పహల్గామ్లో ముస్లిం ఉగ్రవాదులు భారతీయ హిందువులపై చేసిన ఉగ్రవాద దాడిని తిప్పికొట్టడానికి భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటాక చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్కు పూర్తిగా మతి పోయింది. పాకిస్తాన్లోని 5, పీఓకేలోని 4 ఉగ్రవాద స్థావరాల భారత్ ధ్వంసం చేయడంతో తమ దేశంపైనే భారత్ యుద్ధం చేస్తున్నట్లు ప్రపంచం ముందు నాటకాలు మొదలుపెట్టింది. ప్రతీకార చర్య అన్నట్లుగా గురువారం రాత్రి మన దేశం మీదకు క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్స్, ఫైటర్ జెట్స్ను ప్రయోగించింది. పాక్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ మీద దాడులు చేసింది. జమ్మూలోని విమానాశ్రయంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోని భారతదేశపు సైనిక కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది.
అయితే పాకిస్తాన్కు తీవ్ర పరాభవమే ఎదురయింది. ఆ దేశానికి గత రాత్రి కాళరాత్రిగా మారింది. మన దేశం మీద చేసిన దాడులను భారత సైన్యం సమర్ధంగా ఎదుర్కొంది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్, సర్గోదా ప్రాంతాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. నిజానికి పాకిస్తాన్ భారత్లో 15 లక్ష్యాల మీద క్షిపణులు, డ్రోన్లతో దాడులకు సిద్ధపడింది. దాన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలతో అడ్డుకుంది. పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. గురువారం పాక్ రాజధాని ఇస్లామాబాద్లో ప్రధాని షెబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతున్న సమయంలోనే సైరన్లు మోగాయి.
గురువారం రాత్రి పాక్ మళ్లీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. జమ్మూ, ఉధంపుర్, అఖ్నూర్, పూంఛ్, రాజస్థాన్లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. అదే సమయంలో జమ్మూకశ్మీర్లోని సత్వారా, సాంబా, ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు ప్రయత్నించింది. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలవైపు డ్రోన్లు వచ్చాయి. దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లలోకి వెళ్లిపోయారు. దుకాణాలను మూసివేశారు. భారతదేశపు గగనతల రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది.జమ్మూ సిటీలో విద్యుత్తు సరఫరాను అధికారులు నిలిపేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు మూగబోయాయి. జమ్మూలో పలు సైనిక కేంద్రాలున్నాయి.
దుష్టబుద్ధి పాకిస్తాన్ కేవలం భారత సైనిక స్థావరాలనే కాదు, సాధారణ పౌరుల నివాసాలపై సైతం దాడులకు పాల్పడింది. ఉరీలో పౌర నివాసాలే లక్ష్యంగా దాడులు చేసింది. అనంత్నాగ్లోని ఖుండ్రూలో ఉన్న ఆయుధ డిపో వద్ద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఉద్రిక్తతల దృష్ట్యా అఖ్నూర్, కిష్తవార్, సాంబా సెక్టార్లలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ను భద్రతా కారణాలరీత్యా అర్ధంతరంగా రద్దు చేశారు. పలు రాష్ట్రాల్లో అధికారులకు సెలవులను ప్రభుత్వాలు రద్దు చేశాయి. విద్యా సంస్థలకు సెలవులిచ్చాయి. దిల్లీలో ప్రజలు ప్రముఖ ప్రదేశాల్లో తిరగడాన్ని నిషేధించారు.
‘జమ్మూ, పఠాన్కోట్, ఉధంపుర్లను పాక్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. వెంటనే వాటిని నిర్వీర్యం చేశాం. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు’ అని రక్షణశాఖ అధికార ప్రతినిధి గురువారం రాత్రి తెలిపారు.
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని పారామిలిటరీ బలగాల డైరెక్టర్ జనరల్స్తో స్వయంగా మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు.
పాక్ దుష్ప్రచారం, తిప్పికొట్టిన భారత్:
సరిహద్దుల్లోని భారత సైనిక కేంద్రాలను పేల్చేశామని పాకిస్థాన్ సమాచారశాఖ మంత్రి అత్తావుల్లా తరార్ అంతర్జాతీయ మీడియా ముందు గప్పాలు కొట్టుకున్నారు. 40 నుంచి 50 మంది భారత సైనికులు చనిపోయారని వివరించారు. ఆ ప్రచారాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లనూ సమర్ధంగా అడ్డుకున్నామని స్పష్టం చేసింది.
అటు పాకిస్తాన్లో…. :
లాహోర్ నగరంలో గురువారం పేలుళ్ళు వినిపించాయి. వాల్టన్ విమానాశ్రయం చేరువలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోత మోగింది. దాంతో సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాల్లో విమానాలను రద్దుచేశారు. ఆ పేలుళ్ళు వినిపించిన ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. డ్రోన్ కూలిపోయినందునే ఆ పేలుడు సంభవించి ఉండొచ్చని స్థానిక అధికారులు అంచనా వేసారు. ఆ పేలుళ్ళ శబ్దాలు కరాచీలో కూడా ప్రతిఫలించాయి.
భారతదేశం జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు మరణించారని, నలుగురు సైనికులు, 8మంది పౌరులు గాయపడ్డారని పాకిస్తాన్ ప్రకటించింది. లాహోర్, గుజ్రన్వాలా, చాక్వాల్, బహావల్పుర్, మియానో, కరాచీ, ఛార్, రావల్పిండి, అటోక్లలో ఇజ్రాయెల్ తయారీ 29 హారప్ డ్రోన్లను కూల్చివేశామని పాక్ సైన్యం అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ ఛౌదరి ప్రకటించారు. నాలుగు డ్రోన్లు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతంలో పడ్డాయని అధికారులు తెలిపారు. ఒక డ్రోన్ రావల్పిండి క్రికెట్ స్టేడియం దిశగా వచ్చిందని విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఇస్లామాబాద్లో ఎటువంటి డ్రోన్ దాడులు జరగలేదని డిప్యూటీ కమిషనర్ నవాజ్ మెమన్ తెలిపారు. ఉద్యోగులంతా షెల్టర్లో ఉండాలని లాహోర్లోని అమెరికా కాన్సులేట్ సూచించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ పౌరులకు సూచించింది.
పంజాబ్, రాజస్థాన్లలో… :
బుధవారం అర్ధరాత్రి పంజాబ్లోని ఫిరోజ్పుర్ సెక్టార్లో భారత్లోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్కు చెందిన వ్యక్తిని సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్లు హతమార్చారు. పంజాబ్ ప్రభుత్వం కూడా కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దుల్లోని 6 జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. రాజస్థాన్లో 1,037 కిలోమీటర్లున్న పాక్ సరిహద్దును మూసివేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
‘బాల్ పాకిస్తాన్ కోర్టులోనే ఉంది’:
ఉద్రిక్తతలను తగ్గించగల అవకాశం పాకిస్తాన్ చేతుల్లోనే ఉందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి ద్వారా పాకిస్తానే మొదట ఉద్రిక్తతలకు కారణమైందని ఆయన గుర్తు చేసారు. ‘ఆపరేషన్ సిందూర్తో పహల్గామ్ ఉగ్ర దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాం. భారత్ను పాకిస్తానే రెచ్చగొట్టింది. దానికి భారత్ స్పందించింది. ఇప్పుడు కూడా బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉంది’ అని ఆయన అన్నారు. ‘అంతర్జాతీయ సమాజానికి దాయాది దేశం తప్పుడు సమాచారం అందిస్తోంది. పహల్గాం దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ రెండు సార్లు ప్రకటించుకుంది. మరోవైపు.. తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాక్ చెబుతోంది. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తయ్యిబా ముసుగు సంస్థ అని ఎన్నోసార్లు చెప్పాం. ఐరాసలో పహల్గామ్ ఉగ్రదాడి చర్చల్లో టీఆర్ఎఫ్ పాత్రను పాక్ వ్యతిరేకించింది. తగిన ఆధారాలను ఐరాసకు ఇప్పటికే అందించాం. ఐరాస నిషేధించిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది. ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడాన్ని అందరమూ చూసాం. ఆపరేషన్ సిందూర్లో పాక్ సామాన్య పౌరులు చనిపోయారనేది అబద్ధం. ప్రార్థనా స్థలాలపై దాడి చేసామని చెప్పడమూ అబద్ధమే. సిక్కులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్లోని గురుద్వారాలపై పాక్ దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు’ అని మిస్రీ వివరించారు.
సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు:
పాకిస్థాన్, తమ సరిహద్దుల్లోని భారత రాష్ట్రాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, ఉరీ, పూంఛ్, మెంథార్, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్లు, శతఘ్నులతో కాల్పులకు పాల్పడింది. వాటి కారణంగా బుధ, గురువారాలు రెండు రోజుల్లో 16 మంది మరణించారు. వారిలో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలూ ఉన్నారు. పూంఛ్ సెక్టార్లో హర్యానాకు చెందిన లాన్స్నాయక్ దినేశ్ కుమార్ (32) అమరులయ్యారు.
పాక్ పైలట్ పట్టివేత:
పాకిస్తాన్కు చెందిన ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది. ఒక పైలట్ మన సైన్యానికి చిక్కాడు. అఖ్నూర్లో ఎస్-400 రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్సులోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (అవాక్స్)ను భారత్ ధ్వంసం చేసింది.
దేశంలో హై అలర్ట్:
జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులను అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలో 90 విమాన సర్వీసులను రద్దు చేసారు. రద్దైన వాటిలో 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలను మూసివేశారు.