మొదటి భాగం ఇక్కడ చదవండి
రెండవ భాగం ఇక్కడ చదవండి
ఆ తరువాయి….
::: సందర్భం 2: భారత సైనిక రహస్యాలపై రాజీ పడిన 1991 ఒప్పందం :::
1991 ఏప్రిల్ 6న ఆనాటి భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సైనిక విన్యాసాలు, సైనిక దళాల కదలికల గురించి ముందుగా ఆ దేశానికి తెలియజేస్తామన్నది దాని సారాంశం. శత్రుదేశంతో సైనిక సమాచారం పంచుకుంటామనే ఒప్పందం ప్రపంచంలో బహుశః ఏ దేశమూ కుదుర్చుకుని ఉండదేమో. ఆ ఘనతను మన దేశానికి కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే.
సైనిక ఒప్పందంలో ఏముంది? :–
భారత్ పాకిస్తాన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఆ రెండు దేశాలూ తమ సైనిక దళాల విన్యాసాలు, తమ సైన్యం కదలికల గురించి రెండో దేశానికి సమాచారం అందించాలి. వారికి తెలియకుండా ఏ పనీ చేయకూడదు.
ఆ ఒప్పందం ఈ విధంగా ఉంది.
‘‘భారతదేశం, పాకిస్తాన్ ఒకరి ఉద్దేశాలను ఒకరు తప్పుగా అర్ధం చేసుకుంటే తలెత్తే సమస్యాత్మక పరిస్థితిని నివారించడానికి సైనిక విన్యాసాలు, సైనిక బలగాల కదలికల గురించి ముందస్తుగా నోటీసులు ఇచ్చుకోవడం గురించి ప్రభుత్వ స్థాయిలో ఉమ్మడిగా ఒప్పందం కుదుర్చుకోవలసిన అవసరాన్ని గుర్తించాయి.
అందువల్ల, భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి:
1. ఇరు దేశాల పదాతి, నౌకా వైమానిక దళాలు దగ్గర దగ్గరగా ప్రధాన సైనిక విన్యాసాలను నిర్వహించవు. ఒకవేళ ఈ ఒప్పందంలో సూచించిన దూరం లోపలే అటువంటి విన్యాసాలు జరిగితే, ఆ విన్యాసాలు చేసే ప్రధాన దళపు వ్యూహాత్మక దిశ, రెండవ పక్షం వైపు ఉండదు. దానికి దగ్గరగా ఎటువంటి సైనిక రవాణా ఉండదు.
ఈ ఒప్పందం కోసం కీలకమైన సైనిక విన్యాసాలుగా ఈ క్రింది వాటిని పరిగణనలోకి తీసుకుంటారు:
(ఎ) పదాతి దళం:
(1) భారతదేశం-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర: కార్ప్స్ (రెండు లేక అంతకంటే ఎక్కువ డివిజన్లు) స్థాయి, లేదా అంతకంటె ఎక్కువ బలగాలను మోహరించడం
(2) నియంత్రణ రేఖ, దానితో పాటు మనవర్ తావి, రావి నదుల మధ్య ప్రాంతంలో: డివిజన్ స్థాయి, లేదా అంతకంటే ఎక్కువ బలగాలను మోహరించడం
(బి) నావికా దళం:
డిస్ట్రాయర్/ఫ్రిగేట్ పరిమాణం లేదా అంతకంటే పెద్దవైన ఆరు లేక అంతకంటే ఎక్కువ నౌకలు కలిసి విన్యాసాలు చేయడం, ఇతరుల ప్రత్యేక ఆర్థిక మండలం (EEZ)లోకి ప్రవేశించే విన్యాసాలు చేయడం.
(సి) వైమానిక దళం:
ప్రాంతీయ కమాండ్ స్థాయి మరియు అంతకంటే ఎక్కువ.
2. పైన పదాతి దళానికి గుర్తించిన ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో డివిజనల్ స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ దూరంలో రెండు వైపులా పదాతి దళాలు సైనిక విన్యాసాలు నిర్వహించకూడదు.
3. పదాతి దళాల విన్యాసాలకు సంబంధించి ఇరు పక్షాలూ ఈ క్రింద పేర్కొన్న వివరాల గురించి నోటీసులు అందజేయాలి :
(ఎ) నియంత్రణ రేఖ వెంబడి.. అలాగే తావి-రావి నదుల మధ్య ప్రాంతంలో సైన్యాల విన్యాసాలు లేక మోహరింపు వివరాలు
(బి) అంతర్జాతీయ సరిహద్దు, లేక నియంత్రణ రేఖ లేక తావి-రావి నదుల మధ్య ప్రాంతంలో 75 కిలోమీటర్ల దూరంలో కార్ప్స్ స్థాయిలో జరిగే విన్యాసాలు లేక మోహరింపు వివరాలు
(సి) దూరంతో సంబంధం లేకుండా కార్ప్స్ స్థాయి కంటే ఎక్కువ ఉన్న అన్ని విన్యాసాలూ, మోహరింపుల వివరాలు
4. సైనిక బలగాల కాలానుగుణ నిర్వహణ కోసం భద్రతా బలగాలను వాటి కార్యాచరణ స్థానాలకు తరలించేటప్పుడు బలగాలను మోహరించే క్రమంలో ఇరు పక్షాలూ 15 రోజులు ముందుగా నోటీసులు ఇవ్వాలి.
5. సైనిక దళాలు నిర్వహించే ప్రధాన విన్యాసాల షెడ్యూల్ను ముందస్తుగానే దౌత్య మార్గాల ద్వారా రాతపూర్వకంగా రెండవ పక్షానికి తెలియజేయాలి:
(ఎ) ప్రాంతీయ కమాండ్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి వైమానిక విన్యాసాలు అయితే 15 రోజుల కంటె ముందు తెలియజేయాలి
(బి) డివిజనల్ స్థాయి విన్యాసాలు, ఆరు కంటె ఎక్కువ డిస్ట్రాయర్/ఫ్రిగేట్ లేదా వాటికంటే ఎక్కువ స్థాయి ఉన్న ఆరు లేదా అంతకంటే ఎక్కువ నౌకలు పాల్గొనే ప్రధాన నౌకా విన్యాసాలు, కంపెనీలో విన్యాసాలు చేయడం, మరొక పక్షపు ఈఈజెడ్లోకి ప్రవేశించాలంటే 30 రోజులు, అంటే కనీసం నెల ముందు తెలియజేయాలి
(సి) కార్ప్స్ స్థాయి విన్యాసాలకు 60 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి
(డి) సైనిక స్థాయి విన్యాసాలకు తొంభై రోజుల కంటె ముందే నోటీసులు జారీ చేయాలి
ఆ నిబంధనల్లో ప్రతిపాదించిన విన్యాసాల కోసం వాటి శాశ్వత స్థానాల నుండి నిర్మాణాలు, యూనిట్ల కదలికల ప్రారంభానికి ఆ గడువులు వర్తిస్తాయి.
6. ప్రధాన విన్యాసాల్లో ఏయే అంశాల గురించి సమాచారం పంచుకుంటారంటే…
(ఎ) విన్యాసం రకం, స్థాయి తెలియజేస్తారు.
(బి) విన్యాసాలు చేసే ప్రదేశం వివరాలు చెబుతారు. గగన, నౌకా విన్యాసాల విసయంలో ఆ ప్రదేశపు అక్షాంశ, రేఖాంశాల సమాచారం ఇస్తారు.
(సి) విన్యాసాలు ఎంతసేపు నిర్వహిస్తారన్న వ్యవధి వివరాలు చెబుతారు.
(డి) ఎలాంటి ఫార్మేషన్స్ చేస్తారు, వాటి సంఖ్య వివరాలు వెల్లడిస్తారు.
(ఇ) ఇతర కమాండ్లు, కార్ప్స్ లేక వ్యూహాత్మక నిర్మాణాల నుంచి బలగాలను బదలాయిస్తే ఆ వివరాలూ చెబుతారు.
(ఎఫ్) వ్యూహాత్మక నిర్మాణాల ప్రణాళికలు, ముఖ్యంగా సాయుధ విభాగాలు, మెకనైజ్డ్ విభాగాలు, ఎయిర్ ఎసాల్ట్ డివిజన్లు, రిజర్వ్ ఇన్ఫాంట్రీ ఫార్మేషన్స్, ఆర్టిలరీ డివిజన్లు, ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ డివిజన్ల వివరాలను వెల్లడిస్తారు
గగనతల, నౌకా విన్యాసాలకు సంబంధించినంత వరకూ ఎ, బి,సి పాయింట్లలోని సమాచారాన్ని మాత్రమే తెలియజేయాలి.
7. ముందు నోటిఫై చేసిన దానికి బదులు విన్యాసాలు చేపట్టే ప్రదేశం లేక వాటిలో పాల్గొనే ఫార్మేషన్స్ గ్రూపింగ్లో మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే, విన్యాసాలు నిర్వహిస్తున్న దేశం ఆ మార్పుల వివరాలను తెలియజేస్తుంది. కార్ప్స్, అంతకంటె ఎక్కువ స్థాయి విన్యాసాలకు సంబంధించి కనీసం 30 రోజుల ముందుగా చెప్పాలి. డివిజనల్ స్థాయి విన్యాసాలు, నౌకా విన్యాసాల విషయంలో అయితే 15 రోజులు ముందు చెప్పాలి. గగనతల విన్యాసాల వివరాల్లో మార్పుల గురించి అయితే 7 రోజులు ముందుగా నోటీసులు ఇవ్వాలి.
8. దేశ అంతర్గత భద్రత లేక పౌర అవసరాల కోసం అంతర్జాతీయ సరిహద్దు, లేదా నియంత్రణ రేఖ నుంచి 150 కిలోమీటర్ల లోపల, కనీసం ఒక డివిజన్ లేదా అంతకంటె ఎక్కువ సంఖ్యలో అదనపు బలగాలను మోహరిస్తే, ఆ అదనపు బలగాలు విధుల్లోకి చేరడానికి కనీసం రెండు రోజుల ముందు రెండో దేశానికి సమాచారం ఇవ్వాలి. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని బలగాలను మోహరిస్తే ఆ విషయాన్ని హాట్లౌన్ ద్వారా రెండో దేశపు సైన్యం ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలి. అలాంటి అదనపు బలగాలు తమ కేంద్ర స్థానాలను ముందుకు జరపకూడదు, తమ ఆయుధాలను వాడకూడదు.
9. ఒక దేశం సైనిక విన్యాసాలను చేపడుతుంటే వాటి వివరాలను అడిగే హక్కు రెండో దేశానికి ఉంటుంది. బలగాల కూర్పుతో పాటు విన్యాసాల పరిధి, దిశ, కాల పరిమితి గురించి కూడా చెప్పాలి.
10. అంతర్జాతీయ సాగర జలాల్లో ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా ఉండడానికి, రెండు దేశాల నౌకాదళాల నౌకలు, జలాంతర్గాములు ఒకదానికొకటి కనీసం మూడు నాటికల్ మైల్స్ దూరంలో ఉండాలి.
11. ఒక దేశపు యుద్ధ విమానాలు, బాంబర్లు, నిఘా విమానాలు, జెట్ మిలటరీ శిక్షణ విమానాలు, సాయుధ హెలికాప్టర్ విమానాలూ… ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లు (ఎడిఐజెడ్) సహా రెండో దేశపు గగనతలానికి పది కిలోమీటర్ల దూరం వరకూ ఎగరకూడదు. భారతదేశం పరిధిలోని జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, సూరత్గఢ్ వైమానిక స్థావరాల నుంచి… పాకిస్తాన్ వైపు ఉన్న పస్రూర్, లాహోర్, వెహారీ మరియు రహిమ్యార్ ఖాన్ వైమానిక స్థావరాల నుండి పనిచేస్తున్నప్పుడు మాత్రం ఆ దూరం ఐదు కిలోమీటర్ల వరకూ ఉండవచ్చు. ఆయుధ రహిత రవాణా విమానాలూ, హెలికాప్టర్లూ ఎయిర్ అబ్జర్వేషన్ పోస్ట్ (ఎఒపి) విమానాలు మాత్రం ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లతో పాటు రెండవ దేశపు గగనతలంలో ఒక కిలోమీటరు వరకూ పని చేయడానికి అనుమతి ఉంది.
12. రెండు దేశాల విమానాలు అంతర్జాతీయ జలాల్లో మరొక దేశపు ఉపరితల స్థావరాలు, కార్యక్షేత్రాల దగ్గర హడావుడి చేయకూడదు.
13. ఈ అంశాలకు సంబంధించినంత వరకూ గతంలో చేసుకున్న అన్ని ఒప్పందాల స్థానంలో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.
14. ఈ ఒప్పందం ధ్రువీకరణకు లోబడి ఉంటుంది. ధ్రువీకరణ పత్రాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న తేదీ నుండి అమలులోకి వస్తుంది.
15. ఈ ఒప్పందం 1991 ఏప్రిల్ 6న న్యూఢిల్లీలో కుదుర్చుకోవడం జరిగింది.’’
ఈ విధంగా ఉన్న ఒప్పందం మీద భారతదేశం తరఫున నాటి విదేశాంగ శాఖ కార్యదర్శి ముచికుంద్ దూబే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఎం షహర్యార్ ఖాన్ సంతకాలు చేసారు.
పాకిస్తాన్ను భారత్ ఎలా నమ్మింది? :–
భారతదేశం పాకిస్తాన్తో ఈ ఒప్పందం మీద 1991లో సంతకాలు చేసింది. నిజానికి అప్పటికే పాకిస్తాన్ భారతదేశం మీద మూడు యుద్ధాలు చేసింది. దేశ విభజన జరిగిన వెంటనే 1947 అక్టోబర్లో మొదటి యుద్ధాన్ని ప్రకటించింది. 1949 జనవరి 1 అర్ధరాత్రి కాల్పుల విరమణ ప్రకటించే వరకూ ఆ యుద్ధం కొనసాగింది. 1965లో పాకిస్తాన్ రెండోసారి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది. 17 రోజుల పాటు జరిగిన ఆ యుద్ధంలో ఇరుపక్షాలూ వేల సంఖ్యలో సైనికులను కోల్పోయాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి భారతదేశం సాయం చేస్తోందన్న నెపంతో పాకిస్తాన్ మూడోసారి యుద్ధాన్ని ప్రకటించింది. సైనికపరంగా మూడు యుద్ధాల్లోనూ భారతదేశమే గెలిచినా, ఆ ఫలితాలు భారత్కు ఎంతమాత్రం అనుకూలంగా ఉన్నాయంటే సందేహమే.
ఆ యుద్ధాల ఫలితాల విషయం పక్కన పెడితే, మూడు సార్లు ప్రత్యక్షంగా యుద్ధాలకు పాల్పడి, 1947నుంచీ నిరంతరాయంగా జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్తాన్ సైనిక ప్రభుత్వాలను భారతదేశం ఎలా నమ్మింది అన్నది ఎప్పటికీ అర్ధం కాని ప్రశ్న. పరస్పరం సైనిక సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం అని చెప్పినప్పటికీ, నిజానికి పాకిస్తాన్ మొదటినుంచీ దొంగదెబ్బలే తీస్తూ వస్తోంది. అలాంటి దేశం మిలటరీ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని భారత్ ఎలా భావించిందో అర్ధం కాదు. అసలు ఈ ఒప్పందం ఎందుకు చేసుకోవలసి వచ్చిందో అన్న తర్కం అస్సలు అంతు పట్టదు.
భారతదేశంలో రాజకీయ అనిశ్చితి :–
నిజానికి ఆ ఒప్పందం కుదుర్చుకునే సమయానికి భారతదేశంలో రాజకీయ పరిస్థితి అనిశ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ మద్దతుతో ప్రధానమంత్రి అయిన చంద్రశేఖర్ హయాంలో ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. అయితే ఒప్పందంపై సంతకం చేసే సమయానికి కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. సాంకేతికంగా అదే విషయాన్ని చూపించి ఈ ఒప్పందానికీ కాంగ్రెస్కూ సంబంధం లేదని ఆ పార్టీ ప్రతినిధులు వాదిస్తున్నారు. అయితే అతికొద్ది కాలంలోనే గద్దె దిగిపోయిన చంద్రశేఖర్, ఇంత కీలకమైన ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకున్నారు అన్న ప్రశ్నను తరచి చూసుకుంటే కాంగ్రెస్ హస్తం కనిపించక మానదు.
1989 భారత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. పార్లమెంటులో అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేదు. అప్పుడు జనతాదళ్ అధినేత వి.పి సింగ్… ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని నేషనల్ ఫ్రంట్ అనే కూటమి ఏర్పాటు చేసారు. ఆ కూటమికి బిజెపి, కమ్యూనిస్టు పార్టీలు బైటనుంచి మద్దతిచ్చాయి. దాంతో వి.పి సింగ్ ప్రధానమంత్రి కాగలిగినా, పూర్తి పదవీ కాలం నిలబెట్టుకోలేకపోయారు. అయోధ్య రామాలయం కోసం రథయాత్ర చేస్తున్న బీజేపీ సీనియర్ నేత లాల్కృష్ణ ఆఢ్వాణీని బిహార్ అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయించారు. లాలూ అప్పట్లో నేషనల్ ఫ్రంట్లో భాగస్వామిగా ఉండేవారు. దాంతో బీజేపీ ఆ కూటమి నుంచి వైదొలగింది. దాంతో వి.పి సింగ్ ప్రభుత్వం పతనమైంది.
ఒప్పందానికీ కాంగ్రెస్కూ సంబంధం లేదా? :–
వి.పి సింగ్ ప్రభుత్వం నుంచి పలువురిని తన వైపు తిప్పుకోగలిగిన చంద్రశేఖర్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ఆయన 1990 నవంబర్ 10న గద్దెనెక్కారు. అదే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో, చంద్రశేఖర్ ఒక్క యేడాది పాటైనా ప్రధానిగా పని చేయలేదు. ఆ కొద్ది వ్యవధిలోనూ ఎక్కువ కాలం ఆపద్ధర్మ ప్రధానమంత్రిగానే ఉన్నారు. అలాంటి సమయంలో ఇంత పెద్ద నిర్ణయం సొంతంగా తీసుకునే అవకాశం లేదు. పైగా ఇలాంటి కీలక ఒప్పందం నిర్ణయం రోజుల్లో తీసుకునేది కాదు.
చంద్రశేఖర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ 1991 ఫిబ్రవరిలో మద్దతు ఉపసంహరించుకుంది. మరోవైపు ఈ ఒప్పందం మీద 1991 ఏప్రిల్ 6న సంతకాలు జరిగాయి. కాబట్టి సాంకేతికంగా తమకూ, చంద్రశేఖర్ ప్రభుత్వానికీ ఆ సమయానికి ఎలాంటి సంబంధాలూ లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. కాసేపు అదే నిజమని అనుకుందాం. చంద్రశేఖర్ తర్వాత ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహా రావు ఈ ఒప్పందాన్ని అమలు చేసారు. కాంగ్రెస్ ప్రధానమంత్రిగానే ఆయన పనిచేసారు. తన పార్టీ విధానాలను ఆయన ఎప్పుడూ జవదాటలేదు. దాన్ని బట్టే ఈ ఒప్పందం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని అర్ధమవుతుంది.
(సశేషం)