ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనీసం 20 రోజుల పాటు సభ నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. 24న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై స్పష్టంత రానుంది.
శాసనసభకు నూతనంగా ఎన్నికైన సభ్యుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరికి అవగాహన తరగతులు నిర్వహించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు.
అసెంబ్లీ సమావేశాల కంటే ముందు ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాలులో ఈ శిక్షణా తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సభ్యుల విధులు, సభలో సభ్యులు నడుచుకోవాలసిన తీరు సహా పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై సభ్యులకు విలువైన సూచనలు, సలహాలు అందించనున్నారు.