కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు… నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది.
సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు… ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలు ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అక్కడి అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
ధార్మిక సంస్థలు, మఠాల పేరిట నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణంలో ఉన్న ఓ మఠానికి నోటీసు జారీచేసిన హైకోర్టు, తిరుమలలో నిర్మాణాలు చేపట్టిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది.
తిరుమలలో అక్రమ నిర్మాణాలపై కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.