కృష్ణానదీ యాజమాన్య బోర్డు నేడు ఏర్పాటు చేసిన సమావేశం ఫిబ్రవరి 24కు వాయిదా పడింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి ఇరు రాష్ట్రాలకు నీటి వాటాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు నేడు (శుక్రవారం) కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శితో కృష్ణాబోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ మధ్యాహ్నం సమావేశం కావాల్సి ఉంది. కానీ తనకు ముందుగానే నిర్ణయించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందువల్ల ఇవాళ్టి సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని కోరారు.
ఏపీ వినతిని పరగణనలోకి తీసుకున్న కేఆర్ఎంబీ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్ జలసౌధలో ఫిబ్రవరి 24 సాయంత్రం మూడుగంటలకు సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని బోర్డు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారికంగా తెలియజేసింది.