ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 1,000 జరిమానా విధించనున్నారు. అలాగే సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే అకౌంట్ ఖాళీ కావడం ఖాయంగా ఉంది. రూ. 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేసేలా కొత్తచట్టంలో పేర్కొన్నారు.
సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ కు రూ. 1,000 , డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5,000 ఫైన్ తో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉంది.
ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 2 వేలు, రెండోసారి రూ. 4 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడిపితే తొలిసారి రూ. 1,500, మళ్ళీ అదే తప్పు చేస్తే రూ. 10 వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,000 జరిమానా చెల్లించాల్సిందే.
రేసింగులపై ఉక్కుపాదం మోపేలా నిబంధనలు తెచ్చారు. తొలిసారి రేసింగ్ కు పాల్పడితే రూ. 5 వేలు, రెండోసారి అదే తప్పు చేస్తే రూ. 10 వేల ఫైన్ విధించనున్నారు.
ఆటో డ్రైవర్లు యూనిఫాం లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 150, రెండోసారి రూ. 300 జరిమానా చెల్లించేలా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాలని వాహనదారులకు సూచించారు.