తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందంటూ వచ్చిన వార్తలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేసారు. మార్కుల కోసమే అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే దానిపై పునరాలోచన చేయాలని సూచించారు. ఆ మేరకు వెంకయ్య నాయుడు ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసారు.
‘‘ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచిస్తున్నాను. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు, అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం – 2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేసారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత