తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలకం రేపుతోంది. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమ్మోలంకలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో మూడు రోజుల్లో 11 వేల కోళ్లు మృతి చెందినట్లు పశువైద్యాధికారులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వెటర్నరీ వైద్యులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపాలని అధికారులకు సూచించారు.
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారు.