చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు రంగరాజన్పై అమానుష దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రంగరాజన్పై జరిగిన దాడి దేవాలయ వ్యవస్థపై, అర్చక వ్యవస్థపై, సామాజిక సంస్కరణ వ్యవస్థపై, ఇంకా యావత్ హిందూ సమాజంపై జరిగిన దాడిగా వీహెచ్పీ అభివర్ణించింది.
దాడికి పాల్పడ్డ సంఘ విద్రోహ శక్తులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు భోజనపల్లి నర్సింహ మూర్తి, జాతీయ అధికార మీడియా ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. సనాతన ధర్మపరంపరకు అవమానం కలిగించిన దోషులను హిందూ సమాజం ఏనాటికీ క్షమించదన్నారు.
రంగరాజన్ మీద దాడి ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, నిందితుల వెనుకనున్న సంఘవిద్రోహ శక్తులను చట్టప్రకారం ఉక్కుపాదంతో అణిచివేసే చర్యలు పోలీసులు వెంటనే తీసుకోవాలని వారు కోరారు. రంగరాజన్కు పటిష్ఠ భద్రత కల్పించాలని తెలంగాణా ప్రభుత్వానికి సూచించారు.
హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం, హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి రంగరాజన్ చేస్తున్న ఉద్యమంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది.
యజ్ఞం నిర్వహిస్తున్న మునులపై దాడులకు పాల్పడిన రాక్షసులను శ్రీరామచంద్రుడు కఠినంగా దండించి రామరాజ్యంలో శాంతిని కాపాడాడని, అదే విధంగా నేడు చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్పై రాక్షస భావజాలంతో దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వీహెచ్పీ కోరింది.