్ని విస్మరించి ఉర్దూ లేక హిందీలో తరచుగా మాట్లాడుతున్నారు. అలాంటి చర్యలు, కన్నడిగులను తీవ్రంగా కుదిపేస్తున్న భాషా వివాదం సమయంలో అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. ఒక పక్క కన్నడం తప్ప ఏ భాష మాట్లాడినా కుదరదంటూ ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు, ఆందోళనలూ చేస్తూంటారు. అదే సమయంలో ఉర్దూ తప్ప ఏ భాషా రానివారు మాత్రం ఆ ప్రభావమే తమమీద లేనట్లు బాగా చెలామణీ అవుతున్నారు. దాన్ని ఇతరుల మీద రుద్దుతున్నారు.