ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణదారుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
తాజా మార్గదర్శకాల మేరకు పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇవ్వనున్నాయి. అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్డీఏ మినహా అన్ని ప్రాంతాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ మార్గదర్శకాలను విడుదల చేశారు.
కొత్త మార్గదర్శకాల మేరకు 300 చదరపు మీటర్లు మించని నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేశారు.
అర్కిటెక్చర్లు, ఇంజినీర్లు, టౌన్ ప్లానర్లు నిర్మాణదారుల తరఫున దరఖాస్తు చేసేలా అవకాశం కల్పించింది. నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన నిర్మాణ అనుమతుల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టారు.