జమ్మూకశ్మర్ బోర్డర్ వద్ద భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు చొరబాటుదారులను భారత ఆర్మీ మట్టుబెట్టింది.
ప్రాణాలు కోల్పోయిన వారిలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా ఉన్నారని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అల్ బదర్ ఉగ్రవాద గ్రూపుకు చెందిన వారు కూడా ఉన్నట్టు భావిస్తున్నారు.
ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినం పాటించారు. ఆ సమయంలో భారత్ లోకి చొరబడేందుకు పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదులు ప్రయత్నించారు. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ పరిధిలోని కృష్ణా ఘాటి వద్ద ఈ ఘాతుకానికి పాల్పడగా భారత జవాన్లు భగ్నం చేశారు.
ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునేందుకు వీలుగా భారత సైన్యం దృష్టి మరల్చేలా పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) కాల్పులు జరిపింది. ఓ భారత సైనిక పోస్టుపై కాల్పులకు దిగగా భద్రతా బలగాలు దీటుగా తిప్పికొట్టాయి.