అమెరికాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యుఎస్ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) అనే ప్రభుత్వరంగ సంస్థను ఫ్రీజ్ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుఎస్ఎయిడ్ సంస్థ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడమే. అయితే ఆ సంస్థ ఎలాంటి పనులకు నిధులు సమకూరుస్తూ వచ్చిందన్న వివరాలు ఇప్పుడు బైటపడ్డాయి. అమెరికా ప్రజలు పన్నులు కట్టిన సొమ్ములతో వివిధ దేశాల్లో, ప్రత్యేకించి భారతదేశంలో ప్రభుత్వాలను అస్థిరపరచడం, మన దేశంలో ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఏర్పాటు చేయడం, తప్పుడు కథనాలను వ్యాపింపజేసేందుకు మీడియా సంస్థలను ప్రోత్సహించడం ప్రధానంగా ఆ సంస్థ చేపట్టిన పనులు అని వెల్లడయింది.
భారత వ్యతిరేకి, ప్రపంచ కోటీశ్వరుడు అయిన జార్జి సోరోస్ ఆ సంస్థ వెనుక అండగా ఉన్నాడని కూడా పలు నివేదికల వల్ల తెలుస్తోంది. భారతదేశంలోను, బంగ్లాదేశ్లోనూ ప్రభుత్వాలను అస్థిరపరచడానికి జార్జి సోరోస్ యుఎస్ ఎయిర్ సంస్థను వాడుకున్నాడని సమాచారం. భారత్ను ఎలాగైనా పడగొట్టాలనేది సొరోస్, అతని మనుషుల చిరకాల అజెండా. దానికోసమే యుఎస్ ఎయిడ్ సంస్థ, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు చెందిన ఆర్థిక విభాగం ఫతా-ఎ-ఇన్సానియత్ (ఎఫ్ఇఐ)కు నిధులు సమకూర్చిందన్న సంగతి ఇప్పుడు వెలుగు చూసింది.
మొదట్లో లష్కరే తయ్యబా ఆర్థిక విభాగంగా జమాత్ ఉద్ దావా ఉండేది. దాన్ని అమెరికా, భారత్ ఉగ్రవాద సంస్థగా నిర్ధారించాయి. ఆ తర్వాత ఫతా ఎ ఇన్సానియత్ను ఏర్పాటు చేసారు. ముంబైలో ఆరుగురు అమెరికన్లు సహా 166మందిని చంపిన 26/11 దాడులకు సూత్రధారి లష్కరే తయ్యబా సంస్థే. అలాంటి ఎల్ఈటీ సంస్థకు ఫతా ఎ ఇన్సానియత్ అనే ముసుగు సంస్థ ద్వారా యుఎస్ ఎయిడ్ నిధులు సమకూరుస్తూ ఉండేది. నిజానికి జమాత్ ఉద్ దావా సంస్థ ద్వారా లష్కర్ ఎ తయ్యబా సంస్థకు ఉగ్రవాద కార్యకలాపాల నిమిత్తం నిధులు వెడుతుండేవని తెలిసినందునే అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్, పాకిస్తాన్ను గ్రే లిస్ట్లో పెట్టింది. జమాత్ సంస్థను అమెరికా నిషేధించింది.
ఆ నిషేధాన్ని తప్పించుకోడానికి లష్కర్-ఎ-తయ్యబా సంస్థ ఫతా-ఎ-ఇన్సానియత్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. నేటికీ ఆ సంస్థకు నిధులు స్వచ్ఛంద కార్యక్రమాల కోసం విరాళాల పేరు మీదనే అందుతున్నాయి. కానీ ఆ నిధుల్లో పెద్దమొత్తం లష్కర్-ఎ-తయ్యబాకు చేరుతున్నాయి. ఆ సంస్థ ఆ నిధులను జమ్మూకశ్మీర్లో దాడులు చేయడానికి ఉపయోగిస్తోంది.
మాతృసంస్థ లష్కర్-ఎ-తయ్యబాను అమెరికా నిషేధించినా, ఫతా-ఎ-ఇన్సానియత్ సంస్థకు నిధులు అందించడాన్ని యుఎస్ఎయిడ్ ఆపకపోవడం దిగ్భ్రాంతికరం. అంతేకాదు, ఎఫ్ఇఐ మీద నిషేధం విధించాక కూడా అమెరికా విరాళాల్లో సగానికి పైగా నిధులను యుఎస్ఎయిడ్ సంస్థ అదే ఎఫ్ఇఐకి అందించేది. ఫతా ఎ ఇన్సానియత్ సంస్థ జమాత్ ఉద్ దావాకు మరో రూపమని అమెరికా నిఘా వర్గాలకు, విదేశాంగ శాఖకూ తెలిసినా కూడా ఈ నిధుల పందేరం ఆగలేదు.
అమెరికాలోని మిచిగన్ కేంద్రంగా పనిచేసే ‘హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్’ (హెచ్హెచ్ఆర్డి) అనే ముస్లిం దాతృత్వ సంస్థ నిధులను సమకూర్చేది. ఆ నిధులు యుఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా ఎఫ్ఇఐకు చేరేవి. అక్కడినుంచి ఆ సొమ్ములు లష్కర్-ఎ-తయ్యబాకు అందేవి. హెచ్హెచ్ఆర్డి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోందంటూ ఆ సంస్థపై 2019లోనే ఆరోపణలున్నాయి. ఆ సమస్య గురించి అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ టి మెక్కాల్ 2023లో బైటపెట్టాడు. ‘‘యుఎస్ఎయిడ్ సంస్థ 2021 అక్టోబర్లో ‘ఓషన్ ఫ్రైట్ రీఇంబర్స్మెంట్’ ప్రోగ్రామ్ కింద హెచ్హెచ్ఆర్డీ సంస్థకు 1లక్షా 10వేల డాలర్లు అందజేసింది. ఉగ్రవాద సంస్థలు, వాటికి నిధులు సమకూర్చేవారు, ఇతర అతివాద గ్రూపులతో హెచ్హెచ్ఆర్డికి సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపణలు చాలాకాలంగా ఉన్నప్పటికీ హెచ్హెచ్ఆర్డి సంస్థకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తూ వచ్చింది’’ అని మెక్కాల్ ఆరోపించారు.
2019లోనే హెచ్హెచ్ఆర్డికి, ఉగ్రవాదులకూ ఉన్న సంబంధాల గురించి దర్యాప్తు చేయాలని అమెరికా కాంగ్రెస్లోని ముగ్గురు సభ్యులు కోరారు. అలాగే, ఆ స్వచ్ఛంద సంస్థపై ఆరోపణలను సమగ్రంగా సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే వరకూ, నిధులు సమకూర్చడానికి విరామం ఇవ్వాలని మెక్కాల్ పిలుపునిచ్చాడు. అన్ని విమర్శలు ఉన్నప్పటికీ యుఎస్ఎయిడ్ సంస్థ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2023లో హెచ్హెచ్ఆర్డి సంస్థకు 73వేల డాలర్ల నిధులు సమకూర్చింది.
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చాక యుఎస్ఎయిడ్ సంస్థ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. అంటే ఇకపై జిహాదీ అనుకూల ఫతా ఎ ఇన్సానియత్ సంస్థకు గతంలోలా స్వేచ్ఛగా నిధులు అందబోవు.
‘ఆజాద్ కశ్మీర్’కు నిధులు:
పాక్ ఆక్రమిత కశ్మీర్ వివాదాస్పద భూభాగం అని ప్రపంచం మొత్తానికీ తెలుసు. భారత్ ఎన్నిసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కశ్మీర్ విషయంలో అమెరికా ఎప్పుడూ జోక్యం చేసుకుంటూనే ఉంటుంది. అదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ భాగాన్ని అమెరికా సైతం ఆజాద్ కశ్మీర్ అని వ్యవహరిస్తూ ఉంటుంది.
యుఎస్ఎయిడ్ వెబ్సైట్లోని ఒక పేజీ పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తమ జోక్యం గురించి స్పష్టంగా వివరిస్తుంది. ‘‘మెరుగైన ఉపాధ్యాయుల ద్వారా మౌలిక విద్యలో నాణ్యతను మెరుగుపరచేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా ప్రభుత్వం అండగా నిలవడానికి కట్టుబడి ఉంది. బలమైన, దృఢమైన, సమృద్ధమైన పాకిస్తాన్ నిర్మాణానికి సహాయం చేసే విషయంలో అమెరికా ప్రభుత్వపు దీర్ఘకాలిక నిబద్ధతకు నిదర్శనమే, పాకిస్తానీ ఉపాధ్యాయులకు స్కాలర్షిప్ పథకం’’ అని యుఎస్ఎయిడ్ మిషన్ డైరెక్టర్ జాక్ కాన్లీ ప్రకటించారు. ఆజాద్ (పాక్ ఆక్రమిత) కశ్మీర్లో 150 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు నిధుల గురించిన ప్రకటన అది.
ఆ ప్రకటన పీఓకేలో విద్యాశాఖ మంత్రి గురించి కూడా ప్రస్తావించింది. టీచర్లకు ఉపకార వేతనాలు ఇవ్వడం ద్వారా వేలాది మంది పాకిస్తానీయులకు నాణ్యమైన విద్య అందుకునే అవకాశం కల్పించినందుకు ఆజాద్ (పాక్ ఆక్రమిత) కశ్మీర్ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ వహీద్ అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఆజాద్ కశ్మీర్ స్కాలర్షిప్ కార్యక్రమం యుఎస్ఎయిడ్ సంస్థకు చెందిన 7.5 కోట్ల డాలర్ల టీచర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో ఒక భాగం మాత్రమే. యుఎస్ఎయిడ్ సంస్థ అక్కడితో ఆగలేదు. పాకిస్తాన్లో ఈమధ్యనే ప్రారంభించిన రెండు డిగ్రీ ప్రోగ్రామ్లకు కరిక్యులమ్ రూపొందించడం, అభివృద్ధి చేయడంలో ఆ దేశపు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. వాటిలో ఒకటి నాలుగేళ్ళ బ్యాచిలర్ డిగ్రీ, రెండవది రెండేళ్ళ అసోసియేట్ డిగ్రీ. ఆ ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్ వ్యాప్తంగా మొత్తం 1900 మంది విద్యార్ధులకు ఉపకార వేతనాలు అందుతాయి. ఇప్పటికే వందకు పైగా స్కాలర్షిప్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని విద్యార్ధులకు అందజేసారు.
యుఎస్ఎయిడ్ మౌలిక విద్యా కార్యక్రమం పాకిస్తాన్లో వచ్చే ఐదేళ్ళలో 32లక్షల మంది పిల్లలకు చదవడం నేర్పే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ పథకంలో ఒక భాగం ఆజాద్ (పాక్ ఆక్రమిత) కశ్మీర్లో విద్యార్ధులకు ఉపకార వేతనాల కార్యక్రమం. దానికింద పీఓకేలో సుమారు 800 పాఠశాలల నిర్మాణం చేపడతారు. 90 కళాశాలల్లో కొత్త డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రారంభిస్తారు. 12వేల మంది విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందజేస్తారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ నిజానికి భారతదేశంలో అంతర్భాగం అని మన దేశం తన వైఖరిని పదేపదే స్పష్టం చేసిన తర్వాత కూడా యుఎస్ఎయిడ్ సంస్థ పీఓకేలో చదువుల పేరిట పాకిస్తాన్కు నిధులు సమకూర్చడం కొనసాగించింది. ‘‘పీఓజేకే విషయంలో భారత పార్లమెంటు కలసికట్టుగా ఉంది. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఆ వైఖరికి తమ మద్దతు ప్రకటించాయి. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్లో భాగం కాదు అనే వాదనను మేము ఎప్పుడూ ఒప్పుకోలేదు, ఎప్పటికీ ఒప్పుకోము. ఇది మా అందరి సమైక్య విధానం’’ అని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పార్లమెంటులో చెప్పారు.
అయినా, జార్జి సోరోస్ అండదండలతో పాకిస్తాన్కు నిధులు సమకూర్చి, తద్వారా భారత్కు వ్యతిరేకంగా కుట్రలను యుఎస్ఎయిడ్ కొనసాగించింది. జో బైడెన్ హయాంలో అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయిన యుఎస్ఎయిడ్కు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు శరాఘాతంలా తగిలాయి.