బుధవారం నాటి లోక్సభ సమావేశంలో డిఎంకె ఎంపి దయానిధి మారన్ సంస్కృత భాషపై విషం చిమ్మారు. దానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీటైన జవాబిచ్చారు. భారతీయ భాషలైన సంస్కృతం, హిందీ పట్ల డిఎంకె విద్వేషాన్ని నూరిపోస్తోందనడానికి ఆ సంఘటనే నిదర్శనంగా నిలిచింది.
పార్లమెంటులో హిందీ, ఇంగ్లీషు భాషల్లో జరిగే చర్చలను వెంటవెంటనే ఇతర భారతీయ భాషల్లోకి అనువదించి ఎంపీలకు వినిపించే సౌకర్యాన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నారు. ఆ క్రమంలో చర్చలను అనువదించే భాషల్లో సంస్కృతాన్ని కూడా జోడించారు. ఆ విషయాన్ని లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. భారతీయతను అణువణువునా ద్వేషించే డిఎంకె పార్టీకి చెందిన ఎంపి దయానిధి మారన్ ఆ ప్రయత్నాన్ని తప్పుపట్టారు. ఏదో ఘోరం జరిగిపోయిందన్నట్లు నాటకీయంగా డైలాగులు చెప్పారు. అయితే భారతదేశపు భాషా సాంస్కృతిక సంపద గురించి తెలియని అజ్ఞానం నుంచి బైటపడాలంటూ స్పీకర్ ఓం బిర్లా, మరికొందరు ఎంపీలూ దయానిధికి హితవు పలికారు.
బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత పార్లమెంటు చర్చలకు వాస్తవిక సమయంలోనే భారతీయ భాషల్లో అనువాదం అందజేస్తున్న సౌకర్యం మరికొన్ని భాషలకు విస్తరింపజేసామంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కొత్తగా సౌకర్యం కల్పించిన భాషల్లో సంస్కృతం కూడా ఉంది. దాంతో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అడుగడుగునా ద్వేషించే డిఎంకె సభ్యులు తమ నిరసన వ్యక్తం చేసారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు దయానిధి మారన్ లేచి తన నాటకాలు మొదలుపెట్టారు. ‘‘మీరు భారతదేశపు అధికార భాషల్లో (అఫీషియల్ స్టేట్ లాంగ్వేజెస్) అనువాదాల సౌకర్యం కలగజేసారు, బాగుంది. కానీ సంస్కృతం ఏ రాష్ట్రంలో అధికార భాషో చెప్పగలరా? ఆర్ఎస్ఎస్ భావజాలం కోసం ఈ దేశపు ప్రజలు పన్నులు కట్టే సొమ్మును ఎందుకు వృధా చేయాలి? సంస్కృతంలో ఎవరూ మాట్లాడరు. అది ఏ రాష్ట్రంలోనూ అధికార భాష కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం 73వేల మంది ప్రజలు మాత్రమే సంస్కృతం మాట్లాడతారు. అలాంటప్పుడు టాక్స్ పేయర్స్ చెల్లించిన డబ్బును ఎందుకు వృధా చేస్తున్నారు?’’ అంటూ సంస్కృతభాషపై తన విద్వేషాన్ని వెళ్ళగక్కారు.
దయానిధి మారన్ అజ్ఞానపూరిత వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా తక్షణం ఘాటుగా స్పందించారు. ‘‘గౌరవనీయ సభ్యులు ఏ దేశంలో నివసిస్తున్నారు. ఇది భారతదేశం. భారతదేశపు మౌలికమైన ప్రధాన భాష సంస్కృతం. నేను సంస్కృతం ఒక్కదాన్నే కాదు, మొత్తం 22 భాషల గురించి చెప్పాను. మీకు సంస్కృతంపై అభ్యంతరం దేనికి? పార్లమెంటులో 22 గుర్తించబడిన భాషలున్నాయి. సమాంతర అనువాదం హిందీలోనూ, సంస్కృతంలోనూ ఉంటుంది. సంస్కృతాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మీకు హిందీ అన్నా, సంస్కృతం అన్నా సమస్యే’’ అంటూ సూటిగా విమర్శించారు.
సంస్కృతం అధికార భాషేనని మారన్కు తెలీదు:
సంస్కృతం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికార భాష కాదు అంటూ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్య తప్పు అంటూ వెంటనే నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు స్పందించారు. ‘‘ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తమ రాష్ట్రాల్లో సంస్కృతాన్ని అధికార భాషగా ప్రకటించాయి. 2010లో ఉత్తరాఖండ్ సంస్కృతాన్ని రెండవ అధికార భాషగా ప్రకటించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. 2019లో హిమాచల్ ప్రదేశ్ కూడా సంస్కృతాన్ని రెండవ అధికార భాషగా ప్రకటించి అలా చేసిన రెండవ రాష్ట్రంగా నిలిచింది’’ అని సుమంత్ రామన్ అనే వ్యక్తి వివరించారు.
మరోవైపు, దేశంలో సంస్కృతం మాట్లాడేవారి సంఖ్యను దయానిధి మారన్ తప్పు చెప్పారు. 2011 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో సంస్కృతం మాట్లాడేవారి సంఖ్య 23లక్షల 60వేల 821. అంతే తప్ప దయానిధి మారన్ చెప్పినట్లు 73వేలు కాదు.
డిఎంకె ద్వంద్వ వైఖరిని బైటపెట్టిన కేంద్ర మంత్రి:
దయానిధి మారన్ వ్యాఖ్యలు అసందర్భమైనవి, ద్వంద్వ వైఖరితో కూడుకున్నవి అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. ‘‘సంస్కృతం మీద దయానిధి మారన్ అవాంఛిత వ్యాఖ్యలు ఏమాత్రం బాగోలేవు. భారతదేశపు భాషా సంప్రదాయాల వారసత్వం మీద డిఎంకె పార్టీ పాక్షిక ధోరణి, హిపోక్రసీ, దుష్ప్రచారాలను దయానిధి మారన్ వ్యాఖ్యలు బైటపెట్టాయి. విభజన రాజకీయాలు చేయడమే దేశప్రజల పన్నుల సొమ్మును నిజంగా వృధా చేయడం’’ అని ట్వీట్ చేసారు.
ఈ సందర్భంగా డిఎంకె తన ద్రవిడ భావజాల ప్రచారంలో భాగంగా సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న సంస్కృత వ్యతిరేక, హిందీ వ్యతిరేక వైఖరి మరోసారి చర్చకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో దయానిధి మారన్ హిందూ వ్యతిరేక వైఖరిని దుయ్యబడుతున్నారు. భారతదేశంలోని అన్ని భాషలకూ తల్లి సంస్కృతమేనని గుర్తు చేస్తున్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని, సనాతన ధర్మాన్నీ తుడిచి పెట్టేసేందుకు దయానిధి మారన్, డిఎంకె ప్రయత్నిస్తున్నాయంటూ మండిపడుతున్నారు.
తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి దయానిధి మారన్ హిపోక్రసీని బైటపెట్టారు. 2011లో దయానిధి మారన్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా టెలిఫోన్ ఎక్స్ఛేంజినే కొల్లగొట్టి బీఎస్ఎన్ఎల్ను లూటీ చేసిన సంగతిని గుర్తు చేసారు. అప్పట్లో 440 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన దయానిధి మారన్ ఇప్పుడు పార్లమెంటు ప్రొసీడింగ్స్ అనువాదం విషయంలో ప్రజాధనం వృధా అయిపోతోందంటూ గగ్గోలు పెడుతుండడం ద్వంద్వ వైఖరి అని విరుచుకుపడ్డారు. సిగ్గులేకుండా సంస్కృతాన్ని వ్యతిరేకించడమే ద్రవిడ నమూనా అని దుయ్యబట్టారు.
భారత్లో సంస్కృతానికి పెరుగుతున్న ప్రాధాన్యత:
డిఎంకె అభ్యంతరాల సంగతి అలా ఉంచితే, సంస్కృతానికి ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోంది. పార్లమెంటులో సమాంతర వ్యాఖ్యానం చేసే భాషల్లో తాజాగా బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, సంస్కృతం, ఉర్దూ అనే ఆరు భాషలను కలిపారు. ఇంగ్లీషు, హిందీలతో పాటు ఇప్పటికే అస్సామీస్, బంగ్లా, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు భాషల్లో సమాంతర వ్యాఖ్యానం అందుబాటులో ఉంది.
‘‘తమిళం, సంస్కృతం సోదర భాషలు. సంస్కృతంలో అనంతమైన విజ్ఞానం ఉంది. అత్యంత విలువైన శాస్త్రీయ, మేధోపరమైన జ్ఞానసంపద సంస్కృతంలో ఉంది. ఆ సంగతులు దయానిధి మారన్కు తెలియదు. అలాంటి వారిని తమిళనాడు నుంచి ఎంపీలుగా ఎన్నుకోవడం దురదృష్టకరం’’ అని తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు ప్రొఫెసర్ కనగసభాపతి వ్యాఖ్యానించారు.
‘‘సంస్కృతం తెలుసుకోకుండా తమిళ చరిత్రను తెలుసుకోలేము. తమిళ చరిత్ర సంస్కృతంలో ఉన్న శిలాశాసనాల్లో నమోదై ఉంది. ఒక్క తమిళనాడులోనే సంస్కృత భాషలో 4వేలకు పైగా శిలా శాసనాలు, రాగి శాసనాలు ఉన్నాయి’’ అని టిఎస్ కృష్ణన్ అనే తమిళుడు ట్వీట్ చేసారు.
‘‘కేరళ త్రిశూర్లోని అకాడమీ ఆఫ్ షరియా అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ సంస్థ విద్యార్ధులు అరబిక్తో పాటు సంస్కృతం కూడా అభ్యసిస్తారు. భగవద్గీత, మహాభారతంలోని శ్లోకాలు వల్లె వేస్తారు’’ అని ఎతిరాజన్ శ్రీనివాసన్ గుర్తు చేసారు.
‘‘సంస్కృతం అన్ని భాషలకూ తల్లి. కర్ణాటక బిజాపూర్లోని ఒక వస్త్రదుకాణంలో అందరూ సంస్కృతంలో సంభాషిస్తారు’’ అని మరో నెటిజన్ తెలియజేసారు.
తమిళంలోని పంచ మహాకావ్యాల్లో ఒకటైన ‘శిలప్పదికారం’కు వ్యాఖ్యానం రాసిన అడియారక్కు నల్లర్ అనే భాషావేత్త దయానిధి మారన్కు తగిన జవాబిచ్చారు. సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా వాడేవారని శిలప్పదికారం ద్వారా తెలుస్తోంది. ఆ భాషలో సరిగ్గా మాట్లాడలేనివారిని చూసి జనాలు నవ్వుకునే వారు. అయినా అటువంటివారు తమకు భాష రాదని ఒప్పుకునేవారు కాదు, తమకు వచ్చినంతలోనే సంస్కృతం మాట్లాడేవారు’’ అని చెప్పుకొచ్చారు.
తమిళనాడుకు చెందిన, సంస్కృతం వచ్చిన పాత్రికేయులు సెంకోట్టై శ్రీరామ్, అంతత్తి కృష్ణన్ ఇలా చెప్పారు ‘‘ఇతిహాసాలు, ఉపనిషత్తులు, నాలుగు వేదాలు, పురాణాలు, రామాయణ మహాభారతాల వంటి గొప్ప రచనలు అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయని దయానిధి మారన్కు తెలియదు. అది దేవభాష. దాని లిపి దేవనాగరి లిపి. హిందీ భాషకు కూడా అదే లిపి. తమిళం, సంస్కృతం అత్యంత ప్రాచీన భాషలు. దూరదర్శన్, ఆకాశవాణిల్లో ప్రతీరోజూ ఉదయం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. సంస్కృతంలో ‘సుధర్మ’ అనే దినపత్రిక వస్తోంది. ఆ పత్రిక 2009లో ఇ-పేపర్ కూడా ప్రారంభించింది. కర్ణాటకలోని మట్టూరు గ్రామంలో నిత్యవ్యవహారంలో మాట్లాడే భాష సంస్కృతం. భారతదేశంలో పూర్తిగా సంస్కృతంలోనే మాట్లాడే కొన్ని గ్రామాల్లో అదొకటి’’ అని వివరించారు.