వైఎస్ఆర్ కడప జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని కాశినాయన ఆశ్రమం జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాన్ని కొద్దిరోజుల క్రితం అటవీశాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆశ్రమంలోని నిర్మాణాలు అటవీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయంటూ నోటీసులు ఇచ్చామనీ, ఆ తర్వాతే కూల్చేసామనీ అధికారులు చెబుతున్నారు. ప్రతీరోజూ వేలాదిమంది పేదలు, బాటసారులు, యాత్రికుల ఆకలిని తీర్చే అన్నదాన సత్రాన్ని కూల్చివేయడంపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆ వ్యవహారాన్ని ఒక నెటిజన్ ఏపీ విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళాడు. పి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్ మాధ్యమంలో లోకేష్ను టాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ‘‘లోకేష్ అన్నా… కడప జిల్లా శ్రీ కాశినాయన మండల కేంద్రం అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన పరమపదించిన దివ్యస్థలం.ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. ఉన్నట్టుండి అధికారులు వచ్చి ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని కొన్ని భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ సమస్య మీ దృష్టికి రాలేదని అనుకుంటున్నాను . ఈ సమస్య నాలుగు జిల్లాల ప్రజల మనోభావాలకు సంబంధించినది అన్న.. దయచేసి మీరే ఈ సమస్యను పరిష్కరిస్తారని మీ దృష్టికి తీసుకువస్తున్న అన్న’’ అని ట్వీట్ చేసాడు.
ఆ ట్వీట్ నారా లోకేష్ దృష్టికి చేరింది. దానిపై ఆయన వేగంగా స్పందించారు. అన్నసత్రాన్ని కూల్చివేయకుండా ఉండాల్సిందని లోకేష్ అభిప్రాయపడ్డారు. జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పారు, అదే చోట తన సొంత నిధులతో సత్రాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. లోకేష్ తన ట్వీట్లో
‘‘అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం, నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను’’ అని వివరించారు.