ఏపీ సీఐడి అధికారులు మద్యం తయారీ డిస్టలరీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది డిస్టలరీల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. తిరుపతి సమీపంలోకి కరకంబాడి వద్దనున్న డిస్టలరీ, ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని గండేపల్లి వద్ద నిర్వహిస్తోన్న సెంటనీ డిస్టలరీ, అనకాపల్లి సమీపంలోని కశీంపేట, విశాఖలోని మరో డిస్టలరీతోపాటు, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిర్వహిస్తోన్న మద్యం డిస్టలరీల్లో సీఐడి సోదాలు నిర్వహిస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. ఆ సమయంలో వైసీపీ నేతలే ఈ డిస్టలరీలను స్వాధీనం చేసుకుని ఛీప్ లిక్కర్ తయారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీఐడి సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ ఎగవేత, మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్లు లేకుండా చేయడం ద్వారా వేల కోట్ల అవినీతి సొమ్మును దారి మళ్లించారనే దానిపై కూడా సీఐడి అధికారులు విచారణ చేస్తున్నారు.