మార్చి 6న రాఘవేంద్రస్వామి 430వ జయంతి
మంత్రాలయంలో గురు వైభవోత్సవాలు మార్చి 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు శ్రీమఠం అధికారులు తెలిపారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మార్చి 1న ఊంజల మండపంలో రాఘవేంద్ర స్వామి 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు . అలాగే 6న రాఘవేంద్రస్వామి 430వ జయంతి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మార్చి 5న తితిదే అధికారులు శ్రీవారి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల సందర్భంగా విశేష పూజలతో పాటు యోగీంద్ర మంటపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన ప్రముఖులు, న్యాయమూర్తులకు గురు వైభవోత్సవ పురస్కారాలను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ప్రదానం చేయనున్నారు.
రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణరెడ్డి, టీజీ భరత్, ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎస్పీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులకు అవార్డులు ఇవ్వనున్నట్లు శ్రీమఠం అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.