ఏపీకి అభివృద్ధికి ప్రాధాన్యం : కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని మరోసారి రుజువు అయింది. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల కేటాయింపులో ఏపీకి అదనపు నిధులు కేటాయిస్తోందతి.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY-4) కింద రాష్ట్రానికి 608 రహదారులను మంజూరు చేసింది. మూడు కేటగిరీల్లో పనులు చేపట్టేందుకు కేంద్ర అనుమతించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(DPR)లు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
PMGSY-4 కింద దేశ వ్యాప్తంగా రూ.70,125 కోట్ల విలువైన 62,500 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంచనా విలువలో కేంద్రం 60 శాతం , రాష్ట్రాలు 40 శాతం నిధులు సమకూర్చాలి.
ఏపీకి మంజూరైన రోడ్లను మైదాన ప్రాంతాల్లో 500కు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో, 200మందికి పైగా ఉన్న గిరిజన కొండప్రాంతాల్లో, 100కు పైగా జనాభా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వేయనున్నారు.
పీఎం ఆవాస్ గ్రామీణ్ పథకం కింద ఏపీలో 83,199 ఇళ్లు నిర్మించామని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. కేంద్రబడ్జెట్ 2025-26పై నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడకు వచ్చిన కేంద్రమంత్రి, ప్రజలు, మేధావులతో సమావేశమయ్యారు. కేంద్రప్రభుత్వం, ఏపీకి ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 1.56 కోట్ల మందికి లబ్ధి జరిగిందని, రాష్ట్రంలో 278 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 41.2లక్షల మంది రైతులకే మేలు చేశామన్నారు.