అమరావతి రాజధాని పున: నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ షెడ్యూల్ విడుదలైంది. మే 2, సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ పనులు ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనకభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతం నుంచే ప్రధాని అమరావతి రాజధాని పున: నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన పనులను పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది.
ప్రధాని హాజరయ్యే ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ వీరపాండ్యన్ పర్యవేక్షిస్తున్నారు. ప్రముఖులు, ప్రజలు సభా ప్రాంగనానికి సులువుగా చేరుకునేందుకు 9 రహదారులను గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.