తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం తప్ప ఇతర స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడం తెలియదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు జయంతి రోజే ఆయన పేరు తొలగించే నిర్ణయాన్ని వెల్లడించడం కాంగ్రెస్ దుష్టవైఖరికి నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు.
‘‘పొట్టి శ్రీరాములు తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడు. అటువంటి గొప్ప త్యాగమూర్తి పేరు మీద ఉన్న “పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం” పేరును మార్చడం తెలుగు భాషను, కోట్లమంది తెలుగువారి గౌరవాన్ని అవమానించే చర్య.
కాంగ్రెస్కు గాంధీ కుటుంబం తప్ప ఏ స్వాతంత్ర్య సమరయోధుల గౌరవించడం తెలియదు. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి, తెలుగువారి గౌరవంగా నిలిచిన పీవీ నరసింహరావు వరకూ సొంత పార్టీ నేతలను సైతం ఎవ్వరినీ కాంగ్రెస్ గౌరవించలేదు.
ఇప్పుడు అదే ద్వేషంతో, తెలుగు భాష కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును ఆయన జన్మదినానే తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువారిపై చూపుతున్న బాధ్యతా రాహిత్య చర్యలకు నిదర్శనం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదివే అయితే, హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చగలరా?
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, తెలుగు ప్రజలను కించపరిచే ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి’’ అని ప్రకటించారు.
ప్రతీ తెలుగు బిడ్డా ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించాలి. బీజేపీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పొట్టి శ్రీరాములుకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్పై పోరాటం చేస్తుంది… అని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేసారు.