పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్లో జరుగుతున్న హిందువుల దారుణ హత్యలు, అల్లర్లు, దహనం, హింస, దోపిడీ, పెద్ద ఎత్తున వలసల సంఘటనలపై విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటాయి కానీ బెంగాల్లో మాత్రమే విస్తృతంగా హింస, హిందువులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయని అలోక్ కుమార్ ప్రశ్నించారు. మొత్తం ముర్షీదాబాద్ సంఘటన మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మాల్దాలోని సహాయ శిబిరాల్లో నివసిస్తున్న హిందూ సమాజానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలను సేవ చేయకుండా నిరోధించడం కూడా అమానవీయ చర్య అని ఆయన అన్నారు.
విహెచ్పి అధ్యక్షుడు అలోక్ కుమార్ ఇవాళ కోల్కతా అలీపూర్లోని భాషా భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హిందువుల మీద జరుగుతున్న జిహాదీల దాడులపై మౌనం వహిస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయని, విదేశీ బంగ్లాదేశీయుల హస్తం ఉందని, ఇది అంతర్జాతీయ సమస్య అని ఆమె చెబుతున్నారు కానీ, ఘటనపై ఎన్ఐఏ విచారణకు ఆమె ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. బాధిత హిందువులకు న్యాయం జరగాలని, దాడి చేసిన జిహాదీలకు కఠిన శిక్ష పడాలని తాము కోరుతున్నామని చెప్పారు. దోపిడీకి , దగ్దానికి లేదా ధ్వంసానికి గురైన హిందువుల ఆస్తికి వెంటనే పరిహారం చెల్లించాలి మరియు రాష్ట్రంలో హిందువులకు భద్రత కల్పించాలి అని డిమాండ్ చేసారు.
దేశవ్యాప్తంగా ఏదో ఒక అంశంపై నిరసనలు జరుగుతూనే ఉండడం సహజమే, అయితే గత కొన్నేళ్లుగా బెంగాల్లో ఆ నిరసనల పేరుతో హిందువులపై దాడులు, వారి దారుణ హత్యలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని అలోక్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత, అధికార పార్టీ ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతు లేకుండా తీవ్రవాద, అసాంఘిక శక్తులు అటువంటి దాడులు చేయలేవు. కాబట్టి, నిరసన ఎవరిపై ఉన్నప్పటికీ, నిరసనకారులు హిందువులను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో కూడా విచారణ జరపాలి అని అలోక్ కుమార్ డిమాండ్ చేసారు.
ముర్షీదాబాద్ నుండి మాల్దాకు శరణార్థులుగా వెళ్లవలసి వచ్చిన హిందూ సమాజపు బాధిత హృదయాలకు ఓదార్పునివ్వడం లేదా వారిని ఓదార్చడం మాట దేవుడెరుగు… ఆ బాధిత హిందూ సోదరీమణులు, కుమార్తెలు, పిల్లలు, వృద్ధులు, తదితరులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలను సైతం మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకొంటుండడం దుర్మార్గమని అలోక్ కుమార్ అన్నారు. బాధితులకు ఆహారం, నీరు, ఇతర కనీస జీవిత సౌకర్యాలను అందించడానికి ప్రయత్నిస్తున్న స్వచ్భంద సంస్థలపై ప్రభుత్వం విరుచుకుపడింది. రేపటి నుండి వారికి సహాయం చేయకుండా కూడా ప్రభుత్వం నిషేధించింది. సహాయ సామాగ్రిని తమకు ఇవ్వాలని, తామే స్వయంగా పంచిపెడతామనీ మమతా బెనర్జీ ప్రభుత్వం అంటోంది. ఇది ఎలాంటి ప్రవర్తన? ఇది మానవ జీవిత విలువలతో ఆటలా కాదా! ప్రభుత్వం స్వయంగా పంపిణీ చేయాలనుకుంటే, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఏమిటి? అని అలోక్ కుమార్ నిలదీసారు.
రాష్ట్రంలో, ప్రత్యేకించి ముర్షీదాబాద్లో శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైంది. తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి అనేక బాధిత కుటుంబాలను ప్రభుత్వం బలవంతంగా ముర్షీదాబాద్కు తిరిగి పంపుతోందని అలోక్ కుమార్ చెప్పారు. కేంద్ర బలగాలు భద్రతను పూర్తిగా ఏర్పాటు చేసే వరకు తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ కుటుంబాలు చెబుతున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి అక్కడికి వెళ్లడానికి వారు సిద్ధంగా లేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం హిందువులను బలవంతంగా తోడేళ్ల ముందు విసిరివేయాలని భావిస్తోంది అది వారిని బ్రతికుండగానే చంపడం కాదా? ఆ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి అని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ కోరారు.