ఎన్నారైనంటూ , తన తల్లి అమెరికాలో పెద్ద డాక్టర్ అంటూ పలవురిని పెళ్ళి పేరిట బురిడీ కొట్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనీ తరహా వెబ్సైట్లలో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను మోసగించి వారి నుంచి డబ్బులు దండుకునే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి బీటెక్ మధ్యలో ఆపేశాడు. ఇంజినీరింగ్ చదువుకోసం 2014లో హైదరాబాద్ వెళ్ళాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసి 2015లో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి జూదాలకు బానిసయ్యాడు. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో కొంత మందిని మోసం చేసిన కేసులో అరెస్టై జైలుకు కూడా పోయాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు.
సోషల్ మీడియాలో తప్పుడు అకౌంట్లు ఓపెన్ చేసి తన ఆదాయంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేవాడు. వెయ్యి మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. యానాంకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫొటోను తన సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 50 మంది నిరుద్యోగులను మోసం చేశాడు. పలు కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్ళి వచ్చినా ప్రవర్తనలో మార్పు రాలేదు.
ప్రస్తుతం మ్యాట్రిమోనీ తరహా వెబ్సైట్లలో తప్పుడు సమాచారంతో పలువురిని మోసగించాడు. రెండో పెళ్లి కోసం చూస్తున్న వారు, 30 ఏళ్ల వయసు దాటిన వారినే టార్గెట్ చేశాడు. వాట్సప్ కాల్, చాటింగ్, కాల్స్ ద్వారా దగ్గరవుతాడు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని.. ఐటీ అధికారులు డబ్బు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉన్నారంటూ కథలు చెబుతాడు. అలా ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి 25 లక్షల వరకూ గుంజుతాడు. .
డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బెదిరిస్తాడు. రూ. 11 లక్షలు మోసపోయిన జూబ్లీహిల్స్కు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బెంగుళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.