‘‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. పరమహంస యోగానంద రచన ‘ఒక యోగి ఆత్మకథ’లో కుంభమేళా గురించి చదివాను. సుమారు మూడు దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారీ రావాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు మహా కుంభమేళాకు రావడం చాలా ఆనందం కలిగిస్తోంది’’ అని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు హాజరై పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. వారితో పాటు అకిరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్, కళా దర్శకుడు ఆనంద సాయి కూడా పుణ్యస్నానాలు చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో ఏకమవుతారు. దాదాపు దేశంలో సగం జనాభా కుంభమేళాకు తరలి రావడం చాలా పెద్ద విషయం. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. ఇది సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరి మహా పండుగగా భావిస్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించి వెళ్లడం మహా అద్భుతం’’ అన్నారు.
మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన మహా కుంభ మేళా లో జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన, సనాతన ధర్మాన్ని నమ్మే వారి పైన ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమే. మహా కుంభ మేళా నిర్వహణలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పని చేస్తోంది. ఒక భారీ సమూహం ఒక చోట గుమి కూడినప్పుడు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. దాన్ని మొత్తంగా సనాతన ధర్మానికి ఆపాదించి, ఆ ధర్మాన్ని నమ్మేవారిపై, సనాతన ధర్మంలో ఆచరించే సంప్రదాయాల నిర్వహణ గురించి ఇష్టానుసారం వ్యాఖ్యానించడం సబబు కాదు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మత ధర్మాలను పాటించే కార్యక్రమాల్లో జరిగితే రాజకీయ నాయకులు ఇలాగే స్పందించేవారా? ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం సులభం. కేవలం హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం కార్యక్రమాల నిర్వహణలో ఏదైనా దుర్ఘటన జరిగితే వెంటనే నాయకులు మాట్లాడటం మొదలుపెడతారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో పని చేసి, పక్కాగా తగిన సౌకర్యాలు కల్పించినా, ఒక్కోసారి అనుకోని విధంగా ఘటనలు జరగడం బాధాకరం. ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు ముందు కూడా పక్కాగా ఏర్పాట్లు చేసినా ఒకేసారి సమూహంలో వచ్చిన కదలిక వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇలాంటి దుర్ఘటనలు దేశంలో ఎక్కడ జరిగినా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని స్పందించాలి. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం మంచిది కాదు” అన్నారు.