రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులతో ఇవాళ సచివాలయంలో జరిగిన సమీక్షలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష చేశారు. అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు
ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సీఎం సూచించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ ఫోన్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి…వారు ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా వడదెబ్బ మరణాలు నివారించవచ్చని ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
మార్కెట్లు, బస్స్టాండ్లు, కూలీల అడ్డాలు, ఇతర జన సమూహం ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ శాఖలు సహకారం అందించాలని సూచించారు. 2014-19 మధ్య కూడా ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం నుంచి మజ్జిగ అందించామని….ఈసారి కూడా మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు.
రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాసం కొరతతో పాటు పశువులకు తాగునీరు లభించని పరిస్థితి ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అనేది గుర్తెరిగి అధికారులు తమ ఆలోచనలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. వేసవిలో పశువులు, పక్షుల దాహాన్ని తీర్చుకోడానికి ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు.
పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు
పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని, తప్పనిసరిగా తాగునీరు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు, కార్చిచ్చులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రోన్లతో పర్యవేక్షించాలని సూచించారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా కార్చిచ్చుకు కారణం అయినట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరిగే అస్కారం ఉండేపరిశ్రమల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ.39 కోట్లు విడుదలకు కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీటి లభ్యత పెంచేందుకు గ్రామాల్లో నరేగా ద్వారా ఫాం పాండ్స్ నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా వేసవిలో నరేగా కూలీలకు అదనపు పని దినాలు మంజూరు చేయడంతో పాటు…వారికి పని ప్రాంతంలో నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు ఉపాధి హామీ కూలీలు పనులు ముగించుకుని ఇంటికి చేరుకునేలా చూడాలన్నారు.
ప్రజలు, ఉపాధి కూలీలు, ప్రయాణికులు వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించకుండా చూడాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు, వైద్యులు, వడదెబ్బకు ట్రీట్మెంట్ అందించే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే దోమల నివారణ చర్యలు చేపట్టాలని…తద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు వ్యాధుల భారిన పడకుండా చూడాలన్నారు.
#apchiefminister